ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్

ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మృతికి భారతదేశం అధికారికంగా  సంతాపం ప్రకటించింది. ఇరాన్ అధినేత ఖమేనీ అమెరికా, ఇజ్రాయెల్ దాడిలో ఐదు రోజుల క్రితం మృతి చెందిన విషయం తెలిసిందే. ఇవాళ దేశ రాజధాని న్యూఢిల్లీలోని ఇరాన్ రాయబార కార్యాలయంలో విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ అధికారికంగా సంతాప సందేశం రాశారు.

భారత ప్రభుత్వం తరఫున విదేశాంగ కార్యదర్శి ఇరాన్ రాయబార కార్యాలయానికి వెళ్లారు. సంతాప సందేశాన్ని రాసిన అనంతరం మిస్రీ ఇరాన్ రాయబారితో కాసేపు మాట్లాడారు. ప్రస్తుతం పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులపై వారు చర్చించినట్లు తెలుస్తోంది.  ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ దేశాల సంయుక్త వైమానిక దాడిలో ఖమేనీ మృతి చెందారు. ఖమేనీ మృతి అనంతరం పశ్చిమాసియాలో భీకర యుద్ధం కొనసాగుతోంది.  

ఉద్రిక్తతలను చర్చలు ద్వారా పరిష్కరించుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన చేసిన కొద్దిసేపటికే ఇరాన్ రాయబార కార్యాలయానికి విక్రమ్ మిశ్రీ వెళ్లి సంతాప పుస్తకంలో సంతకం చేయడం గమనార్హం. కాగా, భారత్‌లో పర్యటిస్తున్న ఫిన్లాండ్ అధ్యక్షుడి అలెగ్జాండర్ స్టబ్‌తో సమావేశం అనంతరం సంయుక్త మీడియా సమావేశంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ  సైనిక ఘర్షణల ద్వారా ఏ సమస్య పరిష్కారం కాదని పునరుద్ఘాటించారు. 
పశ్చిమాసియా, ఉక్రెయిన్‌‌లో జరుగుతున్న యుద్ధాలకు త్వరగా ముగింపు పలకాలని ఆయన పిలుపునిచ్చారు.  భారత్ చర్చలు, దౌత్య మార్గాల ద్వారా పరిష్కరించుకోవాలని ఎప్పుడూ పిలుపునిస్తుందని యుద్ధం మొదలైన మర్నాడే వ్యాఖ్యానించారు. ఇక, ఫిబ్రవరి 28న జరిగిన దాడిలో ఖమేనీ చనిపోగా కేంద్రంలోని మోదీ ప్రభుత్వం దీనిని ఖండించకపోవడంతో ప్రతిపక్షాలు, విదేశాంగ నిపుణులు ఈ వైఖరిని తీవ్రంగా తప్పుబట్టాయి.  
ఈ అంశంపై కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ సోనియా గాంధీ సైతం కేంద్రానికి లేఖ రాశారు. ఇరాన్‌తో చారిత్రకంగా భారత్‌కు సంబంధాలు ఉన్నాయని, ఖమేనీ మరణంపై మౌనం ప్రదర్శించడం త‌ట‌స్థంగా ఉండ‌టం కాదని ఆయన ఆరోపించారు. భార‌త విదేశాంగ విధానంపై విశ్వ‌ాసం కోల్పోయిన‌ట్లుగా ఉంద‌ని సోనియా విమర్శించారు.