సెన్సార్ బోర్డులో ప్రీతి జింటా, పంకజ్ త్రిపాఠి, సునీల్ శెట్టి

సెన్సార్ బోర్డులో ప్రీతి జింటా, పంకజ్ త్రిపాఠి, సునీల్ శెట్టి
 
* బోర్డులో తెలుగు సినీ నిర్మాత సుప్రియా యార్లగడ్డ
 

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్‌సీ)ను కేంద్ర ప్రభుత్వం 18 మంది సభ్యులతో పునర్వ్యవస్థీకరించింది. 2017 తర్వాత సుదీర్ఘ విరామం అనంతరం ఈ బోర్డును అధికారికంగా కేంద్రం పునర్నిర్మించింది. ప్రస్తుతం సీబీఎఫ్‌సీ ఛైర్‌పర్సన్‌గా తెలుగు వారైన శశి శేఖర్ వేంపటి సారథ్యంలో ఈ బోర్డు పనిచేయనుంది. కేంద్రం జారీ చేసిన ప్రకారం కొత్త బోర్డు మూడేళ్ల పాటు లేదా తదుపరి ఆదేశాలు వెలువడే వరకు.. ఏది ముందైతే అది వర్తించే విధంగా అది వర్తించే విధంగా కొనసాగుతుంది.

ఈ నూతన పాలకవర్గంలో టాలీవుడ్ ప్రముఖ నిర్మాత, వ్యాపారవేత్త సుప్రియ యార్లగడ్డకు అత్యంత ప్రతిష్టాత్మక స్థానం దక్కింది. నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు మనవరాలిగా సినీ రంగ ప్రవేశం చేసిన సుప్రియ.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తొలి చిత్రం ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’లో కథానాయికగా తెలుగు ప్రేక్షకులను అలరించారు. 

ఆ తర్వాత నటనకు స్వస్తి పలికి చిత్ర నిర్మాణ రంగంపై దృష్టి సారించారు. ప్రస్తుతం ప్రతిష్టాత్మక అన్నపూర్ణ స్టూడియోస్ వ్యవహారాలను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సీఈవోగా వ్యవహరిస్తున్నారు.  దేశవ్యాప్తంగా సినీ సర్టిఫికేషన్ వ్యవహారాలు, రివైజింగ్ కమిటీల పనితీరును మరింత సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లేందుకు ఈ నూతన కమిటీ బాధ్యతలు నిర్వర్తించనుంది.

బాలీవుడ్ ప్రముఖ నటీమణులు ప్రీతి జింటా, పల్లవి జోషి, రూపాలీ గంగూలీ, సీనియర్ నటులు సునీల్ శెట్టి, పంకజ్ త్రిపాఠి, మనోజ్ జోషి, బెంగాలీ సూపర్ స్టార్ ప్రసేన్‌జిత్ ఛటర్జీ, దర్శకుడు ప్రియదర్శన్, గ్రామీ అవార్డు గ్రహీత రిక్కీ కేజ్, వినోద్ అనుపమ్, అభిషేక్ జైన్, హన్స్‌రాజ్ హన్స్, యతీంద్ర మిశ్రా, నీలా మాధబ్ పాండా, నిషిగంధ వాడ్, వామన్ కేంద్రే, రమేష్ పతాంగేలను ఇతర సభ్యులుగా నియమించారు.