భ‌క్తుల సౌక‌ర్యార్థం తిరుప‌తిలో ఇంటిగ్రేటెడ్‌ టౌన్‌షిప్

భ‌క్తుల సౌక‌ర్యార్థం తిరుప‌తిలో ఇంటిగ్రేటెడ్‌ టౌన్‌షిప్
 
భ‌క్తుల సౌక‌ర్యార్థం తిరుప‌తిలోని 20 ఎక‌రాల‌లో ఇంటిగ్రేటెడ్‌ టౌన్‌షిప్ నిర్మాణానికి ప్లానింగ్ కొర‌కు, ఆర్కిటిక్ట్ నియామ‌కానికి టీటీడీ ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి ఆమోదం తెలిపింది. అధ్యక్షులు బి ఆర్ నాయుడు అధ్యక్షతన మంగళవారం సమావేశమై టిటిడి ఆలయాలకు ధ్వజస్తంభం, రథాలు తయారు చేసేందుకు ప‌ల‌మ‌నేరులో 100 ఎకరాలలో దివ్య వృక్షాలు పెంచేందుకు నిర్ణయించారు.

తిరుపతిలోని శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయంలో అత్యాధునిక సౌకర్యాలు కల్పించేందుకు అదనంగా రూ.48 కోట్లు మంజూరు చేశారు. టీటీడీ బోర్డు ఎడ్యుకేషన్ స‌బ్ క‌మిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా టీటీడీలోని 31 విద్యా సంస్థల్లో డిజిటల్‌ క్లాస్‌ రూమ్‌లు, సీసీ కెమెరాలు, కంప్యూటర్లు, అందుకు అవసరమైన సాఫ్ట్‌వేర్‌లు,  అవసరమైన సిబ్బంది, తదితర సౌకర్యాలను కల్పించేందుకు ఆమోదం తెలిపారు.
ముంబైలోని బాంద్రా ప్రాంతంలో రూ.14.40 కోట్లతో శ్రీవారి ఆలయం నిర్మించాలని, తిరుపతి జిల్లా తలకోనలోని శ్రీ సిద్దేశ్వర స్వామివారి ఆలయ పునః నిర్మాణ ప‌నుల‌లో భాగంగా రెండ‌వ ద‌శ‌లో రూ.14.10 కోట్లు మంజూరు చేయాలనీ నిర్ణయించారు. తిరుపతిలో టీటీడీ నిర్వహిస్తున్న రోడ్ల నిర్వహణ, మరమ్మతులు, వీధి దీపాల నిర్వహణ కొనసాగించాలని నిర్ణయించారు.
టీటీడీ అనుబంధ ఆలయాలలో ప‌ని చేస్తున్న‌ 62 మంది అర్చక, పరిచారక, పోటు వర్కర్లు, ప్రసాదం డిస్ట్రిబ్యూట‌ర్లకు వేతనాలు పెంచాలని నిర్ణయించారు. అర్చకులకు రూ.25,000 నుండి 45,000కు, పరిచారకులకు రూ.23,140 నుండి 30,000కు, పోటువర్కర్లకు రూ.24,279 నుండి 30,000కు, ప్రసాదం డిస్ట్రిబ్యూట‌ర్లకు రూ.23,640 నుండి 30,000కు పెంచారు.

తిరుమ‌ల‌లోను, కాలిబాట‌లో ఉన్న పురాత‌న ప్రాశ‌స్త్యం గ‌ల నిర్మాణాల ప‌రిర‌క్ష‌ణ కొర‌కు ప్ర‌త్యేకంగా ఒక విభాగం ఏర్పాటు చేసి, అనుభ‌వం గ‌ల‌ అధికారుల‌ నియమించాలని నిర్ణయించారు. తిరుమలలోని రహదారులు, ప్రధాన కూడళ్ళ పేర్లను వైష్ణవ పురాణాలు, ఆళ్వార్లు, అన్నమాచార్య సంకీర్తనలలోని శ్రీవారి నామాలు, తదితర పేర్లతో మార్చేందుకు కమిటీ ఏర్పాటు చేశారు. 
 
జాతీయ సంస్తృత విశ్వవిద్యాలయం దూర విద్యా కేంద్రం డైరెక్టర్‌ డా. చక్రవర్తి రంగనాథన్‌, అన్నమాచార్య ప్రాజెక్టు ప్రత్యేక అధికారి డా.మేడసాని మోహన్‌, పురాణ ఇతిహాస ప్రాజెక్టు ప్రత్యేక అధికారి డా.డి.ప్రభాకర్‌ కృషమూర్తిలతో ఈ కమిటీ ఏర్పాటు చేశారు.