కానిస్టేబుల్‌ హత్య కేసు నిందితుడు రియాజ్ కాల్చివేత

కానిస్టేబుల్‌ హత్య కేసు నిందితుడు రియాజ్ కాల్చివేత
 
నిజామాబాద్‌లో కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులో నిందితుడు, రౌడీషీటర్ రియాజ్ ఎన్‌కౌంటర్‌లో మృతిచెందాడు. ఆదివారం రియాజ్‌ను పోలీసులు పట్టుకున్నప్పటికీ తీవ్ర గాయాలు కావడంతో అతడిని నిజామాబాద్ ఆస్పత్రికి తరలించారు. అయితే అక్కడి నుంచి తప్పించుకునేందుకు పోలీసుల గన్‌ లాక్కోవడంతో ఆత్మరక్షణ కోసం రియాజ్‌ను కాల్చిచంపారు.

నిజామాబాద్ పట్టణంలో విధి నిర్వహణలో ఉన్న సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్‌ను కరుడుగట్టిన నేరస్తుడు షేక్ రియాజ్ ఈ నెల 17న కత్తితో అత్యంత దారుణంగా పొడిచి చంపాడు. వాహనాల దొంగతనం కేసులో రియాజ్‌ను అదుపులోకి తీసుకుని బైక్‌పై తీసుకెళ్తుండగా కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ ఘటనలో గాయపడిన ప్రమోద్ చికిత్స పొందుతూ మరణించాడు.

దీంతో అప్రమత్తమైన పోలీసులు షేక్ రియాజ్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో సారంగపూర్‌లోని అటవీ ప్రాంతంలో పడివున్న ఓ పాడుబడిన లారీలో దాక్కుని ఉండగా పోలీసులకు పట్టుకున్నారు. ఆ సమయంలో పోలీసుల నుంచి పారిపోయేందుకు రియాజ్ ప్రయత్నించాడు. ఈ క్రమంలో అతనికి గాయాలు కావడంతో ఆదివారం రాత్రి నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొచ్చారు.

నిజామాబాద్ జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న సమయంలో ఆస్పత్రి నుంచి పారిపోయేందుకు రియాజ్ ప్రయత్నించాడు. సోమవారం తన పక్కనే ఉన్న ఏఆర్ కానిస్టేబుల్ గన్ లాక్కొని బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ క్రమంలో పోలీసులు కాల్పులు జరపడంతో రియాజ్ మరణించాడు. రియాజ్ ఎన్‌కౌంటర్‌పై డీజీపీ శివధర్ రెడ్డి స్పందిస్తూ ఆదివారం రోజున తనను పట్టుకుంటున్న ఆసిఫ్‌ అనే వ్యక్తిపై రియాజ్‌ దాడి చేశాడని, సోమవారం మరో కానిస్టేబుల్‌ను గాయపరిచి పారిపోయేందుకు యత్నించాడని చెప్పారు.

కాగా, షేక్ రియాజ్ చేతిలో దారుణ హత్యకు గురైన పోలీస్ కానిస్టేబుల్ ప్రమోద్ కుమార్‌కు డీజీపీ శివధర్ రెడ్డి ఆదివారం నివాళులర్పిస్తూ  తెలంగాణలో లా అండ్ ఆర్డర్‌ను పూర్తిస్థాయిలో కాపాడేందుకు తెలంగాణ పోలీసు శాఖ నిబద్ధతతో ఉందని తెలిపారు.  ఎలాంటి తీవ్ర నేరస్తులను అయినా కఠినంగా అణిచివేస్తామని ఆయన హెచ్చరించారు.
భర్త ప్రమోద్‌ను పోగొట్టుకున్న అతని భార్య ప్రణీతకు, అతి చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయిన ముగ్గురు కుమారులకు, వారి కుటుంబానికి ప్రభుత్వం, పోలీసు శాఖ పూర్తి స్తాయిలో అండగా ఉంటుందని డీజీపీ తెలిపారు. అతని కుటుంభంకు ఒక కోటి రూపాయలు ఎక్స్ గ్రేషియా అందజేస్తామని డిజిపి ప్రకటించారు.  అమరుడైన కానిస్టేబుల్ పదవీ విరమణ వరకు లాస్ట్ పే డ్రాన్ సాలరీతో పాటు కుటుంబ సభ్యులలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, 300 గజాల ఇంటి స్థలం మంజూరు చేస్తామని తెలిపారు.
అలాగే పోలీస్ భద్రత సంక్షేమం నుంచి 16 లక్షల ఎక్స్ గ్రేషియా, పోలీస్ వెల్ఫేర్ నుంచి 8 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ను ప్రమోద్ కుటుంబానికి చెల్లించి వారి కుటుంబానికి అండగా ఉంటామని చెప్పారు.