బిహార్లో అసెంబ్లీ మొదటి దశ పోలింగ్ జరుగుతున్న వేళ లఖిసరాయ్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీజేపీ నేత, ఉప ముఖ్యమంత్రి విజయ్ కుమార్ సిన్హా కాన్యాయ్పై కొందరు గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లు రువ్వారు. కారుపై మట్టి, ఆవు పేడ, చెప్పులను విసిరారు. విజయ్ సిన్హాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయితే తనపై ఆర్జేడీ మద్దతుదారులే దాడి చేసినట్లు అని విజయ్ కుమార్ సిన్హా ఆరోపించారు.
దీనిపై భారత ఎన్నికల సంఘం స్పందిస్తూ తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. గురువారం విజయ్ కుమార్ సిన్హా లఖిసరాయ్ నియోజకవర్గంలోని ఖోరియారీ గ్రామంలో పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేయడానికి వచ్చారు. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో దాదాపు 50-60 మంది బ్లూత్ నవంబర్ 404,405 వద్దకు వచ్చారు. వారు విజయ్ సిన్హా వాహానాన్ని చుట్టుముట్టి అడ్డుకున్నారు.
చెప్పులు, ఆవు పేడను కారుపైకి విసిరారు. రాళ్లతో కూడా దాడి చేశారు. వెంటనే ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆర్జేడీ అధికారంలోకి వస్తే ఆటవికి రాజ్యాన్ని ఏర్పాటు చేస్తుందని చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనమని విజయ్ సిన్హా ధ్వజమెత్తారు.
“నా కాన్వాయ్పై చెప్పులు, ఆవు పేడ విసిరారు. రాళ్లతో కూడా దాడి చేశారు. ఆర్జేడీ కార్యకర్తలు పోలింగ్ బూత్ను స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించారు. దీనిపై ఫిర్యాదు చేసినప్పటికీ స్థానిక యంత్రాంగం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దీనిపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేస్తాం. వీరు ఆర్జేడీ గూండాలు. ఎన్డీఏ అధికారంలోకి వస్తోంది. అందుకే వారు గూండాయిజానికి పాల్పడుతున్నారు. వారు పోలింగ్ ఏజెంట్ను తరిమికొట్టి, ఓటు వేయడానికి అనుమతించలేదు” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
“పోలింగ్ బూత్ను స్వాధీనం చేసుకునే ప్రయత్నం జరుగుతోంది. ఈ గూండాలు అధికారంలోకి రాకముందే బిహార్ ఉప ముఖ్యమంత్రిని గ్రామంలోకి ప్రవేశించనివ్వడం లేదు. ఇక్కడి పోలీసు సూపరింటెండెంట్ పిరికివారు. ఓటింగ్ ప్రశాంతంగా జరుగుతుందని చెబుతున్నారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరిగితే మేం ఇక్కడ నిరసన తెలుపుతాం. ఇలాంటి పరిపాలన సిగ్గుచేటు” అని విజయ్ సిన్హా మండిపడ్డారు.
మరోవైపు ఈ ఘటనపై తక్షణమే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర డీజీపీని భారత ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ ఆదేశించినట్లు ఈసీ అధికారి తెలిపారు. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడానికి ఎవరూ అనుమతించరని పేర్కొన్నారు. దుండగులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఈ ఘటనపై లఖిసరాయ్ ఎస్పీ అజయ్ కుమార్ స్పందిస్తూ ఉదయం అంతా పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని, కానీ విజయ్ కుమార్ సిన్హా వచ్చినప్పుడే అకస్మాత్తుగా నిరసనలు ప్రారంభమయ్యాయని తెలిపారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. లిఖిసరాయ్ నియోజకవర్గంలో విజయ్కుమార్ సిన్హా వరుసగా మూడు సార్లు విజయం సాధించారు. ఈసారి ప్రశాంత్ కిషోర్ నాయకత్వంలోని జాన్ సూరజ్ పార్టీకి చెందిన సూరజ్ కుమార్ను ఆయన ఎదుర్కొంటారు. అలాగే కాంగ్రెస్కు చెందిన అమ్రేశ్ కుమార్ పోటీ చేశారు.

More Stories
25 నుంచి కన్హా శాంతి వనంలో ‘విశ్వ సంఘ్ శిబిర్ 2025’
అటల్ మోదీ సుపరిపాలన యాత్రకు అనూహ్య స్పందన
కక్ష్యలోకి బ్లూబర్డ్ బ్లాక్-2 ఉపగ్రహం