నిజమైన జర్నలిస్టులకు అన్యాయం జరగదు

నిజమైన జర్నలిస్టులకు అన్యాయం జరగదు
గతంలో ఇచ్చిన అక్రెడిటేషన్ కార్డుల కంటే అధికంగా ఇస్తామని, నిజమైన జర్నలిస్టులకు తమ ప్రభుత్వ హయాంలో ఎలాంటి చిన్న అన్యాయం జరగనివ్వబోమని సమాచారశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తనను కలిసిన జేఏసీ నాయకులకు హామీ ఇచ్చారు.  రాష్ట్ర సచివాలయంలో జర్నలిస్టు సంఘాల జేఏసీ నాయకులతో మంత్రి పొంగులేటి మాట్లాడుతూ అతి త్వరలో అన్ని జర్నలిస్టు సంఘాలతో ప్రభుత్వం చర్చలు జరిపి, అందరి అభిప్రాయాలను పరిగణలోనికి తీసుకొని మరో జీవో తెస్తామని చెప్పారు. 
 
డెస్క్ పనిచేసే వారికి, ఫీల్డ్ లో పనిచేసే జర్నలిస్టులకు అనేక సంక్షేమ పథకాలను అంచెలంచెలుగా అందిస్తామని మంత్రి పొంగులేటి  చెప్పారు. మంత్రిని కలిసిన వారిలో జేఏసీ కన్వీనర్లు కే.కోటేశ్వర్ రావు, అనంచిన్ని వెంకటేశ్వరరావు, మామిడి సోమయ్య, పులిపలుపుల ఆనందం, రావికంటి శ్రీనివాస్, గౌటి రామకృష్ణ, రాణా ప్రతాప్, కీర్తి సంతోష్ రాజా ఉన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జీవో 252 మార్గదర్శకాలలోని అభ్యంతరాలను నోటిఫికేషన్‌కు ముందు సవరించాలని, చిన్న వార్తాపత్రికలు, కేబుల్ ఛానెళ్లు, ఎం-ఛానల్ కాకుండా ఇతర వార్తాపత్రికలకు, ప్రతి జర్నలిస్టుకు వారి సీనియారిటీని పరిగణనలోకి తీసుకొని అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేయాలని వారు కోరారు.  రెండు కార్డుల వ్యవస్థకు బదులుగా, డెస్క్ జర్నలిస్టులు కూడా అన్ని జర్నలిస్టుల మాదిరిగానే ఒకే అక్రిడిటేషన్ కార్డు వ్యవస్థను కొనసాగించాలని చెప్పారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 సంవత్సరాలు కావడంతో తెలంగాణ సాధనలో కీలక పాత్ర పోషించిన జర్నలిస్టులకు 15 సంవత్సరాల సీనియారిటీ నిబంధన అసంబద్ధం అని పేర్కొంటూ దానిని తొలగించాలని స్పష్టం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించిన వారందరికీ ఎటువంటి షరతులు లేకుండా అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలని, తెల్ల రేషన్ కార్డులను వెంటనే అందించాలని చెప్పారు.

జర్నలిస్టుల కుటుంబాలకు ఉచిత విద్య, ఉచిత వైద్యం వెంటనే అందించాలని సంబంధిత విభాగాలకు అధికారిక ఆదేశాలు జారీ చేయాలని కోరారు. జర్నలిస్టుల కుటుంబ సభ్యులకు బీమా సౌకర్యాలు కల్పించాలని, 60 సంవత్సరాలు నిండిన జర్నలిస్టులందరికీ నెలకు రూ. 12,000 పెన్షన్ పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు.