రాజ్యసభలో 19 పెండింగ్‌లో ప్రభుత్వ బిల్లులు

రాజ్యసభలో 19 పెండింగ్‌లో ప్రభుత్వ బిల్లులు
రాజ్యసభలో 19 ప్రభుత్వ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. వాటిలో 1992 నాటి జనాభా నియంత్రణకు సంబంధించిన బిల్లు కూడా ఉంది. రాజ్యసభ అనేది శాశ్వత సభ. ఇది ఎప్పటికీ రద్దు చేయబడదు. దాని సభ్యులలో మూడింట ఒక వంతు మంది ప్రతి రెండేళ్లకు పదవీ విరమణ చేస్తారు. లోక్‌సభ లో పెండింగ్‌లో ఉన్న బిల్లులు సభ రద్దయితే, అవి కూడా రద్దవుతాయి. రాజ్యసభలో పెండింగ్‌లో ఉన్న బిల్లులు ఎప్పుడూ రద్దు కావు. రాజ్యసభ బులెటిన్‌ ప్రకారం ప్రస్తుతం 19 బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. 
 
వాటిలో పురాతనమైనది రాజ్యాంగ (79 సవరణ) బిల్లు-1992. జనాభా నియంత్రణ, చిన్న కుటుంబ నియమాన్ని ప్రభుత్వం ప్రోత్సహిం చాలని, ప్రాథమిక విధుల్లో చిన్న కుటుంబ నియమాన్ని ప్రోత్సహించడం, స్వీకరించడం చేర్చాలని ప్రభుత్వ విధాన నిర్దేశక సూత్రాలను సవరించాలని ఈ బిల్లు ప్రతిపాదించింది.  ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలుంటే ఎంపి లేదా ఎమ్మెల్యేను అనర్హులుగా ప్రకటించాలని కూడా ఇది ప్రతిపాదించింది.
పెండింగ్‌ బిల్లుల్లో ఢిల్లీ అద్దె (సవరణ) బిల్లు-1997 కూడా ఉంది. ఇది అద్దె నియంత్రణ చట్టాలను ఆధునీకరించడానికి ఉద్దేశించిన ఢిల్లీ అద్దె చట్టం-1995ను సవరించడానికి ఉద్దేశించబడింది. కానీ అద్దెదారులు, భూస్వామి సమూహాల నుండి గణనీయమైన వ్యతిరేకతను ఎదుర్కొంది. ప్రభుత్వం సీడ్‌ బిల్లు-2025 తీసుకు రావడానికి ప్రయత్నిస్తుండగా, పెండింగ్‌ బిల్లుల్లో సీడ్స్‌ బిల్లు-2004 ఉంది. ఇది అమ్మకం, దిగుమతి, ఎగుమతి కోసం విత్తనాల నాణ్యతను నియంత్రించడం, నాణ్యమైన విత్తనాల ఉత్పత్తి, సరఫరాను సులభతరం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది.
 
కాంగ్రెస్‌ అధ్యక్షులు మల్లికార్జున్‌ ఖర్గే కార్మికశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ప్రవేశపెట్టిన అంతర్రాష్ట్ర వలస కార్మికుల (ఉపాధి నియంత్రణ, సేవా పరిస్థితుల) సవరణ బిల్లు-2011 కూడా పెండింగ్‌లో ఉంది.  యుపిఎ-2లో ప్రవేశపెట్టిన ఇతర పెండింగ్‌ బిల్లుల్లో భవన, ఇతర నిర్మాణ కార్మికుల సంబంధిత చట్టాలు (సవరణ) బిల్లు-2013, ఉపాధి మార్పిడి (ఖాళీల తప్పనిసరి నోటిఫికేషన్‌) సవరణ బిల్లు-2013, పార్లమెంటరీ, అసెంబ్లీ నియోజకవర్గాల్లో షెడ్యూల్డ్‌ కులాలు, షెడ్యూల్డ్‌ తెగల ప్రాతినిధ్య పునర్‌ వ్యవస్థీకరణ (మూడో) బిల్లు-2013 ఉన్నాయి.
 
ఎన్‌డిఎ పాలనలో ప్రవేశపెట్టిన పెండింగ్‌ బిల్లుల్లో అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాంలలో స్వయం ప్రతిపత్తి మండళ్ల ఆర్థిక, కార్యనిర్వాహక అధికారాలను పెంచడంతో ఈశాన్య ప్రాంతంలో గిరిజన స్వయం ప్రతిపత్తిని బలోపేతం చేయడానికి ఉద్దేశించిన బిల్లు. ప్రవాస భారతీయుల వివాహ నమోదు బిల్లు-2019 వంటి బిల్లులు ఉన్నాయి. తాజాగా ది పెస్టిసైడ్‌ మేనేజ్‌మెంట్‌ బిల్లు-2020 పెండింగ్‌లో ఉంది.