దేవతలు కించపరిచారని యూట్యూబర్ అన్వేష్‌పై కేసులు

దేవతలు కించపరిచారని యూట్యూబర్ అన్వేష్‌పై కేసులు

యూట్యూబర్ అన్వేష్‌పై హైదరాబాద్‌లోని పంజాగుట్ట, ఖమ్మం అర్బన్ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ దేవతలు, మహిళలను కించపరిచేలా మాట్లాడాడని అన్వేష్‌పై ఫిర్యాదులు అందడంతో రెండు కేసులు నమోదు చేశారు. దేవీ దేవతలను యూట్యూబర్ అన్వేష్ దూషించాడని సినీ నటి, బీజేపీ నాయకురాలు కరాటే కళ్యాణి పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కల్యాణి ఫిర్యాదుపై బీఎన్‌ఎస్ 352, 73, 299, ఐటీ యాక్ట్ 67 కింద కేసు నమోదు చేసుకున్నారు. దీనిపై త్వరలోనే అన్వేష్‌కు పంజాగుట్ట పోలీసులు నోటీసులు జారీ చేయనున్నారు.  ఇదిలా ఉంటే యూట్యూబర్ అన్వేష్‌పై ఖమ్మం జిల్లా దానవాయిగూడెం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఖమ్మం అర్బన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. యూట్యూబర్ అన్వేష్‌ చేసిన వ్యాఖ్యలు సామాజిక భావోద్వేగాలను దెబ్బతీసేలా ఉన్నాయని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. 

దీంతో ఆ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.  ఖమ్మం ఇన్​స్పెక్టర్​ భాను ప్రకాశ్​ కథనం ప్రకారం, ఆంధ్రప్రదేశ్​లోని విశాఖపట్టణానికి చెందిన అన్వేష్​ అనే యువకుడు విదేశాల్లో ఉంటూ యూట్యూబ్​ ఛానల్​ నిర్వహిస్తూ వస్తున్నాడు. ఇటీవల అతను భక్తుల మనోభావాలు దెబ్బ తినేలా హిందువులు పూజించే సీతాదేవి, ద్రౌపదీ దేవిల పట్ల అసభ్యంగా వీడియోలు విడుదల చేశాడు. 

దీంతో దానవాయిగూడేనికి చెందిన జి.సత్యనారాయణరావు అనే వ్యక్తి ఆదివారం రాత్రి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టినట్లు ఇన్​స్పెక్టర్​ తెలిపారు.  హిందువులు దేవతగా కొలిచే సీతమ్మపై, అలాగే ద్రౌపది దేవి గురించి అన్వేష్​ అసభ్యకరమైన రీతిలో వ్యాఖ్యలు చేశాడని సోషల్​ మీడియాలో నెటిజన్లు మండిపడుతున్నారు. అలాగే హిందూ సంఘాలు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అన్వేష్​పై సినీనటి కరాటే కల్యాణి పోలీసు స్టేషన్​లో ఫిర్యాదు చేయడంతో మరోసారి ఈ విషయం వార్తల్లోకి ఎక్కింది