కల్తీ నెయ్యిలో మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పీఏ అరెస్ట్

కల్తీ నెయ్యిలో మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పీఏ అరెస్ట్
టీటీడీ కల్తీ నెయ్యి కేసులో టీటీడీ మాజీ ఛైర్మన్‌, వైసీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి వ్యక్తిగత సహాయకుడు (పీఏ) కడూరు చిన్న అప్పన్న (35)ను సిట్ అధికారులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. కల్తీ నెయ్యి సరఫరా వ్యవహారంలో అతనికి ఉన్న సంబంధాలపై సిట్ సుదీర్ఘ విచారణ జరిపి, ఆధారాల ఆధారంగా అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు.ఈ కేసులో మొదటి అరెస్ట్ కావడం గమనార్హం.

వివరాల్లోకి వెళ్తే విజయనగరం జిల్లా తెర్లాం మండలం పాములవలసకు చెందిన చిన్న అప్పన్న, హైదరాబాద్ కేంద్రంగా వైవీ సుబ్బారెడ్డి వ్యక్తిగత, వ్యాపార వ్యవహారాలను పర్యవేక్షిస్తుంటారు. టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా చేయడంలో ఇతను కీలక పాత్ర పోషించాడని సిట్ అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం తిరుపతిలోని సిట్ కార్యాలయానికి విచారణ నిమిత్తం పిలిపించారు. 

హైదరాబాద్, విశాఖపట్నం సీబీఐ కార్యాలయాల నుంచి వచ్చిన ముగ్గురు డీఎస్పీలు, ముగ్గురు సీఐలు సుదీర్ఘంగా విచారించిన అనంతరం చిన్న అప్పన్నను అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించారు.అరెస్టు అనంతరం వైద్య పరీక్షల కోసం తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు.ఆ తర్వాత నెల్లూరు ఏసీబీ కోర్టులో హాజరుపరిచేందుకు తీసుకెళ్లారు. రాత్రి సమయం కావడంతో న్యాయమూర్తి నివాసంలో నిందితుడిని హాజరుపరచనున్నారు.

రిమాండ్ రిపోర్టులో చిన్న అప్పన్నను ఏ-24 (24వ నిందితుడు)గా పేర్కొన్నారు.గతంలో జూన్ 4న చిన్న అప్పన్నను సిట్ విచారణకు పిలవడంతో వైవీ సుబ్బారెడ్డి వర్గంలో కలకలం రేగింది. ఆ వెంటనే ఈ కేసు దర్యాప్తు అధికారిగా తిరుపతి అదనపు ఎస్పీ కొనసాగడాన్ని సవాల్ చేస్తూ వైవీ సుబ్బారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. దీంతో హైకోర్టు దర్యాప్తుపై స్టే విధించింది.

సుమారు మూడున్నర నెలల తర్వాత సుప్రీం కోర్టు ఆదేశాలతో దర్యాప్తు తిరిగి ప్రారంభమైంది. విచారణ మొదలైన కొద్ది రోజులకే ఈ కీలక అరెస్ట్ జరగడం గమనార్హం.  చిన్న అప్పన్న అరెస్టుతో తదుపరి వైవీ సుబ్బారెడ్డికి కూడా నోటీసులు జారీ చేసి విచారించే అవకాశం ఉందని, ఈ కేసులో మరిన్ని అరెస్టులు జరిగే సూచనలు ఉన్నాయని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.