బెంగాల్‌లో అర్హులైన ఏ ఒక్క ఓటరు పేరునూ తొలగించం

బెంగాల్‌లో అర్హులైన ఏ ఒక్క ఓటరు పేరునూ తొలగించం

అర్హత కలిగిన ఏ ఒక్క ఓటరును కూడా ఓటర్‌ జాబితా నుంచి తొలగించబోమని కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేశ్ కుమార్‌ భరోసా ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల నిమిత్తం సీఈసీ బృందం పశ్చిమ బెంగాల్‌లో పర్యటించిన క్రమంలో రాజకీయ పార్టీలు, అధికారులతో సమావేశాల అనంతరం జ్ఞానేశ్‌కుమార్‌ విలేకరులతో మాట్లాడారు.

పశ్చిమబెంగాల్‌లో స్వేచ్ఛగా, ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా చూడటమే ఎన్నికల సంఘం మొదటి ప్రాధాన్యమని ఆయన చెప్పారు. అర్హత ఉన్న ప్రతిఒక్కరూ తమ ఓటు హక్కును ఉపయోగించుకునే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా అర్హత కలిగిన ఓటర్ల పేర్లు ఎప్పటికీ తొలగించబోమని స్పష్టంచేశారు. 

రాజ్యాంగంలోని నిబంధనల ప్రకారమే అన్ని రాష్ట్రాల్లో ‘ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్)’ అమలవుతుందని తెలిపారు. ఓటర్ల జాబితాలో తప్పులు లేకుండా చూడటం, అర్హులైన వారి పేర్లు ఆ జాబితాలో ఉండేలా చూడటమే ‘సర్’ బాధ్యత అని చెప్పారు. కాగా, ఇక్కడ ఎన్నికలు ఎన్ని దశల్లో జరుగుతాయనేది రాష్ట్ర ప్రభుత్వం శాంతి భద్రతల విషయంలో చేపట్టే చర్యలపైన ఆధారపడి ఉంటుందని చెప్పారు.

బెంగాల్లో ఓటింగ్ శాతం ఎక్కువగా ఉందని, బంగాల్‌ ప్రజలు రాజ్యాంగాన్ని చాలా గౌరవిస్తారని చెబుతూ ఈ ఎన్నికలు బంగాల్‌ ప్రజలకు గర్వకారణమన్నారు. అధికారులు భయానికి, పక్షపాతానికి తావు లేకుండా పని చేయాలని ఆయన సూచించారు.  బెంగాల్‌ ఎన్నికల ప్రక్రియలో ప్రభుత్వ ఉద్యోగులందరూ ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు విధులు నిర్వర్తించాలని అయన చెప్పారు.

ఓటర్లపైనా, ఎన్నికల అధికారులపైనా రాజకీయ నేతలు ఎలాంటి బెదిరింపులకు పాల్పడినా సహించేది లేదని ఆయన హెచ్చరించారు. పశ్చిమబెంగాల్‌లో దాదాపు 80 వేల పోలింగ్‌ స్టేషన్లు ఉన్నాయని, వాటిల్లో దాదాపు 61 వేలు గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నాయని చెప్పారు.  ఓటింగ్‌ ప్రక్రియలో పారదర్శకతను పెంపొందించేందుకు రాష్ట్రంలోని అన్ని పోలింగ్‌ బూత్‌లలో ఎలాంటి అవకతవకలు జరగకుండా వెబ్‌కాస్టింగ్‌ ప్రక్రియను అమలుచేయనున్నట్లు తెలిపారు.