లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ సభను తప్పుదారి పట్టించినందుకు, నిరాధారమైన ఆరోపణలు చేసినందుకు సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు జారీ చేస్తామని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు హెచ్చరించారు. అమెరికాతో ఇటీవల కుదిరిన వాణిజ్య ఒప్పందంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు దాడి చేసిన తర్వాత ఆయన ఈ ప్రకటన చేశారు.
రిజిజు బడ్జెట్ చర్చ సందర్భంగా రాహుల్ గాంధీ ప్రసంగాన్ని ప్రస్తావిస్తూ, “సభను తప్పుదారి పట్టించినందుకు మరియు నిరాధారమైన ప్రకటనలు చేసినందుకు రాహుల్ గాంధీపై మేము ప్రివిలేజ్ నోటీసును దాఖలు చేయబోతున్నాము. లోక్సభ, రాజ్యసభ రెండింటిలోనూ సభా కార్యక్రమ నిర్వహణకు స్పష్టమైన నియమాలు, విధానాలు ఉన్నాయి. ఒక సభ్యుడు మరొక సభ్యునిపై తీవ్రమైన ఆరోపణలు చేయాలని అనుకున్నప్పుడు, మీరు నోటీసు ఇవ్వాలి ఆరోపణను నిరూపించాలి” అని స్పష్టం చేశారు.
రాహుల్ గాంధీని సభకు వచ్చి తన ప్రసంగంలో చేసిన వాదనలను ప్రామాణీకరించమని తాను స్పీకర్ ను కోరానని ఆయన తెలిపారు. “ప్రధానమంత్రి భారతదేశాన్ని మరియు భారత ప్రయోజనాలను అమ్మేశారని రాహుల్ గాంధీ ప్రభుత్వం, ప్రధానమంత్రిపై పనికిరాని, తప్పుడు ఆరోపణలు చేశారు. దేని ఆధారంగా? కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరిపై కూడా ఎటువంటి నోటీసు ఇవ్వకుండానే ఆయన తీవ్రమైన ఆరోపణలు చేశారు” అని రిజిజు ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ నాయకుడు ఆధారాలు, వాదనలు లేదా విధానపరమైన నోటీసు లేకుండా ఆరోపణలు చేశారని రిజిజు మండిపడ్డారు. “అన్ని తప్పుడు ప్రకటనలు, తప్పుడు వాదనలు, అన్పార్లమెంటరీ పదాలతో సహా అతని మొత్తం ప్రసంగాన్ని రికార్డుల నుండి తొలగించాలి. ముఖ్యంగా అతను చేసిన అబద్ధాలు, నిరాధారమైన ఆరోపణలను తొలగించాలి” అని ఆయన డిమాండ్ చేశారు.
“ఈ దేశాన్ని ఎవరూ అమ్మలేరని, ఎవరూ కొనలేరని నేను ఆయనకు గుర్తు చేశాను. అయినప్పటికీ రాహుల్ గాంధీ ఎవరో భారతదేశాన్ని అమ్మేశారని, ఎవరో భారతదేశాన్ని కొన్నారని పేర్కొన్నారు. భారతదేశాన్ని కొనడం లేదా అమ్మడం ఎవరూ ఊహించలేరు” అని ఆయన స్పష్టం చేశారు. భారత్-అమెరికా దేశాల మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందం అమెరికాకు మాత్రమే మేలు చేసేలా ఉందనేందుకు ఆధారాలు చూపాలని రాహుల్గాంధీకి రిజిజు సవాల్ విసిరారు.
లోక్సభలో ప్రతిపక్ష నాయకుడి స్థానానికి తగిన నేత కాంగ్రెస్ పార్టీలో లేకపోవడం దురదృష్టకరమని కేంద్ర మంత్రి చెప్పారు. లోక్సభలో ప్రతిపక్ష నేత హోదాలో ఉన్నప్పటికీ రాహుల్గాంధీ.. తన ప్రశ్నలకు ఇతరులు చెప్పే సమాధానాలు వినకుండానే సభ నుంచి వెళ్లిపోతారని మండిపడ్డారు. ఒక సభ్యుడు ప్రసంగం చేసిన వెంటనే సభ నుంచి బయటకు వెళ్లకూడదనే నియమం ఉందని, ఈ విషయం ఆయనకు తెలియదా..? అని రిజిజు ప్రశ్నించారు.
అంతకు ముందు రాహుల్ గాంధీ మాట్లాడుతూ భారత్ – అమెరికా మధ్యంతర వాణిజ్య ఒప్పందం ద్వారా భారతమాతను కేంద్ర ప్రభుత్వం అమ్మేసిందని విమర్శించారు. భారతదేశ ఇంధన భద్రతను అమెరికా చేతుల్లో పెట్టి, రైతుల ప్రయోజనాలను ఫణంగా పెట్టి సర్కారు హోల్సేల్గా సరెండర్ అయిపోయిందని ఆయన ఆరోపించారు. భారత్ – అమెరికా మధ్యంతర వాణిజ్య ఒప్పందం ఏకపక్షంగా ఉందని, దీనివల్ల భారత రైతుల ప్రయోజనాలు దెబ్బతింటాయని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ ఒప్పందం అమల్లోకి వస్తే, భారత మార్కెట్లోకి అమెరికా వ్యవసాయ ఉత్పత్తుల ప్రవాహం భారీగా పెరుగుతుందని రాహుల్ తెలిపారు. అమెరికా వ్యవసాయ ఉత్పత్తుల ధాటికి భారత రైతులు విలవిలలాడాల్సిన దుస్థితి వస్తుందని చెప్పారు. ఇక భారతదేశ వస్త్ర పరిశ్రమ పని అయిపోయినట్టేనని, ఇంధన భద్రతను భారత్ కోల్పోయిందని ఆయన హెచ్చరించారు. ఇకపై భారత్ ఎవరి నుంచి చమురును కొనాలో అమెరికాయే చెబుతుందని రాహుల్ పేర్కొన్నారు.

More Stories
దృష్టి లోపం ఉన్నవారి కోసం ఏఐ స్మార్ట్ గ్లాసెస్
ఎన్నికల ముందు రూ 9.12 లక్షల కోట్లతో యూపీ బడ్జెట్
అనేక పోలింగ్ కేంద్రాల వద్ద బిజెపి కార్యకర్తలపై దాడులు