జార్ఖండ్ రాజధాని రాంచీలో నివారణ్పూర్లో ఉన్న ఆర్ఎస్ఎస్ ప్రాంతీయ కార్యాలయంపై కొందరు గుర్తుతెలియని దుండగులు పెట్రోల్ బాంబులతో దాడికి ప్రయత్నించారు. అర్ధరాత్రి దాదాపు 12.36 గంటల సమయంలో బైక్పై వచ్చిన ఇద్దరు దుండగులు కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని పెట్రోల్ బాంబులు విసిరి అక్కడి నుంచి వేగంగా పరారయ్యారు.
ఇద్దరు గుర్తు తెలియని దుండగులు ఆర్ఎస్ఎస్ ఆఫీసుకు సమీపంలోకి కారుతోపాటు బైకుపై వచ్చారు. కొంతదూరంలో తమ వాహనాల్ని ఆపేసి, ఆఫీసు వద్దకు నడుచుకుంటూ వచ్చారు. ఆఫీస్ వద్దకురాగానే రెండు పెట్రోల్ బాంబులు తీసి, వాటిని వెలిగించి విసిరేశారు. అయితే, ఒక పెట్రోల్ బాంబు గాల్లోనే పేలిపోయింది. మరోటి పేలకుండానే కిందపడిపోయింది.
దీనిలోని పెట్రోల్ అంతా ఒలికిపోయింది. దీంతో ఈ ఘటనలో ఎలాంటి నష్టం సంభవించలేదు. సాధారణంగా పెట్రోల్ బాంబుల పేలుడుతో మంటలు భారీగా అంటుకుంటాయి. కానీ, ఈ బాంబులు సరిగ్గా పేలకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ దాడికి సంబంధించిన దృశ్యాలన్నీ కార్యాలయం బయట అమర్చిన సీసీటీవీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డయ్యాయి. ఈ సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా స్థానిక పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.
ఈ ఘటనపై కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి, బీజేపీ సీనియర్ నేత సంజయ్ సేథ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాంచీలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు జరిగిన ఓ పెద్ద కుట్రగా ఆయన దీనిని అభివర్ణించారు. దుండగులు విసిరిన మొదటి పెట్రోల్ బాంబు గాల్లోనే పేలిపోగా, రెండోది భూమిపై పడి పగిలిందని, అయితే ప్రమాదవశాత్తూ అందులోని పెట్రోల్ మంటలు వ్యాపించకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని ఆయన వివరించారు.
ఘటన జరిగిన సమయంలో ఆఫీసులోపల అనేక బైకులు పార్క్ చేసి ఉన్నాయని, లోపల ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఉన్నారని, ఒకవేళ మంటలు అంటుకుని ఉంటే భారీ నష్టం జరిగేదని ఆందోళన వ్యక్తం చేశారు. రాంచీ ఆర్ఎస్ఎస్ కార్యాలయం వద్ద శాశ్వత పోలీస్ పికెట్ ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఘటన జరిగిన సమయంలో ఆఫీసులోపల అనేక బైకులు పార్క్ చేసి ఉన్నాయని, లోపల సిబ్బంది కూడా ఉన్నారని తెలిపారు. బాంబులు పేలి ఉంటే భారీ ప్రమాదం జరిగేదన్నారు. రాంచీలో అల్లర్లు సృష్టించేందుకే ఈ దాడి చేశారని ఆరోపించారు
మరోవైపు జార్ఖండ్ అసెంబ్లీ ప్రతిపక్ష నేత బాబూలాల్ మరాండీ కూడా ఈ ఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇది ఏదో పెద్ద వినాశనానికి లేదా కుట్రకు జరిగిన ముందస్తు ప్రయత్నంగా కనిపిస్తోందని, దీనిని సాధారణ ఘటనగా కొట్టిపారేయలేమని స్పష్టం చేశారు. ఈ ఘటనను తేలిగ్గా తీసుకోకూడదని, తీవ్రంగా పరిగణించాలని ఆయన సూచించారు.
ఈ విషయంపై రాంచీ డీఎస్పీ కేవీ రమన్ స్పందిస్తూ ఘటనా స్థలం నుంచి రెండు సీసాలను స్వాధీనం చేసుకున్నామని, ఎఫ్ఎస్ఎల్ బృందం వాటిని పరిశీలిస్తోందని వెల్లడించారు. ఈ వ్యవహారం సున్నితత్వాన్ని దృష్టిలో ఉంచుకుని, నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకోవడానికి సైబర్ డీఎస్పీ సహా పలువురు ఉన్నతాధికారులతో కూడిన ప్రత్యేక బృందం నిందితుల కోసం గాలిస్తోందని, త్వరలోనే వారిని పట్టుకుంటామని స్పష్టం చేశారు. అలాగే, ఆర్ఎస్ఎస్ కార్యాలయం వద్ద భద్రతను కూడా కట్టుదిట్టం చేశారు.ఈ ఘటనతో రాంచీలో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది.

More Stories
త్వరలో ఎస్పీలో భారీ చీలిక.. బీజేపీ వైపు ఆ పార్టీ నేతలు!
అయోధ్య రామమందిరం విరాళాలపై రాజకీయ దుమారం
పరస్పర విశ్వాసమే నేడు అత్యంత ముఖ్యమైన వ్యూహాత్మక ఆస్తి