దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మాజీ మేనేజర్ దిశా సలియాన్ మరణానికి సంబంధించిన కేసులో రూ. 500 కోట్ల విలువైన లీగల్ నోటీసు జారీ అయింది. శివసేన (యుబిటి) నాయకుడు ఆదిత్య థాకరే, ఎన్సీపీ (ఎస్పీ) నాయకుడు, మహారాష్ట్ర మాజీ హోం మంత్రి అనిల్ దేశ్ముఖ్ నుండి దిశా తండ్రి సతీష్ సలియాన్ రూ. 500 కోట్ల నష్టపరిహారాన్ని కోరారు.
న్యాయం కోసం సతీష్ సలియాన్ చేస్తున్న పోరాటాన్ని “రాజకీయ ప్రేరేపితం”గా చిత్రీకరించడానికి ఈ ఇద్దరు నాయకులు ప్రయత్నించారని ఆ నోటీసు ఆరోపిస్తోంది. ఆ నోటీసు ప్రకారం, మార్చి 23, 2025న అనిల్ దేశ్ముఖ్ మాట్లాడుతూ, దిశా సలియాన్ కేసు అనేది “ఆదిత్య థాకరే పరువు తీయడానికి పన్నిన కుట్ర” అని పేర్కొన్నారు. ఈ ప్రకటనకు “విస్తృత ప్రచారం” లభించిందని, తద్వారా సతీష్ సలియాన్ను “అవినీతిపరుడు, రాజకీయ ప్రేరేపిత, దురుద్దేశపూరిత వ్యాజ్యదారుడు, అలాగే క్రిమినల్ న్యాయ వ్యవస్థను దుర్వినియోగం చేసే వ్యక్తి”గా చిత్రీకరించారని ఆరోపణలు ఉన్నాయి.
ఆదిత్య ఠాక్రే, అనిల్ దేశ్ముఖ్లు చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, ఏడు రోజుల్లో బహిరంగంగా, ఎలాంటి షరతులు లేని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆ క్షమాపణను ప్రధాన ముద్రణ, టెలివిజన్, డిజిటల్ మీడియా వేదికల్లో ప్రచురించాలని కూడా నోటీసులో కోరారు. డిమాండ్లు నెరవేర్చకపోతే సివిల్ పరువు నష్టం కేసుతో పాటు క్రిమినల్ చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.
ముంబైలోని మలాడ్ ప్రాంతంలో ఉన్న ఒక ఎత్తైన నివాస భవనం నుండి కింద పడి 28 ఏళ్ల దిశా సలియాన్ జూన్ 8, 2020న మరణించారు. పోలీసులు ఈ ఘటనను ప్రమాదవశాత్తు జరిగిన మరణంగా పరిగణించి, ‘యాక్సిడెంటల్ డెత్ రిపోర్ట్’ నమోదు చేశారు. ఆరు రోజుల తర్వాత నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణించారు. కొన్ని రోజుల తర్వాత, మొదట్లో ఎటువంటి నేర కోణం లేదని భావించిన దిశా తండ్రి, ఎఫ్ఐఆర్ నమోదు, కొత్తగా దర్యాప్తు కోరుతూ బాంబే హైకోర్టును ఆశ్రయించారు.
ఆరేళ్ల తర్వాత ఇప్పుడు సిబిఐఈ కేసు దర్యాప్తును చేపట్టింది. దిశా సలియాన్ కేసును సీబీఐ అప్పటికే దర్యాప్తు చేసి, తనకు ‘క్లీన్ చిట్’ ఇచ్చిందని “తప్పుగా పేర్కొన్నారని” కూడా ఈ నోటీసు థాక్రేపై ఆరోపణలు చేస్తోంది. తనను “వేధించడానికి దిశా సలియాన్ను ఒక సాధనంగా వాడుకుంటున్నారని” థాక్రే ఆరోపించినట్లు సమాచారం. అనిల్ దేశ్ముఖ్ ఈ వాదనను సమర్థించారు. ఈ కేసులో సీబీఐ తన పేరును ఎఫ్ఐఆర్ లో చేర్చిన రెండు రోజుల తర్వాత, బుధవారం నాడు ఆదిత్య థాక్రే దిశా సలియాన్తో తనకు ఎటువంటి సంబంధం లేదని ఖండించారు.

More Stories
యుపిఐ చార్జీలపై కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి
కన్నడ లెజెండ్ అనంత్ నాగ్కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు
ఛత్తీస్గఢ్లో 29 మందిని చంపిన మావోయిస్టులకు 10 మందికి మరణ శిక్ష