లోక్సభలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై దాడి చేయడానికి కాంగ్రెస్ పార్టీ సభ్యులు పధకం వేశారా? అందుకనే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చకు ప్రధాని సమాధానం చెప్పకుండానే లోక్సభ గురువారం ఆమోదించిందా? అంటే అవుననే అంటున్నాయి లోక్సభ వర్గాలు. సాధారంగా ఈ తీర్మానంపై ప్రధాని ముగింపు ఉపన్యాసం ఇస్తారు. కానీ, ఈసారి ప్రధాని ప్రసంగం లేకుండానే ఆ తీర్మానాన్ని ఆమోదించడం గమనార్హం.
ప్రధాని ప్రసంగం లేకుండా ఈ తీర్మానం ఆమోదించడం 2004 తర్వాత ఇదే మొదటిసారి. ప్రధానిని సభలోనే చుట్టుముట్టేందుకు పథక రచన చేసినట్లు తెలిసినట్లు లోక్సభ వర్గాలు వెల్లడించాయి. ఈ క్రమంలో భద్రతా కారణాల దృష్ట్యా స్పీకర్ ఓం బిర్లా సభను అర్ధాంతరంగా వాయిదా వేశారు. ఫలితంగా, దశాబ్దాల సంప్రదాయానికి భిన్నంగా, ప్రధాని మోదీ ప్రసంగం లేకుండానే రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానాన్ని లోక్సభ ఆమోదించింది. సభకు రావొద్దని ప్రధాని మోదీకి తానే సూచించినట్లు స్పీకర్ ఓం బిర్లా పేర్కొన్నారు.
లోక్సభ వర్గాలు వెల్లడించిన విషయాలు విస్తుగొలుపుతున్నాయి. “సభలో ప్రధాని మోదీని చుట్టుముట్టి దాడి చేసేందుకు కాంగ్రెస్ పార్టీ పక్కా ప్లాన్ చేసింది. ఇందుకోసం మహిళా ఎంపీలను ముందుంచినట్లు సమాచారం. వారు బ్యానర్లతో మోదీ స్థానం వద్దకు వెళ్లి ఆయన్ను చుట్టుముట్టాలని చూశారు. ప్రసంగించేందుకు మోదీ అందుబాటులోనే ఉన్నప్పటికీ, ఈ కుట్ర గురించి సమాచారం రావడంతో స్పీకర్ అప్రమత్తమయ్యారు. వెంటనే సభను వాయిదా వేయాలని నిర్ణయించారు” అని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
నిన్న అమెరికాతో ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ విపక్ష మహిళా ఎంపీలు ప్రధాని సీటు దగ్గరకు వెళ్లేందుకు ప్రయత్నించిన సంగతి తెలిసిందే. సాధారణంగా రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు ప్రధాని సమాధానం ఇస్తారు. కానీ ఈసారి ప్రధాని ప్రసంగం లేకుండానే తీర్మానాన్ని ఆమోదించారు. ఇలా జరగడం 2004 తర్వాత ఇదే తొలిసారి. 2004లో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా విపక్షాల ఆందోళన వల్ల మాట్లాడలేకపోయారు. అప్పుడు విపక్షంలో ఉన్న బీజేపీ అడ్డుకోగా, మన్మోహన్ సింగ్ ప్రసంగించకుండానే ఓటింగ్ను కోరారు.

More Stories
నరవణె పుస్తకంపై రాజ్యసభలో మాటల యుద్ధం!
ప్రధాని సీట్ ను చుట్టుముట్టిన వివక్ష మహిళా ఎంపీలు
మణిపుర్ నూతన సీఎంగా యుమ్నమ్ ఖేమ్చంద్ సింగ్