వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కల్తీ నెయ్యితో 20 కోట్ల లడ్డూలు

వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కల్తీ నెయ్యితో 20 కోట్ల లడ్డూలు

వైఎస్సార్సీపీ హయాంలో 20 కోట్ల లడ్డూలను కల్తీ నెయ్యితో తయారు చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. అధికారులు, నిపుణులు అందరూ కలిసి కుట్రలు చేశారని తెలిపారు. తిరుమల లడ్డూ వ్యవహారంపై శాసనసభలో నిర్వహించిన లఘు చర్చలో సీఎం మాట్లాడుతూ ‘మహాపాపం’ పేరిట గత ప్రభుత్వం లడ్డూ కల్తీ జరిగిన తీరును పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా వివరించారు. 

వైఎస్సార్సీపీ నేతలు ఒక లడ్డూ విషయంలోనే కాదు అనేక విషయాల్లో తప్పు చేశారని పేర్కొంటూ కుట్ర కోణాన్ని గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని సీఎం స్పష్టం చేశారు. 59.71 లక్షల కేజీల కల్తీ నెయ్యి వినియోగించారని, ఇంకా రూ.234.51 కోట్ల నిధుల అక్రమాలు జరిగాయని వివరించారు. అధికారులు, నిపుణులు అందరూ కలిసి కుట్రలు చేశారని, ల్యాబ్‌లకు కన్నుకప్పి టెండర్లు దక్కించుకున్నారని వెల్లడించారు. 

ఇంకా కల్తీ నెయ్యి తయారీకి చాలా రసాయనాలు వాడారని, మోనో గ్లిసరైడ్స్‌, లాక్టిక్‌ యాసిడ్‌ యానిమల్ వెజిటబుల్‌ ఫ్యాట్‌ నుంచి వస్తుందని, రంగు కోసం బీటా కెరాటిన్‌, వాసన కోసం ఎపిటిక్‌ యాసిడ్‌ ఈస్టర్‌, నెయ్యిలా కనిపించడానికి సింథటిక్‌ ఫ్లేవర్‌, నురుగు రావడానికి లబ్సా యాసిడ్‌ డిజర్టెంట్‌లో వాడతారని సీఎం వివరించారు. రాజకీయ వివాదం ఉండకూడదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో సిట్‌ ఏర్పాటు చేశారని సీఎం చంద్రబాబు తెలిపారు. 

సీబీఐ ఆధ్వర్యంలో విచారణకు సిట్‌ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు సూచించిందని, అలానే తప్పు చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని సీబీఐ నివేదిక పంపించిందని వెల్లడించారు. అందుకే ఏకసభ్య కమిటీ వేయాలని నిర్ణయించామని పేర్కొన్నారు.  లడ్డూ వ్యవహారంలో కాకుండా అనేక విషయాల్లో తప్పులు చేశారని, ఒక పద్ధతి ప్రకారం లాలూచీ పడిన లూటీ అని స్పష్టంగా తేలిందని చెప్పారు. కల్తీ నెయ్యి అని నిర్ధారణ అయినా రిపోర్టును తొక్కిపెట్టారని వెల్లడించారు. 

లడ్డూలో జంతుకొవ్వు కలిసిందని తాను సొంతంగా ఏమీ చెప్పలేదు, ఎన్‌డీడీబీ ఇచ్చిన రిపోర్టునే చెప్పానని ఆ భగవంతుడే నాతో చెప్పించాడని చంద్రబాబు పేర్కొన్నారు. తమకు అనుగుణంగా నిబంధనలన్నీ సడలించారని,రోజుకు 4 లక్షల లీటర్ల పాలు కొనుగోలు చేయాలన్న నిబంధన తొలగించారని సీఎం చంద్రబాబు చెప్పారు. నెయ్యి ఉత్పత్తిలో అనుభవాన్ని మూడేళ్ల నుంచి ఏడాదికి కుదించారని, అలానే రోజుకు 12 టన్నులుగా ఉండాల్సిన వెన్న తయారీ 8 టన్నులకు తగ్గించారని తెలిపారు. 

డెయిరీల వార్షిక టర్నోవర్‌ రూ.250 కోట్ల నుంచి రూ.150 కోట్లకు పరిమితం చేశారని వెల్లడించారు. సాంకేతిక అధ్యయనం, ఫీల్డ్‌ విజిట్లకు పూర్తిగా మినహాయింపు ఇచ్చి ఫుడ్‌ సేఫ్టీ నిబంధనలను నీరుగార్చారని ముఖ్యమంత్రి మండిపడ్డారు.

వైసీపీ హయాంలో శ్రీవారి ప్రసాదం కల్తీ అయ్యిందనిఎం, నెయ్యి లేకుండా నెయ్యి తయారు చేశారని నివేదికలు స్పష్టంగా తెలిపాయని ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. కల్తీ జరిగిందని వైసీపీ ఒప్పుకుంటే ఇంత చర్చ అవసరం లేదని, కానీ కల్తీ జరగలేదని వైసీపీ అబద్ధాలు చెబుతోందని విమర్శించారు. అందుకే తాము వివరణ ఇవ్వాల్సి వస్తుందని చెప్పారు. లడ్డూ కల్తీపై దీక్ష చేశాననీ, 

 
వైసీపీ హయాంలో హిందూ దేవాలయాలపై దాడులు చేసినా తాము వారిపై ఆరోపణలు చేయలేదని పవన్‌ గుర్తు చేశారు. అన్ని ఆధారాలు ఉన్నా వైసీపీ ఇలా ఎందుకు చేస్తుందనీ, వివరణ జరిపి దోషులపై చర్యలు తీసుకోవాలని జగన్‌ చెబితే సరిపోయేదని తెలిపారు. కానీ ఇలాంటి నాటకాల వల్ల పెద్ద తప్పు జరుగుతుంది అని చెప్పారు. గత ప్రభుత్వం తప్పు చేసిందని తాము అనలేదని, తప్పు అప్పటి టీటీడీ బోర్డు చేసింది అని చెప్పారు. ఆ టీటీడీ బోర్డును జగన్‌ ఎందుకు వెనక వేసుకుని వస్తున్నారో అర్థం కాలేదని విస్మయం వ్యక్తం చేశారు.