విలక్షణమైన కార్యపద్ధతితో ఆర్ఎస్ఎస్ వందేళ్ల ప్రయాణం

విలక్షణమైన కార్యపద్ధతితో ఆర్ఎస్ఎస్ వందేళ్ల ప్రయాణం

ఆర్ఎస్ఎస్ శతాబ్ది ప్రత్యేకం.. 8

వందేళ్ల ప్రయాణం పూర్తి చేసుకుంటున్న రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)తో పోల్చదగిన మరో సంస్థ కనిపించదు. వేల సంవత్సరాల భారతీయ సామాజిక విలువలను వర్తింప చేసుకుంటూ, కాలగమనంలో సమాజ జీవనంలో ఏర్పడిన లోటుపాట్లను అధిగమిస్తూ ఓ ధృడమైన జీవనాన్ని ఏర్పాటు చేస్తూ, అందుకోసం తన జీవితాన్ని అంకితం చేయగల విధంగా ప్రజలను నడిపించే విధంగా విలక్షణమైన ఓ కార్యపద్ధతిని ఏర్పర్చుకుంది.
 
ఓ నాగరిక దేశంగా గుర్తింపు పొందున భారత జాతికి పునాదిగా ఉన్న సంస్కృతి మూలాల నుండి జాతీయవాదం ఉద్భవించింది. అయితే, దురదృష్టవశాత్తు స్వాతంత్ర్య పోరాటానికి ముందు, పోరాట సమయంలో, తర్వాత జరిగిన అన్ని పరిణామాలలో సంస్కృతి కేంద్రీకృత విలువలను తిరస్కరించడం ఓ పరిపాటిగా మారింది.  ఈ తిరస్కరణ ప్రమాదకరమైన ప్రభావంతో చరిత్రను వక్రీకరించడం, సంప్రదాయాలను తప్పుగా అర్థం చేసుకోవడం, భారతదేశం ఎప్పుడూ ఒక దేశం కాదని చూపించడానికి విచ్ఛిన్న అనుకూల సిద్ధాంతాలను తయారు చేయడం ద్వారా జాతీయవాదంను పక్కకు నెట్టివేసి ప్రయత్నాలు జరుగుతూ వచ్చాయి. 
 
దేశభక్తిని అస్పష్టమైన, ఇరుకైన, కాలం చెల్లిన ఆలోచనగా కనిపించేలా చేసే ప్రయత్నాలు జరిగాయి. పర్యవసానంగా, ఒక సాధారణ నైతికతను పంచుకోవడానికి మనకు సహాయపడే భావోద్వేగ అంశం దాదాపు బలవంతంగా ఆవిరైపోయే పరిస్థితి ఏర్పడింది.  భారతదేశం అసలు ఓ సమైక్య దేశం కాదని, రాష్ట్రాల సమ్మేళనం అని, భారతదేశ పటం కృత్రిమంగా కలిసి కుట్టిన అనేక రాష్ట్రాల ముక్కలతో తయారు చేసిందని చాలామంది నమ్మించే ప్రయత్నాలు చేశారు.
 
ఈ ఆటుపోట్లకు వ్యతిరేకంగా నిర్ణయాత్మకంగా ఈదుతూ, ప్రజల దైనందిన జీవనంలో జాతీయత, దేశభక్తిని ప్రతిబించించే విధంగా ఓ తపస్సు మాదిరిగా మహోద్యమంగా ఆర్ఎస్ఎస్ పనిచేస్తూ వచ్చింది.   భారతదేశ పునాది సంస్కృతి గురించి గుర్తు చేస్తూనే, జాతీయ సమైక్యత, నైతిక విలువలు, సామాజిక సామరస్యం వంటి అంశాలపై ప్రజలను మేల్కొల్పడానికి ఒక శతాబ్ద కాలంగా కృషి చేస్తూ వస్తున్నది.
 
ఈ కృషి కారణంగా నేడు దేశభక్తి ఒక ప్రాథమిక విలువగా అభివృద్ధి చెందింది. అనేక లక్షల మంది కలిసి పనిచేయడానికి, కలిసి ఉండటానికి ప్రేరేపిస్తుంది. దేశభక్తి కేవలం జెండా ఎగురవేయడం, దేశభక్తి గీతాలు పడటం లేదా జాతీయ ఐక్యత ప్రతిజ్ఞ చేయడం మాత్రమే కాకుండా, తమ రోజువారీ ప్రవర్తనలో ప్రతిబింబించాలని గ్రహించేలా ప్రజలకు అవగాహన కలిగిస్తూ వస్తుంది.
 
స్వాతంత్ర్యం ముందు కాలం నుండి ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులు డా. హెడ్గేవార్,  ఆ తర్వాత సంఘచాలక్ గురు గోల్వాల్కర్ దేశ సమగ్రత కాపాడేందుకు విశేషంగా కృషి చేశారు. పండిట్ నెహ్రు ధోరణి పట్ల విసుగుచెంది, జమ్మూ కాశ్మీర్ ను భారత్ లో విలీనం చేసేందుకు విముఖంగా ఉన్న రాజా హరి సింగ్ ను ఉప ప్రధాని సర్దార్ పటేల్ కోరడంతో స్వయంగా గురూజీ కలిసి, విలీనంకు ఒప్పించారు. 
 
అడవులు తప్ప మరేమీ లేని ఈశాన్య ప్రాంతాన్ని దేశ విభజన సమయంలో పాకిస్థాన్ కు వదిలివేసేందుకు నెహ్రు సుముఖంగా ఉన్న సమయంలో గురూజీ హెచ్చరికతో  మేల్కొనాల్సి వచ్చింది.  చైనా, పాకిస్థాన్ లతో యుద్ధాల సమయంలో ప్రభుత్వంకు, భారత సేనలకు అండగా స్వయంసేవక్ లు నిలిచారు. దానితో ఆర్ఎస్ఎస్ ను తీవ్రంగా ద్వేషించే నెహ్రు చైనా యుద్ధం తర్వాత రిపబ్లిక్ డే పరేడ్ కు సంఘ స్వయంసేవక్ లను స్వయంగా ఆహ్వనించారు. 
 
రాజకీయ అంశాలను సంకుచిత రాజకీయాల పరిధిలో చూడరాదని మొదటి నుండి దేశాన్ని ఆర్ఎస్ఎస్ హెచ్చరిస్తూ వస్తుంది.  జమ్మూ కాశ్మీర్, ఇతర ప్రాంతాలలో ఉగ్రవాద బాధితులకు, ఎక్కడ వరదలు, ఇతర ప్రకృతి వైపరీత్యాలు సంభవించినా బాధిత ప్రజలకు తక్షణమే ఆసరా అందించేందుకు ముందుడే సంస్థగా పేరుంది. 1977లో దివిసీమలో ఉప్పెన సమయంలో పర్యటించిన ఇందిరా గాంధీ తనకు ఎక్కడికెళ్లినా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలే సహాయ కార్యక్రమాలలో కనిపిస్తున్నారు గాని, ప్రభుత్వం కనిపించడం లేదంటూ ఘాటైన వాఖ్యలు చేశారు. ఓ సర్వోదయ నాయకుడు అయితే ఆర్ఎస్ఎస్ ను `రెడీ ఫర్ సెల్ఫ్ లెస్ సర్వీస్’ అంటూ అభివర్ణించారు.
 
ఆర్ఎస్ఎస్ శాఖలలో వ్యక్తిగత నైతిక విలువలకు అత్యున్నత ప్రాధాన్యత ఇస్తుంటారు. సాధారణ జీవనం గడుపుతూ, సమాజంలో అన్ని వర్గాల ప్రజలతో అరమరికలు లేకుండా కలిసి పనిచేసే అలవాట్లను ప్రేరేపిస్తారు. చట్టబద్ధ ప్రవర్తనను ప్రోత్సహిస్తారు.  అందుకనే వందలాది సంఘ్-ప్రేరేపిత సంస్థలు భారతదేశం అంతటా పనిచేస్తున్నా ఎక్కడా అవినీతి, బంధుప్రీతి ఆరోపణలు చెలరేగడం కనిపించదు. పైగా, వాటి పనితీరులో పారదర్శకత, జవాబుదారీతనం స్పష్టంగా కనిపిస్తుంది. 
`
`చట్టం ముందు ప్రజలు అందరూ సమానమే’ అనే భావనను మరింత ముందుకు తీసుకెళ్లే సామాజిక సమరసత నెలకొల్పడం ద్వారా ప్రజలు అందరూ పరస్పరం సామరస్యంగా, బంధు భావనతో జీవించే పర్యావరణ వ్యవస్థ సమాజంలో పెంపొందే విధంగా ఆర్ఎస్ఎస్ నిరంతరం కృషి చేస్తుంది. మూడవ సర్ సంఘచాలక్ బాలాసాహెబ్ దేవరస్ కుల ప్రాతిపదికన వివక్షను ‘లాక్, స్టాక్, బారెల్’ గా తొలగించాలని, సందేహించే థామస్‌లందరినీ విశ్రాంతి తీసుకోనీయాలని నిర్మోహాటంగా చెప్పారు. పైగా, అంటరానితనం పాపం కాకపోతే ఈ ప్రపంచంలో పాపం అనే పదమే లేదని కూడా తేల్చి చెప్పారు.

ఆర్ఎస్ఎస్ కేవలం ఓ సాంస్కృతిక, సామాజిక సంస్థ మాత్రమే కాదు, అవసరమైన్నప్పుడు దేశంకోసం, దేశ ప్రజల కోసం ఎటువంటి పోరాటాలకైనా వెనకడుగు వేయబోదని స్పష్టమైన సంకేతం అత్యవసర పరిస్థితి సమయంలో ఇచ్చింది. సరిగా 50 ఏళ్ళ క్రితం దేశంలో ప్రజాస్వామ్య హక్కులను హరిస్తూ విధించిన ఎమర్జెన్సీ  భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఓ చీకటి శకాన్ని సూచిస్తుంది. ఈ సమయంలో మొదటిసారి ప్రజల ప్రాథమిక హక్కులను తొలగించారు. పత్రికా స్వాతంత్రంపై గొడ్డలి పెట్టు అన్నట్టు సెన్సార్ షిప్ అమలు జరిపారు. 
 
దేశంలో ఎమర్జెన్సీని ప్రకటించాక ఇందిరాగాంధీ నిషేధించిన తొలి ప్రజా సంస్థ ఆర్ఎస్ఎస్. 1975 జూన్ 30న నాటి ఆర్ఎస్ఎస్ సర్ సంఘచాలక్ బాలాసాహెబ్ దేవ్‌‌రస్‌ను అరెస్టు చేశారు. 1975 జులై 4న ఆర్ఎస్ఎస్‌ను నిషేధించారు.  దీంతో ఆర్ఎస్ఎస్ స్వయం సేవకుల ఇళ్లే ఎమర్జెన్సీ వ్యతిరేక ఉద్యమానికి కేంద్రాలుగా మారాయి. దేశంలోని ప్రధాన రాజకీయ పక్షాల నేతలు జైళ్లకు, ఇళ్లకు పరిమితమైనప్పుడు, నిత్యం పోరాటాలతో వీధులలో ఉండే వామపక్షాలు కూడా నిస్సహాయంగా మిగిలిన సమయంలో ఆర్ఎస్ఎస్ ప్రపంచంలోనే అతిపెద్ద నిరసన ఉద్యమం నిర్వహించింది.
జైళ్లలో ఉన్నవారిలో 80 శాతంకు పైగా ఆర్ఎస్ఎస్, సంబంధిత సంస్థలకు సంబంధించినవారే. నవంబర్, 1975లో జరిపిన సత్యాగ్రహ ఉద్యమంలో 45 వేలమంది అరెస్ట్ అయితే, వారిలో ఇతర పార్టీలకు చెందిన వారు 9 వేల మంది కూడా లేరు. పత్రికలపై ఆంక్షలతో వాస్తవాలు ప్రజలకు తెలిసే విధంగా చేయడం కోసం అప్పట్లో ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో దేశంలో జిల్లా స్థాయిలో ఎక్కడికక్కడ మాస పత్రికలు, పక్ష పత్రికలు ప్రచురించారు.
1977 ప్రారంభంలో ఎమర్జెన్సీని ఎత్తివేసి, ఎన్నికలు ప్రకటించగానే ప్రధాన ప్రతిపక్షాలు కలిసి జనతా పార్టీగా ఏర్పడటంలో, పరిమిత వనరులతో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించడంలో కీలకంగా వ్యవహరించి దేశంలో తొలి కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పాటులో ఆర్ఎస్ఎస్ నిర్ణయాత్మక పాత్ర వహించింది.
ఎమర్జెన్సీ సమయంలో స్వయంసేవక్ ల పోరాట పటిమను చూసి విస్మయం చెందిన ప్రముఖ సిపిఎం నేత ఏకే గోపాలన్  “మేము కార్మికుల హక్కుల కోసం పిలుపిస్తే లక్షలాది మంది వీధుల్లోకి వచ్చేవారు. కానీ ఇప్పుడు ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పిలుపిస్తుంటే ఎవ్వరూ పలకడం లేదు. ఆర్ఎస్ఎస్ వారెప్పుడూ ప్రజల ఉద్యమాలు చేయడం నేను చూడలేదు. కానీ ఎమెర్జెన్సీకి వ్యతిరేకంగా, ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం నిర్బంధాలను ధిక్కరిస్తూ వేలాదిమంది వస్తుండటం నాకు ఆశ్చర్యం వేస్తుంది” అంటూ ప్రశంసించారు.

జైలులో బాలాసాహెబ్ దేవరస్ తో కలిసి ఉన్న ప్రముఖ సోషలిస్టు నాయకుడు మధులిమాయే సంఘ్ నాయకులతో కలిసి ఉండటంతో సంఘ్ సిద్ధాంతాల పట్ల ఆకర్షితులై `జైలు నుంచి నేను నిక్కర్ తో బయటకు వస్తే ఆశ్చర్యపోకండి’ అంటూ ఓ మిత్రుడికి లేఖ వ్రాసారు. అయితే జనతా ప్రభుత్వ సమయంలో రష్యా పర్యటనకు వెళ్లి వచ్చాక `ద్వంద సభ్యత్వం’ సాకుతో జనతా ప్రభుత్వాన్ని కూలదోసేందుకు కుట్ర ప్రారంభించారు అనుకోండి. అది వేరే అంశం.

రాజకీయాల పరిధిని మించి చూడలేని వారికి ఆర్ఎస్ఎస్ కార్యపద్ధతి అర్థం కాదు. కేవలం సామాజిక స్పృహతో, సామాజిక బాధ్యతగా, ప్రజల అందరి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఆలోచించ కలిగిన సంస్థ నేటి కలుషిత వాతావరణంలో ఆర్ఎస్ఎస్ మాత్రమే అని చెప్పవచ్చు. అందుకనే ఆవిర్భావం నుండి రాజకీయ అధికారం కోసం కాకుండా `వ్యక్తి నిర్మాణం’ కేంద్రంగా ఈ సంస్థ పని చేస్తూ వస్తున్నది. ఆ స్పూర్తితో వేలాది మంది తమ జీవితాలను సమాజకార్యం కోసం అంకితం చేస్తూ వివిధ రంగాలలో నేడు పనిచేస్తున్నారు.

బీహార్ లో వరదల సమయంలో స్వయంసేవక్ ల సేవానిరతి చూసి ముగ్ధులైన జయప్రకాశ్ నారాయణ ఆ తర్వాత ఓ సందర్భంలో `ఆర్ఎస్ఎస్ ఫాసిస్ట్ సంస్థ అయితే నేను కూడా ఫాసిస్ట్ నే’ అంటూ చెప్పుకొచ్చారు. ఆయనే మహాత్మా గాంధీ హత్యా సమయంలో అపోహలతో ఆర్ఎస్ఎస్ కార్యాలయంపైకి దాడికి బయలుదేరారు. అందుకనే సన్నిహితంగా స్వయంసేవక్ ల కార్యపద్ధతి చూసే వరకు, దూరం నుండి చూస్తే ఈ సంస్థ అర్ధం కాదు.

ఆర్ఎస్ఎస్ ను కొన్ని మతాలకు వ్యతిరేకమైన సంస్థగా చిత్రీకరించే ప్రయత్నం మొదటి నుండి జరుగుతుంది. అయితే, హిందువులు, ముస్లింల డిఎన్ఏ  ప్రస్తుత సర్ సంఘచాలక్ డా. మోహన్ భగవత్ స్పష్టం చేశారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రజలకు సహాయం చేయడానికి, సహాయ కార్యక్రమాలను నిర్వహించడానికి, పేద పిల్లలకు విద్య, వైద్య సదుపాయాలు అందించడాని,  వృద్ధులకు సేవ చేయడానికి స్వయంసేవక్ లు అందించే సేవలలో మత విచక్షణ అనేది మచ్చుకైనా కనిపించదు. 

అందుకనే శక్తివంతమైన, సౌభాగ్యవంతమైన భారత దేశ నిర్మాణం కోసం ప్రజలందరినీ కలిపి ఉంచేవిధంగా ఆర్ఎస్ఎస్ చేస్తున్న ప్రయత్నాలు ఆధునిక భారత చరిత్ర రూపురేఖలనే మార్చివేయగలవు.