తమిళనాడు అసెంబ్లీ నుంచి గవర్నర్ వాకౌట్

తమిళనాడు అసెంబ్లీ నుంచి గవర్నర్ వాకౌట్
* జాతీయ గీతాలాపనకు స్పీకర్ అభ్యంతరం!
 
అసెంబ్లీ ఎన్నికలు సమీపించిన వేళ త‌మిళ‌నాడు అసెంబ్లీ నుంచి ఆ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ ఆర్ఎన్ ర‌వి మంగళవారం వాకౌట్ చేశారు. తాను నిరుత్సాహానికి గుర‌య్యాన‌ని, జాతీయ గీతానికి స‌రైన గౌర‌వం ద‌క్క‌లేద‌ని గ‌వ‌ర్న‌ర్ ర‌వి పేర్కొన్నారు. అసెంబ్లీలో కేవ‌లం ప్ర‌సంగం చేసి వెళ్లాల‌ని గ‌వ‌ర్న‌ర్‌ను స్పీక‌ర్ ఎం అప్ప‌వు కోరిన‌ట్లు తెలుస్తోంది.  అసెంబ్లీ నియ‌మావ‌ళిని పాటించాల‌ని గ‌వ‌ర్న‌ర్‌ను స్పీక‌ర్ కోరారు. అయితే త‌న ప్ర‌సంగాన్ని అడ్డుకోవ‌డం దుర‌దృష్ట‌క‌ర‌మ‌ని గ‌వ‌ర్న‌ర్ ర‌వి పేర్కొన్నారు. 
శాసన సభను ఉద్దేశించి ప్రసంగించడానికి గవర్నర్ ఆర్‌ఎన్ రవి అసెంబ్లీకి చేరుకున్నారు.  తొలుత తమిళనాడు రాష్ట్ర గీతాన్ని ఆలపించారు. అనంతరం జాతీయ గీతాన్ని ప్లే చేసి, అందరూ ఆలపించాలని అసెంబ్లీ స్పీకర్ ఎం అప్పావుకు గవర్నర్ సూచించారు. అయితే అందుకు స్పీకర్ నిరాకరించారు. దీంతో అసెంబ్లీలో ప్రసంగించకుండానే గవర్నర్ ఆర్‌ఎన్ రవి వాకౌట్ చేశారు. అలా అసెంబ్లీ ప్రసంగించకుండా గవర్నర్ వాకౌట్ చేయండి ఇది మూడోసారి.

అసెంబ్లీ నుంచి గవర్నర్ వాకౌట్ చేసిన వెంటనే, సభలో జరిగిన పరిణామాల వివరాలతో తమిళనాడు గవర్నర్ కార్యాలయం లోక్ భవన్ ఓ మీడియా ప్రకటన విడుదల చేసింది. ‘సభలో పదేపదే గవర్నర్ ఆర్‌ఎన్ రవి మైక్‌ను స్విచ్ఛాఫ్ చేశారు. ఆయనను మాట్లాడనివ్వలేదు. దళితులపై దాడులు, దళిత మహిళలపై లైంగిక హింసాకాండ వంటి వ్యవహారాలను గవర్నర్ ప్రసంగంలో రాష్ట్ర ప్రభుత్వం చేర్చలేదు’ అని గవర్నర్ కార్యాలయం విమర్శించింది. 

రాష్ట్ర ప్రభుత్వం తప్పులతడకగా ఉన్న ప్రసంగాన్ని తయారుచేసి గవర్నర్‌కు ఇచ్చిందని, అందుకే ఆయన ప్రసంగించేందుకు నిరాకరించారని స్పష్టం చేసింది. తమిళనాడుకు రూ.12 లక్షల కోట్లు విలువైన పెట్టుబడులు వచ్చాయనే అంశాన్ని ప్రసంగంలో రాశారని, అది వాస్తవదూరమైన అంశమని పేర్కొంది.  మరోసారి తమిళనాడు అసెంబ్లీలో జాతీయ గీతం అవమానాన్ని ఎదుర్కోవాల్సి వచ్చిందని లోక్‌భవన్ పేర్కొంది.

ప్రాథమిక రాజ్యాంగ విధిని అసెంబ్లీ స్పీకర్ అమలు చేయలేదని తెలిపింది. ఈ కారణాల వల్లే అసెంబ్లీ నుంచి గవర్నర్ వాకౌట్ చేశారని వెల్లడించింది. అయితే హౌజ్‌లో కేవ‌లం ఎమ్మెల్యేలు మాత్రం త‌మ అభిప్రాయాలు వ్య‌క్తం చేసే అవ‌కాశం ఉంటుంద‌ని, మ‌రెవ‌రికీ ఆ అవ‌కాశం లేద‌ని స్పీక‌ర్ అప్ప‌వు పేర్కొన్నారు.

రాష్ట్ర అసెంబ్లీ సంస్కృతి, సంప్రదాయాలకు తిలోదకాలిస్తూ గవర్నర్ ఆర్‌ఎన్ రవి వాకౌట్ చేశారని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆరోపించారు. అసెంబ్లీ సెషన్ ప్రారంభంలో గవర్నర్ ప్రసంగించాలనే సంప్రదాయానికి తూట్లు పొడిచారని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం తయారుచేసి ఇచ్చిన ప్రసంగాన్నే గవర్నర్ చదవాల్సి ఉంటుందని, అందులో ఆయన అభిప్రాయాలను చేర్చే అవకాశమే ఉండదని సీఎం స్టాలిన్ తేల్చి చెప్పారు.

 
ప్రసంగంలోకి గవర్నర్ అభిప్రాయాన్ని చేర్చేలా అసెంబ్లీ రూల్స్ ఏవీ లేవని,  ఆర్ఎన్ రవి ఉద్దేశపూర్వకంగానే గత కొన్నేళ్లుగా ఇలా చేస్తున్నారని సీఎం ఆరోపించారు. ఈవిధంగా చేయడం రాష్ట్ర అసెంబ్లీని అవమానించడమే అవుతుందని విమర్శించారు. అందుకే రాష్ట్రానికి గవర్నర్‌ అక్కరలేదనే వైఖరికి డీఎంకే కట్టుబడి ఉందని స్టాలిన్ చెప్పారు. గత సీఎంలు అన్నాదురై, కరుణానిధి కూడా ఇదే విధమైన వైఖరితో పనిచేశారన్నారు. తాను కూడా వారి బాటలోనే నడుస్తున్నట్లు పేర్కొన్నారు.