శరద్‌పవార్‌కు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు

శరద్‌పవార్‌కు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
ఎన్సీపీ-ఎస్పీ అధినేత శరద్ పవార్ అస్వస్థతకు గురయ్యారు. గత కొన్ని రోజులుగా ఆయన గొంతు నొప్పి, దగ్గుతో బాధపడుతున్నట్లు తెలిసింది. ఈ క్రమంలోనే కుటుంబ సభ్యులు ఆయనను పుణెలోని రూబీ ఆస్పత్రికి తరలించారు. శరద్ పవార్ కొన్ని రోజులుగా గొంతునొప్పితో బాధపడుతున్నారని ఆయన సన్నిహితుడు తెలిపారు. కార్డియాలజిస్ట్ డాక్టర్ పర్వేజ్ నేతృతంలోని బృందం శరద్ పవార్‌కు చికిత్స అందిస్తోంది. మరిన్ని వివరాలను తర్వాత వెల్లడిస్తామని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.

“శరద్ పవార్‌కు ముందుగా దగ్గు కోసం పరీక్షలు నిర్వహిస్తారు. ఆ తర్వాత ఆయన్ను ఆసుపత్రిలో చేర్చుకోవాలా లేదా డిశ్చార్జ్ చేయాలా అనే దానిపై నిర్ణయం తీసుకుంటారు.” అని రూబీ హాల్ క్లినిక్ చీఫ్ కార్డియాలజిస్ట్, మేనేజింగ్ ట్రస్టీ డాక్టర్ పర్వేజ్ గ్రాంట్ వెల్లడించారు. 

ఇన్ఫెక్షన్‌ వల్ల పవార్‌ ఆదివారం రాత్రి నుంచి విపరీతంగా దగ్గుతున్నారని, ఆపై ఛాతిలో నొప్పిగా ఉందనడంతో సోమవారం మధ్యాహ్నం బారామతిలోని తన నివాసం నుండి పూనె ఆసుపత్రికి తరలించామని పవార్‌ మేనల్లుడు శ్రీనివాస్‌ పవార్‌ తెలిపారు. ఈ క్రమంలోనే ఎలాంటి రిస్క్ తీసుకోకూడదనే ఉద్దేశంతో ఆస్పత్రిలో చేర్పించినట్లు తెలిపారు.  శరద్ పవార్​తో ఆయన కుమార్తె, బారామతి పార్లమెంట్ సభ్యురాలు సుప్రియా సూలే కూడా పుణెలోని రూబీ హాల్ ఆసుపత్రికి వెళ్లారు. 

ఇటీవల శరద్‌పవార్‌ తమ్ముడి కుమారుడు, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌ విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. అజిత్‌ మరణంతో ప్రస్తుతం ఆయన భార్య ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.  అనుభవజ్ఞుడైన నాయకుడైన పవార్, 1990వ దశకం చివరలో నోటి క్యాన్సర్‌తో బాధపడ్డారు. చికిత్సలో భాగంగా ఆయన అమెరికా, భారతదేశంలో అనేక శస్త్రచికిత్సలు చేయించుకున్నారు. ఆరోగ్య సమస్య ఉన్నప్పటికీ అప్పటి నుండి చురుకైన ప్రజా జీవితాన్ని కొనసాగిస్తున్నారు.