వరి ధాన్యం ఉత్పత్తిలో భారత్ సరికొత్త రికార్డు సృష్టించింది. ఇప్పటిదాకా అగ్రస్థానంలో ఉన్న చైనాను అధిగమించి ప్రపంచంలోనే అతిపెద్ద వరి ధాన్యం ఉత్పత్తిదారుగా అవతరించిందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వెల్లడించారు.భారత్ 150.18 మిలియన్ టన్నుల బియ్యాన్ని ఉత్పత్తి చేయగా, చైనా ఉత్పత్తి 145.28 మిలియన్ టన్నులకే పరిమితమైందని కేంద్ర మంత్రి తెలిపారు.
ఈ సందర్భంగా భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐసిఏఆర్) అభివృద్ధి చేసిన 25 రకాల పంటలకు చెందిన 184 కొత్త వంగడాలను ఆయన విడుదల చేశారు. అధిక దిగుబడినిచ్చే విత్తనాల అభివృద్ధిలో భారత్ గొప్ప విజయం సాధించిందని చెప్పారు. ఇప్పుడు ప్రపంచ మార్కెట్లకు బియ్యాన్ని ఎగుమతి చేసే ప్రముఖ దేశంగా భారత్ మారిందని చౌహాన్ తెలిపారు.
ఈ కొత్త వంగడాలను సాధ్యమైనంత త్వరగా రైతులకు చేరేలా చూడాలని అధికారులను ఆదేశించారు. దేశాన్ని స్వయం సమృద్ధిగా మార్చేందుకు పప్పుధాన్యాలు, నూనె గింజల ఉత్పత్తిపై దృష్టి పెట్టాలని వ్యవసాయ శాస్త్రవేత్తలకు మంత్రి సూచించారు. గడిచిన 11 ఏళ్లలో 3,236 అధిక దిగుబడినిచ్చే వంగడాలకు ఆమోదం తెలిపినట్లు మంత్రి గుర్తుచేశారు.
వాతావరణ మార్పులు, కరువు, నేలల లవణీయత వంటి సవాళ్లను తట్టుకునేలా ఈ కొత్త వంగడాలను రూపొందించినట్లు వెల్లడించారు. ఒకప్పుడు ఆహార కొరత ఎదుర్కొన్న భారత్, ఇప్పుడు ప్రపంచ దేశాలకు వ్యవసాయ ఉత్పత్తులను సరఫరా చేసే స్థాయికి చేరిందని చౌహాన్ హర్షం వ్యక్తంచేశారు.
భారత వ్యవసాయ పరిశోధన మండలి, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, ప్రైవేట్ విత్తన కంపెనీల సమిష్టి కృషితోనే ఈ విజయం సాధ్యమైందని కేంద్రమంత్రి చౌహాన్ తెలిపారు.
భారత వ్యవసాయ పరిశోధన మండలి, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, ప్రైవేట్ విత్తన కంపెనీల సమిష్టి కృషితోనే ఈ విజయం సాధ్యమైందని కేంద్రమంత్రి చౌహాన్ తెలిపారు.

More Stories
బిజెపి మహిళా కార్యకర్త దుస్తులు చింపేసిన కర్ణాటక పోలీస్!
జేఎన్యూలో ప్రధాని, హోంమంత్రిలపై నినాదాలు చేసినవారిపై వేటు!
ట్రంప్ మోదీని అపహరిస్తారా?’.. పృథ్వీరాజ్ చవాన్ వ్యాఖ్యలపై దుమారం!