డిజిటల్ విప్లవానికి భారత్‌లో బలమైన పునాదులు

డిజిటల్ విప్లవానికి భారత్‌లో బలమైన పునాదులు
 
డిజిటల్ విప్లవానికి భారత్‌లో బలమైన పునాదులు ఉన్నాయని గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ తెలిపారు. భారతదశ డిజిటల్ విప్లవంలో ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు నాయుడు కీలక పాత్ర పోషిస్తున్నారని కితాబిచ్చారు.  అమరావతిలోని రియల్‌టైం గవర్నెన్స్ కేంద్రం -ఆర్టీజీఎస్​నుపరిశీలించిన ఆయన డేటా లేక్, వాట్సప్ గవర్నెన్స్ ద్వారా పౌర సేవలు సులభతరం చేయడం బాగుందని కితాబిచ్చారు.
 
డేటా లేక్ ద్వారా అన్ని ప్రభుత్వ శాఖలను అనుసంధానించామని బిల్‌గేట్స్‌కు సీఎం చంద్రబాబు వివరించారు.  అవేర్ 2.O ద్వారా రియల్ టైమ్‌లో సమారాచాన్నిసేకరించి, వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పథకాల అమలుపై ప్రజాభిప్రాయం సేకరిస్తూ కీలక సూచీల ద్వారా జీఎస్​డీపీ వృద్ధిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నట్టు ముఖ్యమంత్రి తెలిపారు.
ప్రాపర్టీ రికార్డుల భద్రతకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారని బిల్ గేట్స్ ప్రశ్నించగా బ్లాక్ చెయిన్ టెక్నాలజీతో ల్యాండ్ రికార్డులు భద్రపరుస్తున్నామని, క్యూఆర్ కోడ్‌తో పారదర్శక విధానాలు అమలు చేస్తున్నామని అధికారులు తెలిపారు. పన్ను వసూళ్ల ప్రక్రియ అద్భుతంగా ఉందన్న గేట్స్ ప్రశంసించగా జీఎస్టీ విధానంతో దేశంలో పన్నుల వసూళ్లు కూడా గణనీయంగా పెరిగిందని సీఎం చెప్పారు.
 
ఇక గేట్స్ ఫౌండేషన్ సహకారంతో చిత్తూరు జిల్లాలో నడుస్తున్న సంజీవని ప్రాజెక్టు అమలు గురించి బిల్ గేట్స్ ఆరా తీశారు. బ్లడ్ ప్రెషర్, డయాబెటీస్ లాంటి పరీక్షల వివరాలు ఎలా నమోదు చేస్తున్నారని అడిగారు. ప్రజల డిజిటల్​ హెల్త్​ రికార్డుల ఆధారంగా లైఫ్​ స్టైల్​, ఆహారం తదితర అంశాల్లో సలహాలు ఇస్తున్నామని అధికారులు తెలిపారు. ఆరోగ్య సేవలను ప్రజలకు మరింత చేరువ చేయాలన్నది తన ఆశయమని చెప్పారు. కుప్పంలో అమలు చేస్తున్న సంజీవని కార్యక్రమం అద్భుతంగా ఉందని అభినందించారు. 
 
విద్యార్థుల సమస్యలను అర్థం చేసుకోవడానికి, వారికి సరైన రీతిలో తగిన స్థాయిలో విద్యా బోధన చేయడానికి ఏఐ సహాయపడుతుందని బిల్ గేట్స్ సూచించారు. విద్యారంగంలో మార్పు తీసుకురావడానికి ఏఐ-టెక్నాలజీ ఉపయోగపడుతుందని చెప్పిన బిల్ గేట్స్, వ్యవసాయం రంగం చాలా ముఖ్యమైనదిగా అభిప్రాయపడ్డారు.
వసాయ రంగంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న సాంకేతిక వినియోగం, ఏఐ ఆధారిత రైతు సేవలను బిల్ గేట్స్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి స్వయంగా పరిశీలించారు. ఉండవల్లి కరకట్ట సమీపంలోని వ్యవసాయ క్షేత్రాన్ని సోమవారం సందర్శించిన గేట్స్‌కు రైతుల్లో సాంకేతిక వినియోగాన్ని పెంచే కార్యక్రమాలపై వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు వివరించారు.
 
టెక్నాలజీ సాయంతో ఏపీ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడం, టెక్నాలజీని రైతులకు అందించేందుకు ఏఐను వ్యవసాయంతో ఇంటిగ్రేట్ చేస్తూ కృషి చేయడాన్ని అభినందించారు. అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా వ్యవసాయంలో ఏఐని ఇంతలా వినియోగంచడం లేదని, కానీ ఆంధ్రప్రదేశ్ ఈ విషయంలో ముందుండటం మంచి పరిణామమని చెప్పారు. విపత్తుల నిర్వహణ కోసం టెక్నాలజీతో ముందస్తు అంచనాలు వేసి, ప్రాణ నష్టం జరగ్గకుండా జాగ్రత్తలు తీసుకునే వ్యవస్థ ఏర్పాటు చేయడం బాగుందని కొనియాడారు.