ఇండిగో సంక్షోభంపై ఢిల్లీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం

ఇండిగో సంక్షోభంపై ఢిల్లీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం
 
* వెంటనే నష్టపరిహారం చెల్లింపు చర్యలు చేపట్టండి

ఇండిగో ఎయిర్‌లైన్‌ సంక్షోభం ఢిల్లీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేంద్రం, డీజీసీఏ తీరును తప్పుపట్టింది. విమానాల రద్దు, జాప్యాన్ని తీవ్రమైన సంక్షోభంగా పేర్కొన్న కోర్టు ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందని కేంద్రాన్ని ప్రశ్నించింది. ఇండిగో విమానాల రద్దుతో ప్రభావితమైన ప్రయాణికులకు తక్షణ పరిహారం అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. 
 
వేలాది విమానాల రద్దుతో ప్రభావితమైన ప్రయాణికులకు ఉపశమనం, రీఫండ్స్‌ కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని ఢిల్లీ హైకోర్టు బుధవారం విచారించింది. విమానాల రద్దుతో ప్రయాణికులకు అసౌకర్యం కలిగించడమే కాకుండా ఆర్థిక వ్యవస్థకు కూడా హాని కలిగించాయని కోర్టు పేర్కొంది.

ఇండిగో విమానాలు రద్దయితే దీన్ని అవకాశంగా తీసుకొని టికెట్ల ధరలను అడ్డగోలుగా ఇతర ఎయిర్‌లైన్స్‌ కంపెనీలు ఎలా పెంచుతాయని నిలదీసింది. ఈ పరిస్థితుల్లో ఇతర విమానయాన సంస్థలు ధరల పెంపును ఎలా సమర్థించుకుంటాయని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దేవేంద్ర కుమార్‌ ఉపాధ్యాయ్‌, జస్టిస్‌ తుషార్‌ ధర్మాసనం ప్రశ్నించింది. 

ఎఫ్‌డీటీఎల్‌ నిబంధనల అమలులో జాప్యం, సరైన పర్యవేక్షణ లేకపోవడం వల్ల దేశవ్యాప్తంగా రెండు వేలకుపైగా విమానాలు రద్దు కావడంతో 40 వేలకు మందికిపైగా ప్రయాణికులు చిక్కుకుపోయారని ధర్మాసనం పేర్కొంది. ప్రయాణికుల భద్రతలో రాజీపడకూడదని, పైలట్‌ అలసట ప్రమాదాన్ని పెంచుతుందని, నియంత్రణ సంస్థలు ముందస్తు చర్యలు తీసుకొని ఉండాల్సిందని కోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది.

ఇండిగో విమానాల రద్దు తర్వాత ఇతర ఎయిర్‌లైన్‌ కంపెనీలు చార్జీలను 40 వేలకుపైగా పెంచడంపై కోర్టు అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఇది అవకాశవాదం కాదా? అంటూ బెంచ్‌ నిలదీసింది. గతంలో నాలుగు, ఐదువేలకు లభించే విమాన టికెట్ల ధరలు ఇప్పుడు పెరిగాయని, ఈ ఛార్జీలు 39 వేల వరకు ఎలా పెరుగుతాయని కోర్టు ప్రశ్నించింది. ప్రస్తుత డీజీసీఏ మార్గదర్శకాలు, భారత ఎయిర్‌లైన్స్‌ చట్టం ప్రకారం ప్రభావితమైన ప్రయాణికులందరికీ పూర్తి పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది.

విమానాల రద్దుకు సంబంధించి మాత్రమే కాకుండా ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి పరిహారం చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది. ప్రయాణీకుల హక్కుల ముఖ్యమని ధర్మాసనం తేల్చి చెప్పింది. డీజీసీఏ తరఫు న్యాయవాదులు ఈ విషయంలో ఇండిగోకు నోటీసులు జారీ చేశారని చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కాగా, ఇండిగో విమాన అంతరాయాలు, వాటి పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలపై ప్రధానమంత్రి కార్యాలయం మంగళవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత సమీక్ష జరిపింది. డిజిసిఎ, కేంద్ర పౌర విమానయాన శాఖ, ఎఎఐ (ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా) అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.