పరకామణిని ప్రక్షాళన చేయండి

పరకామణిని ప్రక్షాళన చేయండి
 
తిరుమల పరకామణిలో కానుకల లెక్కింపు ప్రక్రియను సమూలంగా ప్రక్షాళన చేయాలని టీటీడీని హైకోర్టు ఆదేశించింది. కానుకల లెక్కింపులో ఏఐ, అత్యాధునిక యంత్రాలను వినియోగించడం ద్వారా మానవ ప్రమేయాన్ని తగ్గించవచ్చని సూచించింది. హుండీల సీలింగ్‌, రవాణా, డీ సీలింగ్‌, లెక్కింపు, ఖాతాల నిర్వహణ విషయంలో పాత విధానాలనే అనుసరించడం సరికాదని అభిపాయ్రపడింది. 

కానుకల రూపేణా వచ్చిన సొమ్ము చోరీకి గురైతే కోట్లాదిమంది భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని హైకోర్టు తెలిపింది. పరకామణిలో కానుకల లెక్కింపు ప్రక్రియను ఆధునీకీకరించాల్సిన అవసరముందని వెల్లడించింది. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇలాంటి చోరీ ఘటనలు తరచూ జరుగుతున్నా కానుకలు లెక్కించేందుకు పాత విధానాన్ని అనుసరించడం సరికాదని ధర్మాసనం స్పష్టం చేసింది.

దీనివల్ల దొంగతనాలు, అవినీతి, నిధుల దుర్వినియోగానికి అవకాశం కలుగుతోందని తెలిపింది. పరకామణికి సంబంధించి రెండు దశల్లో సంస్కరణలు చేపట్టాలని, ఇందుకోసం తక్షణ, శాశ్వత ప్రణాళికలు రూపొందించాలని టీటీడీని ఆదేశించింది. తక్షణ సంస్కరణలో భాగంగా., హుండీ సీలింగ్‌, రవాణా, లెక్కింపు విషయంలో తక్షణం చేపట్టాల్సిన భద్రతా చర్యలపై రెండు వారాల్లో నివేదిక సమర్పించాలని నిర్దేశించింది. 
 
శాశ్వత సంస్కరణలో భాగంగా కానుకలను వర్గీకరించడం, విదేశీ కరెన్సీని గుర్తించడం, విలువైన లోహాలు, రాళ్లు వేరు చేసేందుకు ఏఐ, అత్యాధునిక సాంకేతిక వ్యవస్థలను ఏర్పాటు చేయాలని, దీనికోసం సాంకేతిక నిపుణులను నియమించుకోవాలని సూచించింది. టీటీడీకి సహాయం అందించేందుకు ఆయా రంగాల్లో అపార అనుభవం ఉన్న శ్రీవారి భక్తులు ప్రపంచవ్యాప్తంగా అధిక సంఖ్యలో ఉన్నారని పేర్కొంది. 
 
శాశ్వత ప్రణాళికపై ఎనిమిది వారాల్లోపు ముసాయిదా రూపొందించి, దానిని కోర్టుకు సమర్పించాలని టీటీడీకి స్పష్టం చేసింది. నిందితుడు రవికుమార్‌, అతని కుటుంబ సభ్యుల ఆస్తులు వేరొకరికి బదలాయింపు, రిజిస్ట్రేషన్‌ వివరాలను సీల్డ్‌ కవర్‌లో వారంలోపు సమర్పించాలని ఏసీబీ డీజీని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 26వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ గన్నమనేని రామకృష్ణప్రసాద్‌ శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చారు.