స్పీక‌ర్ ఛాంబ‌ర్‌లో కాంగ్రెస్ ఎంపీల అరుపులు వీడియో

స్పీక‌ర్ ఛాంబ‌ర్‌లో కాంగ్రెస్ ఎంపీల అరుపులు వీడియో
 
పార్ల‌మెంట్‌లో అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీల మ‌ధ్య రోజు రోజుకూ వైరం పెరుగుతున్న‌ది. పార్ల‌మెంట‌రీ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి కిర‌ణ్ రిజిజు గురువారం మ‌రో వీడియోను రిలీజ్ చేశారు. కొన్ని రోజుల క్రితం కాంగ్రెస్ ఎంపీలు లోక్‌స‌భ స్పీక‌ర్ ఛాంబ‌ర్‌లోకి వెళ్లి గ‌ట్టిగా అరిచారు. ఆ వీడియోను కాంగ్రెస్ ఎంపీలే తీసిన‌ట్లు మంత్రి రిజిజు పేర్కొన్నారు. కాంగ్రెస్ ఎంపీ జ్యోతిమ‌ణి కేంద్ర మంత్రి రిజిజు వైపు త‌న వేలెత్తి చూపి గ‌ట్టిగా అరిచిన‌ట్లు ఆ వీడియోలో ఉన్న‌ది.

బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే స‌భ‌లో మాట్లాడిన రోజున ఈ ఘ‌ట‌న జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది. ఆయ‌న త‌న ప్ర‌సంగంలో మాజీ ప్ర‌ధానుల‌ను విమ‌ర్శించారు. నెహ్రూ-గాంధీ కుటుంబంపై కొన్ని వ్యాఖ్య‌లు చేశారు. స‌భ‌కు పుస్త‌కాలు తీసుకువ‌చ్చిన దూబే.. ఆ పుస్త‌కాల్లో ఉన్న అంశాల‌ను ప్ర‌స్తావిస్తూ ఆయ‌న నెహ్రా-గాంధీ కుటుంభంపై అభ్యంత‌ర‌క‌ర వ్యాఖ్య‌లు చేశారు. 

ఆ ఘ‌ట‌న నేప‌థ్యంలో ప్రియాంకా గాంధీ, కేసీ వేణుగోపాల్ నేతృత్వంలోని కాంగ్రెస్ నేత‌లు స్పీక‌ర్ ఛాంబ‌ర్‌లోకి వెళ్లి దూబేపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ ఓ బుక్ నుంచి అంశాన్ని ప్ర‌స్తావిస్తే వ్య‌తిరేకించార‌ని, కానీ దూబే కొన్ని బుక్స్ నుంచి వ్యాఖ్య‌లు చేస్తున్నార‌ని ఆరోపించారు. స్పీక‌ర్ ఛాంబ‌ర్‌లో జ‌రిగిన ర‌భ‌స గురించి పార్ల‌మెంట‌రీ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి రిజిజు స్పందిస్తూ కాంగ్రెస్ నేతల ప్ర‌వ‌ర్త‌నను విమ‌ర్శించారు. ప్రియాంకా, వేణుగోపాల్ లాంటి సీనియ‌ర్ నేత‌ల ముందు అలా జ‌ర‌గ‌డం శోచ‌నీయ‌మ‌ని తెలిపారు. తాము ప్ర‌తిప‌క్షంలో ఉన్న స‌మ‌యంలో ఇలాంటి ఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌లేద‌ని రిజిజు స్పష్టం చేశారు. 

రాహుల్ గాంధీ ప్ర‌వ‌ర్త‌న మారుతుంద‌ని కానీ, కాంగ్రెస్ మారుతుంద‌ని కానీ ఆశించ‌డం లేద‌ని రిజిజు తెలిపారు. ఆ రోజున సుమారు 25 మంది ఎంపీలు స్పీక‌ర్ ఛాంబ‌ర్‌లోకి వ‌చ్చార‌ని, త‌న‌ను, ప్ర‌ధాని మోదీపై ఘాటు వ్యాఖ్య‌లు చేశార‌ని, కానీ త‌మ పార్టీ చ‌ర్చ‌ల‌ను న‌మ్ముతుంద‌ని, ఎంపీల‌పై భౌతిక‌దాడిని తాము ఎప్పుడూ ప్రోత్స‌హించ‌లేద‌ని రిజిజు త‌న పోస్టులో తెలిపారు.

అయితే, ఈ సందర్భంగా మంత్రి కిరణ్ రిజిజు చేసిన ఆరోపణలను కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా ఖండించారు. తాను ఎవరినీ రెచ్చగొట్టలేదని, అలాగే దూషించలేదని స్పష్టం చేశారు.  “మేం ఎవరినీ దూషించలేదు. ఒకరిద్దరు ఎంపీలు ఆవేశంలో ఉన్నారు. వారు తమ భావాలను వ్యక్తం చేశారు. నేను వారిని రెచ్చగొట్టానని రిజిజు అన్నారు. ఇది అబద్ధం. నేను నిశ్శబద్దంగా కూర్చున్నా. చివరల్లో మాత్రమే శాంతియుతంగా కొన్ని విషయాలు చెప్పా”అని ప్రియాంక గాంధీ తెలిపారు.