హైదరాబాద్లో గణేష్ నిమజ్జనాలపై మరోసారి వివాదం మొదలైంది. చెరువుల పరిరక్షణ, పర్యావరణ అంశాలను దృష్టిలో పెట్టుకుని నిమజ్జనాల విషయంలో హైడ్రా తీసుకుంటున్న నిర్ణయాలపై గణేష్ ఉత్సవ సమితి అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. హైడ్రా అభివృద్ధి చేసిన చెరువుల్లో విగ్రహాల నిమజ్జనానికి అనుమతి ఇవ్వకూడదన్న నిర్ణయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
దీంతో ఈసారి గణేష్ ఉత్సవాల సమయంలో నిమజ్జనాల నిర్వహణ ఎలా ఉంటుందన్న దానిపై ఆసక్తి నెలకొంది. నగరంలో గణేష్ ఉత్సవాలకు సమయం దగ్గరపడుతున్న వేళ నిమజ్జనాల అంశం తెరపైకి వచ్చింది. చెరువులను ఆధునీకరించి, వాటి సహజ స్వరూపాన్ని కాపాడేందుకు చర్యలు చేపడుతున్న హైడ్రా కొన్ని అభివృద్ధి చేసిన చెరువుల్లో నిమజ్జనాలకు అనుమతి ఇవ్వకూడదనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
చెరువుల్లో రసాయనాలు, ఇతర వ్యర్థాలు కలవకుండా చూడటంతో పాటు నీటి వనరుల పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని హైడ్రా భావిస్తోంది. అయితే హైడ్రా వైఖరిపై గణేష్ ఉత్సవ సమితి తీవ్రంగా స్పందిస్తోంది. ఏళ్లుగా హైదరాబాద్లోని వివిధ చెరువుల్లో గణేష్ విగ్రహాల నిమజ్జనం జరుగుతోందని సమితి ప్రతినిధులు గుర్తుచేస్తున్నారు. ఈసారి కూడా గతంలో మాదిరిగానే నిమజ్జన కార్యక్రమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేస్తున్నారు.
భక్తుల విశ్వాసాలతో ముడిపడిన నిమజ్జన కార్యక్రమాన్ని ఒక సంస్థ నిర్ణయం తీసుకుని అడ్డుకోవడం సరికాదని వారు అభిప్రాయపడుతున్నారు. నిమజ్జనాలను నిలిపివేసే అధికారం హైడ్రాకు లేదని గణేష్ ఉత్సవ సమితి వాదిస్తోంది. ఉత్సవాల నిర్వహణ, నిమజ్జనాల విషయంలో ప్రభుత్వం, పోలీసు శాఖ, ఇతర సంబంధిత విభాగాలు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొంటోంది.
నిమజ్జనాలకు సంబంధించి ముందుగానే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని, భక్తులకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతోంది. మరోవైపు చెరువుల అభివృద్ధి, పరిరక్షణ కూడా ముఖ్యమేనన్న వాదన వినిపిస్తోంది. నిమజ్జనాల కారణంగా చెరువుల్లో నీటి నాణ్యత దెబ్బతినకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పర్యావరణ వర్గాలు చెబుతున్నాయి. విగ్రహాల తయారీలో ఉపయోగించే పదార్థాలు, రంగులు, ఇతర సామగ్రి నీటిలో కలవడం వల్ల చెరువులపై ప్రభావం పడే అవకాశం ఉందని పేర్కొంటున్నాయి.
దీంతో నిమజ్జన సంప్రదాయాన్ని కొనసాగిస్తూనే చెరువులకు నష్టం కలగకుండా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో హైడ్రా, గణేష్ ఉత్సవ సమితి మధ్య నెలకొన్న విభేదాలకు ప్రభుత్వం ఎలా పరిష్కారం చూపుతుందన్నది ఆసక్తికరంగా మారింది. ఒకవైపు భక్తుల మనోభావాలు, సంప్రదాయాలను గౌరవించాల్సి ఉండగా. మరోవైపు నగరంలోని చెరువులను పరిరక్షించాల్సిన బాధ్యత కూడా ఉంది.
రెండు అంశాలను సమన్వయం చేస్తూ నిమజ్జనాలకు ఏర్పాట్లు చేస్తే వివాదానికి ముగింపు పలికే అవకాశం ఉంది. నిమజ్జనానికి అనుమతించే చెరువులు, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు, భద్రతా చర్యలపై స్పష్టత రావాల్సి ఉంది. దీంతో ఈసారి హైదరాబాద్ గణేష్ నిమజ్జనాలపై ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

More Stories
నేపాల్ జల విద్యుత్ సొరంగాల్లో భారత్, చైనా సైనిక నిపుణుల అన్వేషణ
ఎయిర్ వైస్ మార్షల్ ర్యాంకుకు తొలి మహిళా అధికారి
రాబోయే 20 ఏళ్లలో మేనేజ్మెంట్ విద్యపై ప్రొఫెసర్ నారాయరెడ్డి గ్రంధం