పాకిస్థాన్‌ మధ్యవర్తిత్వంపై నమ్మకం లేదన్న ఇజ్రాయెల్‌

పాకిస్థాన్‌ మధ్యవర్తిత్వంపై నమ్మకం లేదన్న ఇజ్రాయెల్‌

* వైమానిక దాడిలో హెజ్​బొల్లా నాయకుడి కార్యదర్శి మృతి

అమెరికా-ఇరాన్‌ మధ్య కుదిరిన కాల్పుల విరమణకు సంబంధించిన చర్చల్లో పాకిస్థాన్‌ పాత్రపై ఇజ్రాయెల్‌ సందేహం వ్యక్తంచేసింది. పాకిస్థాన్‌ మధ్యవర్తిత్వంపై తమకు నమ్మకం లేదని పేర్కొంది. భారత్‌ లోని ఇజ్రాయెల్‌ రాయబారి రూవెన్‌ అజార్‌ ఓ వార్తాసంస్థతో మాట్లాడుతూ పాకిస్థాన్‌ను తాము విశ్వసించలేమని, అమెరికా తన స్వప్రయోజనాల కోసం పాక్‌ మధ్యవర్తిత్వాన్ని ఉపయోగించుకోవాలని నిర్ణయించుకున్నదని తాము భావిస్తున్నట్లు అజార్‌ తెలిపారు. 

ఈ సందర్భంగా ఖతార్‌, తుర్కియే వంటి సమస్యాత్మక దేశాల ద్వారా హమాస్‌తో అమెరికా కుదుర్చుకున్న ఒప్పందం గురించి అజార్‌ ప్రస్తావించారు. ఇరాన్‌లో తాము అనుకున్న లక్ష్యాలు సాధించేందుకు యూఎస్‌ సమన్వయంతో ముందుకుసాగడం తమకు చాలా ముఖ్యమని అన్నారు. ఇక అమెరికా-ఇరాన్‌ మధ్య కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణకు మద్దతు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. 

అయితే లెబనాన్‌పై మాత్రం తమ సైనిక చర్యలు కొనసాగుతాయని పునరుద్ఘాటించారు. ఇరాన్‌పై జరిపిన ఆపరేషన్‌కు, లెబనాన్‌కు ఎలాంటి సంబంధం లేదని అజార్‌ స్పష్టం చేశారు. దక్షిణ లెబనాన్‌ ప్రాంతం నుంచి హెజ్‌బొల్లా మౌలిక సదుపాయాలను పూర్తిగా నిర్మూలించడమే తమ లక్ష్యమని చెప్పారు. అది ఇజ్రాయెల్‌ బాధ్యతగా అభివర్ణించారు. ఇరాన్‌తో జరగబోయే చర్చల ద్వారా రెండు ప్రధాన ముప్పులు తొలగిపోవాలని ఇజ్రాయెల్ కోరుకుంటోంది.

ఒకటి ఇరాన్ అణు కార్యక్రమం, రెండు బాలిస్టిక్ క్షిపణుల ఉత్పత్తి. ఈ రెండు అంశాల్లో అమెరికా ప్రతిపాదించిన 15 పాయింట్ల ప్రణాళిక అమలు కావాలని అజార్ ఆకాంక్షించారు. మరోవంక, ఇజ్రాయెల్, లెబనాన్‌ల మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న నేపథ్యంలో, బుధవారం బీరూట్‌పై జరిపిన వైమానిక దాడుల్లో హెజ్​బొల్లా సెక్రటరీ-జనరల్ నయీమ్ ఖాసెమ్ వ్యక్తిగత కార్యదర్శి అలీ యూసుఫ్ హర్షీని హతమార్చినట్లు ఇజ్రాయెల్ రక్షణ దళాలు గురువారం ప్రకటించాయి. 

“ఖాసెమ్‌కు అత్యంత సన్నిహితుడు, వ్యక్తిగత సలహాదారు అయిన హర్షీ, ఆయన కార్యాలయాన్ని నిర్వహించడంలో, భద్రపరచడంలో కీలక పాత్ర పోషించారు. లిటానీ నదికి దక్షిణంగా ఆయుధాలను తరలించడానికి హెజ్​బొల్లా ఉపయోగించే రెండు కీలక క్రాసింగ్‌లపై, అలాగే దక్షిణ లెబనాన్‌లోని సుమారు 10 ఆయుధ నిల్వ కేంద్రాలు, లాంచర్లు, కమాండ్ సెంటర్లపై కూడా ఐడిఎఫ్ దాడి చేసింది” అని ఐడిఎఫ్ తెలిపింది. 
 
హిజ్‌బుల్లా ప్రాబ‌ల్యం ఉన్న ప్రాంతంపై దాడి జ‌రిగింది. ఆ దాడిలో ఓ బ‌హుళ అంత‌స్తు బిల్డింగ్ నేల‌మైన‌ట్లు వీడియోలు రిలీజ్ అయ్యాయి. అయితే ఖాసిమ్‌ మేన‌ల్లుడే హ‌ర్షి. అత‌ని ప‌ర్స‌న‌ల్ సెక్ర‌ట‌రీ కూడా ఆయ‌నే.  ద‌క్షిణ లెబ‌నాన్‌లోకి ఆయుధాల‌ను స్మ‌గ్లింగ్ చేస్తున్న లితాని న‌దిపై ఉన్న క్రాసింగ్‌ల‌ను పేల్చివేసిన‌ట్లు ఐడీఎఫ్ పేర్కొన్న‌ది. హిజ్‌బుల్లా ద‌ళాలు ఈ మార్గంలోనే వేల సంఖ్య‌లో ఆయుధాలు, రాకెట్లు, లాంచ‌ర్ల‌ను స్మ‌గ్లింగ్ చేస్తున్న‌ట్లు ఐడీఎఫ్ చెప్పింది. 
 
కాగా, ఈ కాల్పుల విరమణ ఇరాన్‌, అమెరికా మిత్రదేశాలైన ఇజ్రాయిల్‌, గల్ఫ్‌ అరబ్‌ దేశాలకు మాత్రమే వర్తిస్తుందని, లెబనాన్‌కు వర్తించదని  అమెరికా ఉపాధ్యక్షుడు జెడివాన్స్‌ స్పష్టం చేశారు.  అయితే, లెబనాన్ పై ఇజ్రాయిల్ దాడులను ఇరాన్ తీవ్రంగా ఖండిస్తూ  ఈ దాడుల వల్ల రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందం కుప్పకూలే ప్రమాదం ఉందని, హార్మూజ్ జలసంధిలో మళ్లీ ఉద్రిక్తతలు పెరుగుతాయని హెచ్చరించింది.
 
మరోవంక, యుద్ధనౌకలు, విమానాలు, సైనిక సిబ్బంది, ఆయుధాల వంటివన్నీ ఇరాన్‌, దాని పరిసర ప్రాంతాల్లోనే యుద్ధం ముగింపునకు సంబంధించి పూర్తిస్థాయి ఒప్పందం అమలయ్యేంత వరకు ఉంటాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ స్పష్టం చేశారు. ఒకవేళ ఒప్పందాన్ని ఇరాన్‌ పాటించకపోతే, తాము మునుపెన్నడూ చూడనంత స్థాయిలో విరుచుకు పడతామని హెచ్చరించారు.