ఏపీకి చెందిన టెకీ హర్యానాలో దారుణ హత్య

ఏపీకి చెందిన టెకీ హర్యానాలో దారుణ హత్య
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన టెకీ హర్యానాలో దారుణ హత్యకు గురయ్యాడు. కృష్ణా జిల్లా గుడివాడ బేతవోలుకు చెందిన బండ్ల రిషికేష్ (27) పది రోజుల కిందటే హర్యానా పంచకులలోని ‘వేది టెక్నాలజీస్’ అనే సంస్థలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌‌గా చేరి పంచకులలోని పింజోర్ అమరావతి ప్రాంతంలో ఓ గదిని ఏప్రిల్ 4న అద్దెకు తీసుకున్నాడు.  అయితే, గురువారం ఉదయం చాలా సేపటి వరకూ టెకీ బయటకు రాకపోవడంతో ఇంటి యజమాని తలుపుకొట్టినా లోపలి నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో ఆయన ఆందోళనకు గురైన పోలీసులకు సమాచారం ఇచ్చాడు.
పోలీసులు అక్కడకు చేరుకుని తలుపులను తెరిచి చూడగా రిషికేష్ రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉన్నాడు. ఘటనా స్థలంలో ఒక కూరగాయల కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దానిపై రక్తపు మరకలు కూడా ఉన్నట్లు గుర్తించారు. ఆ గదిలో హతుడి మొబైల్‌తో పాటు మరో ఫోన్‌ కూడా లభ్యమైంది. ఆ ఫోన్ లాక్ చేసి ఉండటంతో, ఎటువంటి సమాచారం లభించలేదని పోలీసులు తెలిపారు.

రిషికేష్ కుటుంబానికి పోలీసులు సుమారు 50 సార్లు ఫోన్ చేసినా, కాల్స్‌కు సమాధానం ఇవ్వలేదు. దీంతో గుడివాడ పోలీసుల ద్వారా రిషికేష్ తల్లిదండ్రులకు సమాచారం అందించారు.  ఇదిలా ఉండగా, ఆ గదిలోని గోడలపై రక్తంతో ఇంగ్లీషు, ఇతర భాషలలో రాసిన సందేశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఆ సందేశాన్ని అర్థంచేసుకోవడానికి తాము ప్రయత్నిస్తున్నామని పోలీసులు తెలిపారు. 

ఇంగ్లీషులో ఉన్న ఒక్క లైన్ ‘‘నేను పోలీసులకు ఫోన్ చేయలేకపోతున్నాను’’ అని స్పష్టంగా ఉంది.  గది తలుపులు లోపలి నుంచి వేసి ఉండటంతో పోలీసులు దీనిని తొలుత రిషికేశ్ ఆత్మహత్యకి పాల్పడ్డారేమోనని భావించినప్పటికీ, మృతదేహంపై ఉన్న కత్తిపోట్లు, గాయాలు చూస్తుంటే ఇది పక్కా ప్రణాళికతో జరిగిన హత్యేనని స్థానికులు అనుమానిస్తున్నారు.

మృతదేహంపై మెడ, చేతుల భాగంలో కత్తిపోట్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. గదిలోని సామాన్లు కూడా ఎక్కడికక్కడా చెల్లాచెదురుగా పడి ఉండటం, టీవీ కూడా కింద పడి ఉండడం చూస్తుంటే అక్కడ తీవ్రస్థాయిలో పెనుగులాట జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.