పార్లమెంట్‌లో ‘స్మార్ట్‌’ పరికరాలు వాడొద్దు

పార్లమెంట్‌లో ‘స్మార్ట్‌’ పరికరాలు వాడొద్దు
జులై 20 నుంచి ఆగస్టు 13 వరకు జరిగే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భంగా భద్రత, సభ్యుల వ్యక్తిగత గోప్యత, పార్లమెంటరీ హక్కుల పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని స్మార్ట్‌వాచ్‌లు, స్మార్ట్‌గ్లాసులు, పెన్‌ కెమెరాలు వంటి ఆధునిక ఎలక్ట్రానిక్‌ పరికరాల వినియోగంపై అప్రమత్తంగా ఉండాలని  లోక్‌సభ సచివాలయం ఎంపీలకు పలు కీలక సూచనలు జారీ చేసింది.

ప్రస్తుతం దేశంలో స్మార్ట్‌వాచ్‌లు, స్మార్ట్‌గ్లాసులు, పెన్‌ కెమెరాలు వంటి పరికరాలు విస్తృతంగా అందుబాటులో ఉన్నాయని పేర్కొంది. ఈ పరికరాల్లో కొన్ని రహస్యంగా చిత్రాలు, వీడియోలు రికార్డు చేసే సదుపాయాలు కలిగి ఉండటంతో వాటిని దుర్వినియోగం చేసే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. పార్లమెంట్‌ ఆవరణలో ఇలాంటి పరికరాలను ఉపయోగించడం వల్ల ఇతర సభ్యుల వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగే ప్రమాదం ఉందని సచివాలయం తెలిపింది. 

అలాగే పార్లమెంటరీ హక్కులు ఉల్లంఘించబడే అవకాశమూ ఉందని పేర్కొంది. అందువల్ల సభ్యులు స్మార్ట్‌ పరికరాల వినియోగంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేసింది. ముఖ్యంగా భద్రతా వ్యవస్థలకు ఇబ్బంది కలిగించేలా లేదా ఇతర సభ్యుల గోప్యతకు భంగం కలిగించే విధంగా ఈ పరికరాలను వినియోగించవద్దని స్పష్టం చేసింది.

సాంకేతిక పరిజ్ఞానం విస్తరిస్తున్న నేపథ్యంలో ఆధునిక పరికరాల వల్ల ఏర్పడే ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని ఈ సూచనలు జారీ చేసినట్లు తెలిపింది. ఇదిలా ఉండగా, పార్లమెంట్‌ ఆవరణలో చేపట్టే నిరసన కార్యక్రమాలపైనా లోక్‌సభ సచివాలయం స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. సభ్యులు పార్లమెంట్‌ ప్రాంగణంలో ధర్నాలు, ఆందోళనలు, నిరసనలు నిర్వహించవద్దని కోరింది. 

అలాగే ప్లకార్డులు ప్రదర్శించడం, నినాదాలు చేయడం, బ్యానర్లు ప్రదర్శించడం వంటి చర్యలకు కూడా దూరంగా ఉండాలని సూచించింది. ఇటీవలి కాలంలో కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికతతో రూపొందించిన చిత్రాలు, పోస్టర్లు విస్తృతంగా వినియోగంలోకి వచ్చాయని పేర్కొంటూ, అలాంటి ఏఐ చిత్రాలను పార్లమెంట్‌ ఆవరణలో ప్రదర్శించవద్దని సూచించింది. 

అదేవిధంగా అవమానకరమైన లేదా అభ్యంతరకరమైన వ్యాఖ్యలు, నినాదాలతో కూడిన ప్లకార్డులు, బ్యానర్లు తీసుకురావడం కూడా నిషేధితమేనని స్పష్టం చేసింది. అంతేకాకుండా పార్లమెంట్‌ ప్రాంగణంలో ఆయుధాల ప్రదర్శన, మతపరమైన కార్యక్రమాల నిర్వహణ వంటి చర్యలను కూడా అనుమతించబోమని బులెటిన్‌లో పేర్కొంది.  

సమావేశాల సమయంలో ఇతర సభ్యులు తమ ఛాంబర్లకు, కార్యాలయాలకు సులభంగా వెళ్లేలా చూడాలని కూడా లోక్‌సభ సచివాలయం కోరింది. ఈ నేపథ్యంలో పార్లమెంట్‌ ప్రవేశ ద్వారాలు, మార్గాల వద్ద ఎలాంటి నిరసనలు లేదా ప్రదర్శనలు నిర్వహించవద్దని సభ్యులకు విజ్ఞప్తి చేసింది.  గత బడ్జెట్‌ సమావేశాల సమయంలో సస్పెన్షన్‌కు గురైన కొందరు ఎంపీలు పార్లమెంట్‌ గేట్ల వద్ద నిరసనలు నిర్వహించిన విషయం తెలిసిందే.