ప్రళయ్‌ క్షిపణిని విజయవంతంగా ప్రయోగం

ప్రళయ్‌ క్షిపణిని విజయవంతంగా ప్రయోగం
భారత రక్షణ రంగం మరో కీలక మైలురాయిని చేరుకుంది. ఒడిశా తీరంలో ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణి ‘ప్రళయ్’ ని విజయవంతంగా పరీక్షించింది. ఒకే లాంచర్ నుంచి రెండు క్షిపణులను స్వల్ప వ్యవధిలో ప్రయోగించి వాటి సామర్థ్యాన్ని విజయవంతంగా పరిశీలించింది. యూజర్ ఎవాల్యుయేషన్ ట్రయల్స్‌లో భాగంగా ఈ పరీక్షలు నిర్వహించినట్లు రక్షణశాఖ వెల్లడించింది.

బుధవారం  ఉదయం 10:30 గంటల సమయంలో రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డిఆర్ డిఓ) ఆధ్వర్యంలో ఈ ప్రయోగం జరిగింది. ప్రయోగించిన రెండు క్షిపణులు నిర్దేశిత మార్గంలో ప్రయాణించి, లక్ష్యాలను కచ్చితత్వంతో చేధించాయని అధికారులు తెలిపారు. చాందీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్‌లో మోహరించిన ట్రాకింగ్ సెన్సార్ల ద్వారా క్షిపణి పనితీరును ధృవీకరించుకున్నారు. 

డీఆర్డీవో సీనియర్ శాస్త్రవేత్తలు, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ ఉన్నతాధికారులు ఈ ప్రయోగాన్ని ప్రత్యక్షంగా వీక్షించారు. ‘ప్రళయ్’ క్షిపణి 150 నుంచి 500 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదించగలదు. ఇది పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన సాలిడ్ ప్రొపెల్లెంట్ క్వాసీ-బాలిస్టిక్ మిసైల్. అత్యాధునిక నావిగేషన్, గైడెన్స్ వ్యవస్థలతో పనిచేసే ఈ క్షిపణి వివిధ రకాల వార్‌హెడ్‌లను మోసుకెళ్తూ శత్రువుల స్థావరాలపై విరుచుకుపడగలదు. 

హైదరాబాద్‌లోని రిసెర్చ్ సెంటర్ ఇమారత్ (ఆర్ సిఐ) తోపాటు పలు డీఆర్డీవో ల్యాబ్స్, భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బిడిఎల్) లాంటి సంస్థల సహకారంతో దీన్ని అభివృద్ధి చేశారు. ఈ ప్రయోగం విజయవంతం కావడంపట్ల రక్షణ మంత్రి రాజ్‍నాథ్ సింగ్ హర్షం వ్యక్తంచేశారు. సాల్వి లాంచ్ విజయవంతం కావడంతో క్షిపణి విశ్వసనీయత నిరూపితమైందని ఆయన పేర్కొన్నారు.

 ఈ విజయంపై డీఆర్డీవో చైర్మన్ డాక్టర్ సమీర్ వి కామత్ మాట్లాడుతూ త్వరలోనే ఈ క్షిపణి వ్యవస్థను సైన్యంలోకి ప్రవేశపెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని, ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు తుదిదశలో ఉన్నాయని చెప్పారు.