ఆర్‌ఎస్‌ఎస్‌పై అమెరికా నివేదిక పట్ల మేధావుల ఆగ్రహం

ఆర్‌ఎస్‌ఎస్‌పై అమెరికా నివేదిక పట్ల మేధావుల ఆగ్రహం

* `మేధో దివాళా’ నివేదిక అన్న 275 మంది మాజీ న్యాయమూర్తులు, ప్రభుత్వ అధికారులు, సాయుధ దళాల మాజీ సైనికులు 

ఆర్‌ఎస్‌ఎస్‌పై నిషేధాన్ని సిఫార్సు చేసిన  అంతర్జాతీయ మత స్వేచ్ఛపై అమెరికా ప్రభుత్వ కమిషన్ (యూఎస్‌సీఆర్‌ఎఫ్‌)  2026 వార్షిక నివేదికను 275 మంది మాజీ న్యాయమూర్తులు, ప్రభుత్వ అధికారులు, పదవీ విరమణ చేసిన సైనిక అధికారులు తీవ్రంగా ఖండించారు. దీనిని “తీవ్ర దురుద్దేశపూరితమైనది”గా అభివర్ణిస్తూ, ఇది “మేధో దివాలా మరియు, వికృతమైన లెక్కలను” ప్రదర్శిస్తోందని వారు మండిపడ్డారు. 

శనివారం విడుదల చేసిన ఒక సంయుక్త ప్రకటనలో, భారత ప్రజల మదిలో వారికున్న సద్భావనను దెబ్బతీయడమే లక్ష్యంగా ఉన్న స్వార్థ ప్రయోజనాల దృష్ట్యా,  యూఎస్‌సీఆర్‌ఎఫ్‌ లోని ఈ “తీవ్ర పక్షపాతపూరిత,  నిలకడలేని నివేదిక”కు సహకరించిన వారందరి నేపథ్యాలను కఠినంగా తనిఖీ చేయాలని అమెరికా ప్రభుత్వాన్ని కోరారు.

 “ఆస్తులను స్తంభింపజేయడం, భారతీయ పౌరుల రాకపోకలను పరిమితం చేయడం, ఆర్‌ఎస్‌ఎస్‌తో సంబంధం ఉన్నవారిపై ఆంక్షలు విధించడం వంటి  యూఎస్‌సీఆర్‌ఎఫ్‌  సిఫార్సులు తీవ్ర దురుద్దేశపూరితమైనవి,  ఇవి మేధో దివాలా, వికృతమైన నిర్ధారణలను ప్రదర్శిస్తున్నాయి,” అని సంతకం చేసినవారు సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు.

 “యూఎస్‌సీఐఆర్‌ఎఫ్‌లోని ఆరుగురు కమిషనర్లందరినీ అమెరికా ప్రభుత్వమే నియమిస్తుంది. వీరికి యూఎస్ కాంగ్రెస్ ద్వారా అమెరికా పన్ను చెల్లింపుదారుల నిధులు సమకూరుతాయి. యూఎస్‌సీఐఆర్‌ఎఫ్‌లో ఈ నివేదికకు సహకరించిన వారందరి నేపథ్యాలను కఠినంగా తనిఖీ చేయాలని మేము అమెరికా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము” అని కోరారు. 

అప్పుడు భారత ప్రజలతో తమకున్న సద్భావనను దెబ్బతీయడానికి, భారత్‌కు వ్యతిరేకంగా ఉన్న కొందరు స్వార్థపరుల రహస్య అజెండాను ప్రోత్సహించేందుకు, అత్యంత పక్షపాతంతో కూడిన, నిలకడలేని నివేదికలను రూపొందించడానికి యూఎస్‌సీఐఆర్‌ఎఫ్‌ అమెరికా పన్ను చెల్లింపుదారుల నిధులను దుర్వినియోగం చేస్తోందనే విషయం వారికి కనువిప్పు కలిగిస్తుందని వారు స్పష్టం చేశారు. 

తగినంత సందర్భం లేకుండా ఆర్‌ఎస్‌ఎస్ వంటి భారతీయ సంస్థలను, సామాజిక-సాంస్కృతిక సంస్థలను ప్రతికూల దృక్పథంతో చిత్రీకరించే యూఎస్‌సీఐఆర్‌ఎఫ్‌ పునరావృత ధోరణిపై కూడా ఆ ప్రకటన ఆందోళన వ్యక్తం చేసింది.  “తరచుగా సరైన స్థూల-స్థాయి ఆధారాలు లేకుండా, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) వంటి భారతీయ సంస్థలను, సామాజిక-సాంస్కృతిక సంస్థలను అత్యంత ప్రతికూల కోణంలో చిత్రీకరించే యూఎస్‌సీఐఆర్‌ఎఫ్‌ పునరావృత ధోరణిని ఇది చూపిస్తుంది” అని ధ్వజమెత్తారు. 

“ఇది విశ్లేషణాత్మక సమతుల్యతపై సహేతుకమైన ఆందోళనలను రేకెత్తిస్తుంది. క్షేత్రస్థాయిలో విస్తృతమైన ఉనికి, సామాజిక సేవ, దేశ నిర్మాణానికి చేసిన కృషి దృష్ట్యా ఆర్‌ఎస్‌ఎస్ విమర్శలకు గురికావచ్చు, కానీ అటువంటి విమర్శ కేవలం విస్తృత సాధారణీకరణలపై కాకుండా, ధృవీకరించదగిన ఆధారాలు, సందర్భోచిత అవగాహనపై ఆధారపడి ఉండాలి,” అని వారు హితవు చెప్పారు.

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా, పటిష్టమైన న్యాయ వ్యవస్థ, సంస్థాగత పర్యవేక్షణ కలిగిన భారతదేశంలో, మతపరమైన హక్కుల ఉల్లంఘనలు పరిష్కారం కాకుండా పోవడానికి పరిమితమైన ఆస్కారం మాత్రమే ఉందని వారు నొక్కి చెప్పారు.

“భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. పటిష్టమైన, కాలపరీక్షకు నిలిచిన న్యాయవ్యవస్థ, చైతన్యవంతమైన ప్రజాస్వామ్య సంస్థలు, పార్లమెంటరీ పర్యవేక్షణ ఉన్నందున, ఒకరి మతపరమైన హక్కులను ఉల్లంఘించిన తర్వాత వ్యక్తులు లేదా సంస్థలు శిక్ష నుండి తప్పించుకోవడానికి చాలా తక్కువ అవకాశం ఉంది,” అని సంతకాలు చేసినవారు స్పష్టం చేశారు. 

మొత్తం 275 మంది సంతకాలు చేసినవారిలో 25 మంది రిటైర్డ్ న్యాయమూర్తులు, 10 మంది రాయబారులతో సహా 119 మంది రిటైర్డ్ బ్యూరోక్రాట్లు, 131 మంది సాయుధ దళాల అధికారులు ఉన్నారు. 

సంతకాలు చేసినవారిలో మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఆదర్శ్ కుమార్ గోయల్ (మాజీ ఎన్‌జీటీ ఛైర్మన్ కూడా), జస్టిస్ హేమంత్ గుప్తా, మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్లు ఓపీ రావత్, సునీల్ అరోరా, మాజీ విదేశాంగ కార్యదర్శి కన్వల్ సిబల్, మాజీ ఎన్‌ఐఏ డైరెక్టర్ యోగేష్ చందర్ మోదీ, పలువురు రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్, సాయుధ దళాల అధికారులు తదితరులు ఉన్నారు. ఈ సంయుక్త ప్రకటనను మాజీ రాయబారి భాస్వతి ముఖర్జీ, మాజీ అదనపు ప్రధాన కార్యదర్శి ఎం. మదన్ గోపాల్ సమన్వయం చేశారు.