శ్రీ‌వారి ఆల‌యంలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం

శ్రీ‌వారి ఆల‌యంలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం

భ‌క్తుల‌కు 10 రోజుల పాటు వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం క‌ల్పించ‌నున్న‌ట్లు టీటీడీ చైర్మన్  బీఆర్ నాయుడు తెలిపారు. ధ‌ర్మ ప్ర‌చారంలో భాగంగా గ్రామాల్లో భ‌జ‌న మందిరాలు నిర్మించ‌నున్న‌ట్లు ఆయ‌న‌ తెలిపారు. ఈవో  అనిల్‌కుమార్ సింఘాల్‌తో కలసి ఆయన మీడియాకు టిటిడి ట్రస్ట్ బోర్డు నిర్ణయాలను తెలుపుతూ తిరుమలలో గదుల టారీఫ్ లను పరిశీలించి నివేదిక సమర్పించడానికి కమిటీని ఏర్పాటు చేసి, కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు.

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలలో టిటిడి ఉద్యోగులకు బ్రహ్మోత్సవ బహుమానంగా పర్మినెంట్ ఉద్యోగులకు రూ.15,400, కాంట్రాక్ట్ / జౌట్ సోర్సింగ్ ఉద్యోగులకు రూ.7,535 ఇవ్వాలని నిర్ణయించారు. బ్రహ్మోత్సవాలలో పనిచేసిన తిరుమల, తిరుపతికి చెందిన సిబ్బందికి అదనంగా 10 శాతం ఇవ్వాలని నిర్ణయం.

టీటీడీ గోశాల నిర్వహణకు సబంధించి నిపుణుల కమిటీని ఏర్పాటు చేసి, ఈ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా గోశాల నిర్వహణ, అభివృద్ధిపై తదుపరి చర్యలు తీసుకుంటామని నాయుడు వెల్లడించారు.  ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆలయం వద్ద భక్తుల సౌకర్యార్థం రూ.37 కోట్ల వ్యయంతో 100 గదులను ఆధునిక వసతులతో నూతన అతిధి భవనాన్ని నిర్మించేందుకు ఆమోదించారు.

ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆలయం వద్ద భక్తులకు మరింత ఆహ్లాదకర, ఆధ్యాత్మిక వాతావరణాన్ని అందించేందుకు రూ.2.96 కోట్లతో 1.35 ఎకరాల్లో పవిత్ర వనం ఏర్పాటుకు నిర్ణయించారు.  కాణిపాకంలోని శ్రీ వ‌ర‌సిద్ధి వినాయ‌క స్వామి ఆల‌యం వ‌ద్ద యాత్రికుల వ‌స‌తి స‌ముదాయం, సామూహిక వివాహాల‌కు ప్ర‌త్యేక హాల్స్  నిర్మాణానికి రూ.25 కోట్లు మంజూరు చేశారు.

భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు చెన్నై టి.నగర్ లోని శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయం పరిధిలో ఉన్న 6,227 చ.అ. స్థలాన్ని దాతల సహకారంతో రూ.14 కోట్లతో కొనుగోలు చేసేందుకు నిర్ణయించారు.  తెలంగాణ రాష్ట్రం, కరీంనగర్ లో శ్రీ పద్మావతి, శ్రీ ఆండాళ్ సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం, ఆలయ ప్రాకారం, రాజగోపురం,  నాలుగు మాడ వీధులు, తదితర మౌళిక సదుపాయాల కల్పనకు ఇప్పటికే ఆమోదించిన రూ.20 కోట్ల నిధులతో పాటు అదనంగా మరో రూ. 10 కోట్లు దాత‌ల ద్వారా సేక‌రించాల‌ని నిర్ణయించారు.

వేద విశ్వ‌విద్యాల‌యం విసి ఆచార్య రాణి స‌దా శివశివ‌మూర్తిని తొల‌గించాల‌ని, టీటీడీ కొనుగోలు విభాగంలో అవ‌క‌త‌వ‌క‌ల‌కు పాల్ప‌డిన‌ట్లు వచ్చిన ఆరోప‌ణ‌లపై ఎసిబితో విచార‌ణ జ‌ర‌పాల‌ని నిర్ణయించారు.