* ట్రంప్, నెతన్యాహులకు ఫోన్ లో మోదీఅభినందనలు
ఒప్పందంపై ఇరు పక్షాలు సంతకాలు చేసినట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్లో వెల్లడించారు. రెండేండ్లుగా సాగుతున్న గాజా యుద్ధాన్ని ముగించేందుకు ఇదో గొప్ప అడుగు అని అభివర్ణించారు.
‘శాంతి ప్రణాళిక తొలిదశ ఒప్పందానికి ఇజ్రాయెల్, హమాస్ అంగీకరించాయని ప్రకటించేందుకు గర్వంగా భావిస్తున్నాను. ఈ నిర్ణయంతో హమాస్ చేతిలో బందీగా ఉన్న వారందరూ త్వరలోనే విడుదలవుతారు. ఇజ్రాయెల్ తన బలగాలను ఉపసంహరించుకుంటుంది. దీర్ఘకాలిక శాంతిని సాధించే క్రమంలో ఇది తొలి అడుగుగా నిలిచిపోతుంది. అన్ని పక్షాలను సమంగా చూస్తాం. అరబ్, ముస్లిం ప్రపంచం, ఇజ్రాయెల్, ఇతర చుట్టుపక్కల దేశాలు, అమెరికాకు ఇదొ గొప్ప రోజు’ అని పేర్కొన్నారు.
ఒప్పందంపై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు స్పందించారు. ‘శాంతి ప్రణాళిక మొదటి దశ ఒప్పందానికి ఆమోదంతో, బందీలందరినీ ఇంటికి తీసుకొస్తాం. ఇది ఇజ్రాయెల్కు దౌత్యపరమైన విజయం. బందీలందరినీ తిరిగి తీసుకురావడం, మా లక్ష్యాలను సాధించే వరకు విశ్రాంతి తీసుకోబోమని మొదటి నుంచీ చెబుతున్నాం. నా మిత్రుడు, ట్రంప్ గొప్ప ప్రయత్నాల ద్వారా ఈ కీలక మలుపునకు చేరుకున్నాం. ఆయనకు కృతజ్ఞతలు’ అని నెతన్యాహు పేర్కొన్నారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తోపాటు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్లో మాట్లాడుతూ చరిత్రాత్మక గాజా శాంతి ప్రణాళిక విజయంపై అభినందనలు తెలిపారు. బందీల విడుదల, గాజా ప్రజలకు మెరుగైన మానవతా సహాయంపై ఒప్పందాన్ని స్వాగతిస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు మోదీలో సోషల్ మీడియాలో వెల్లడించారు మోదీ.
తన మిత్రుడు, అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో మాట్లాడి చారిత్రాత్మక గాజా శాంతి ఒప్పందం విజయవంతం కావడంపై అభినందనలు తెలియచేశానని మోదీ తెలిపారు. వాణిజ్య చర్చలలో సాధించిన పురోగతిని కూడా తాము సమీక్షించామని, రానున్న వారాలలో మరింతగా అందుబాటులో ఉండాలని నిర్ణయించుకున్నామని ఆయన వెల్లడించారు.
ఆ తర్వాత నెతన్యాహుతో మాట్లాడి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గాజా శాంతి ప్రణాళిక కింద సాధించిన పురోగతికి అభినందనలు తెలిపినట్లు మోదీ చెప్పారు. ప్రపంచంలో ఎక్కడైనా ఏ రూపంలో లేదా వ్యక్తీకరణలో ఉగ్రవాదం ఆమోదయోగ్యం కాదని తాను పునరుద్ఘాటించానని మోదీ అన్నారు. బందీల విడుదల, గాజా ప్రజలకు మెరుగైన మానవతా సహాయంపై ఒప్పందాన్ని స్వాగతిస్తున్నామని చెప్పినట్లు వెల్లడించారు.
అయితే, ఒప్పందంపై సంతకం చేసిన తర్వాత కూడా పరిస్థితులు మళ్లీ మారవచ్చని పాలస్తీనా వర్గాలు పేర్కొన్నాయి. ఇజ్రాయెల్ బందీలుగా ఉన్న పాలస్తీనా జాతీయుల విడుదల జాబితాను సిద్ధం చేయాల్సి ఉందని వారు చెప్పారు. వీరిలో కొందరు ప్రముఖులు కూడా ఉన్నారని, వీరుగాక వందలాది మంది పాలస్తీనీయులు ఇజ్రాయెల్లో బందీలుగా ఉన్నారని వారు తెలిపారు.
ట్రంప్ ప్రతిపాదించిన 20 సూత్రాల ప్రణాళికలోని ఇతర చర్యలను కూడా ఉభయ పక్షాలు చర్చించాల్సి ఉందని ఆ వర్గాలు తెలిపాయి. గాజా స్ట్రిప్ పాలనా బాధ్యతలు ఎవరు చేపట్టాలి? ఆయుధాలు విసర్జించాలన్న ఇజ్రాయెల్ డిమాండ్ను హమాస్ అంగీకరిస్తుందా? వంటి అంశాలు కూడా చర్చించాల్సి ఉంటుందని భావిస్తున్నారు.

More Stories
కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాట .. 10 మంది మృతి
400 కిలోల బంగారంతో సహా రూ 400 కోట్ల మావోయిస్టుల నిధులు!
అజారుద్దీన్కు మంత్రిపదవితో కాంగ్రెస్ లో అసమ్మతి కుంపటి!