దీపావళి రోజున రేవంత్ ఇంటికి కొండా దంపతులు

దీపావళి రోజున రేవంత్ ఇంటికి కొండా దంపతులు
 
దీపావళి పండుగ శుభాకాంక్షల మాటున రాష్ట్ర మంత్రి కొండా సురేఖ , ఆమె భర్త కొండా మురళి దంపతులు హైదరాబాద్‌లోని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నివాసానికి వెళ్లారు. సాధారణ శుభాకాంక్షల భేటీగా కనిపించినప్పటికీ, ఇటీవల కొండా కుటుంబం చుట్టూ జరిగిన హైడ్రామా నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. మంత్రి మాజీ ఓఎస్‌డీ సుమంత్‌ను రాష్ట్ర ప్రభుత్వం తొలగించి, అతడిని అరెస్ట్ చేసేందుకు వరంగల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు మఫ్టీలో మంత్రి నివాసానికి చేరుకోవడంతో ఈ డ్రామా మొదలైంది.
మంత్రి కొండా సురేఖ పదవి విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఈ రాజకీయ ఉద్రిక్తతకు తెరదించేందుకు ఈ భేటీ కీలకంగా మారనుంది. కొండా సురేఖ మంత్రివర్గ సమావేశంకు దూరంగా ఉండటం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరిపై పార్టీ అధిష్టానంకు ఫిర్యాదు చేయడం, ఆమెను మంత్రివర్గం నుండి తొలగిస్తున్నారని ప్రచారం జరగడంతో కొద్దీ రోజులుగా తెలంగాణ కాంగ్రెస్ లో చెలరేగిన దుమారంను కట్టడి చేసేందుకు ఈ భేటీ జరిగినట్లు భావిస్తున్నారు. 
 
కొండా దంపతులను జూబ్లీహిల్స్‌లోని రేవంత్‌రెడ్డి నివాసానికి భట్టి విక్రమార్క, మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ తీసుకెళ్లారు. ఇటీవల జరిగిన పరిణామాలపై చర్చించినట్లు సమాచారం. మంత్రి కొండా దంపతులు, పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డిల మధ్య మేడారం టెండర్ల పంచాయితీ, ఆ తరువాత డెక్కన్‌ సిమెంట్‌ యాజమాన్యాన్ని కొండా సురేఖ ఓఎస్‌డీ సుమంత్‌ బెదిరించినట్లు వచ్చిన ఆరోపణలు చర్చకు వచ్చిన్నట్లు భావిస్తున్నారు. 
 
ఆ తరువాత సుమంత్‌ తొలిగింపు, పోలీసులు సురేఖ నివాసానికి వెళ్లడం, అక్కడ మంత్రి బిడ్డ సుస్మిత అడ్డుకోవడం ఆ సందర్భంగా పెద్ద డ్రామా చోటు చేసుకోవడం, మీడియా ముందు సుస్మిత ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేయడం, ఏఐసీసీ ఈ వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేయడం తదితర అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది.

మంత్రివర్గంలో ఓ బిసి మంత్రిని టార్గెట్ చేయడంపై పలువురు మంత్రులు అసహనం వ్యక్తం చేయడం, ఇప్పటికే స్థానిక ఎన్నికలలో బిసి రేజర్వేషన్లు అంశంపై ఆత్మరక్షణలో పడిన కాంగ్రెస్ కు ఇటువంటి పరిణామాలు బిసిలను దూరం చేయగలవని ఆందోళనలు వ్యక్తం చేయడంతో కాంగ్రెస్ రెండుగా చీలిపోయిన్నట్లయింది.  త్వ‌ర‌లో జూబ్లీహిల్స్ ఎన్నిక‌ల‌తో పాటు స్థానిక ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఎలాంటి వివాదాల జోలికి వెళ్ల‌కూడ‌ద‌ని పార్టీ పెద్ద‌లు సూచించిన‌ట్లు స‌మాచారం.