తెలంగాణ మీదుగా రూ. 7,000 కోట్లతో ఎల్పీజీ పైప్‌లైన్లు

తెలంగాణ మీదుగా రూ. 7,000 కోట్లతో ఎల్పీజీ పైప్‌లైన్లు
దేశంలో ఇంధన భద్రతను పటిష్టం చేయడంతో పాటు గృహావసరాలకు సురక్షితంగా  ఎల్‌పీజీ  గ్యాస్ సరఫరా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోలియం, నేచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డు (పిఎన్ జి ఆర్బీ) దేశవ్యాప్తంగా 1,800 కిలోమీటర్ల మేర 3 వ్యూహాత్మక ఎల్‌పీజీ  పైప్‌లైన్ల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. దాదాపు రూ. 7,000 కోట్ల అంచనా వ్యయంతో ప్రభుత్వ రంగ దిగ్గజం  గెయిల్  (ఇండియా) ఈ భారీ ప్రాజెక్టును చేపట్టనుంది.
 
 బృహత్తర ప్రాజెక్టు ద్వారా తెలంగాణ రాష్ట్రానికి గణనీయమైన లబ్ధి చేకూరనుంది. ఇందులో భాగంగా తెలంగాణలోని చర్లపల్లి నుంచి మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌ వరకు 556 కిలోమీటర్ల పొడవైన పైప్‌లైన్‌ను ఏర్పాటు చేయనున్నారు. దీనితోపాటు ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ నుంచి ఉత్తరాఖండ్‌లోని సితార్‌గంజ్ వరకు (611 కి.మీ.), మహారాష్ట్రలోని శిక్రాపూర్ నుంచి కర్ణాటక, గోవాలోని హుబ్లీ వరకు (633 కి.మీ.) మరో రెండు ప్రధాన మార్గాలను కూడా నిర్మించనున్నారు.

ఈ పైప్‌లైన్లు తెలంగాణ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, కర్ణాటక, గోవా రాష్ట్రాల గుండా వెళతాయి. ఈ ప్రాజెక్టు పూర్తయితే దేశంలోని మొత్తం ఎల్‌పీజీ పైప్‌లైన్ నెట్‌వర్క్ ప్రస్తుతం ఉన్న 7,700 కిలోమీటర్ల నుంచి 9,500 కిలోమీటర్లకు విస్తరిస్తుంది. పైప్‌లైన్ల ద్వారా గ్యాస్ సరఫరాను పెంచడంవల్ల రవాణా ఖర్చులు తగ్గడమే కాకుండా, రహదారులపై ట్రాఫిక్ రద్దీ, ప్రమాదాల ముప్పు కూడా గణనీయంగా తగ్గుతాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది.

ఈ కొత్త ప్రాజెక్టులు ఇప్పటికే ఉన్న పైప్‌లైన్ మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేస్తాయి; ఇందులో దేశంలోనే అత్యంత పొడవైన 2,757 కిలోమీటర్ల కాండ్లా-గోరఖ్‌పూర్ ఎల్‌పీజీ పైప్‌లైన్ కూడా ఉంది. రవాణా విధానాన్ని రోడ్డు మార్గం నుండి పైప్‌లైన్లకు మార్చడం వల్ల, ట్యాంకర్ ట్రక్కుల ద్వారా ప్రమాదకరమైన ఇంధనాన్ని తరలించడంలో ఉండే ముప్పులు కూడా తగ్గుతాయి.

భారతదేశం దిగుమతి చేసుకునే ఎల్‌పిజిపై గణనీయంగా ఆధారపడి ఉంది. దేశంలోని వివిధ ప్రాంతాల్లోని వినియోగ కేంద్రాలకు రవాణా చేయడానికి ముందు, తీరప్రాంత దిగుమతి టెర్మినళ్లకు భారీ పరిమాణంలో ఎల్‌పిజి అందుతుంది. పైప్‌లైన్ నెట్‌వర్క్‌ను విస్తరించడం వల్ల దేశీయంగా ఎల్‌పిజి రవాణా మరింత సమర్థవంతంగా మారుతుందని, అలాగే సరఫరాల విశ్వసనీయత మెరుగుపడుతుందని భావిస్తున్నారు.