రేణిగుంటలోని చైనా దేశస్తుడి నివాసంలో ఈడీ సోదాలు

రేణిగుంటలోని చైనా దేశస్తుడి నివాసంలో ఈడీ సోదాలు

తిరుపతి జిల్లా, రేణిగుంటలో చైనా జాతీయుడి నివాసంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు సోదాలు నిర్వహించారు. డ్యూయాంగన్ అనే వ్యక్తి “బిగ్ కిచెన్” పేరుతో చైనా కంపెనీలలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఆహారం సరఫరా చేస్తూ వ్యాపారం నిర్వహిస్తున్నాడు. అయితే, వీసా నిబంధనలు ఉల్లంఘించడం, పన్నులు చెల్లించకపోవడం, వివిధ కంపెనీల పేరుతో వ్యాపారాలు నిర్వహించడం వంటి అంశాలపై అనుమానాలు వ్యక్తమవడంతో ఢిల్లీ, చెన్నై నుంచి ఈడీ అధికారులు రేణిగుంటకు చేరుకుని అతని నివాసంలో సోదాలు జరిపారు.

డ్యూయాంగన్‌కు సంబంధాలున్న కంపెనీలను, ఆర్థిక లావాదేవీలను అధికారులు పరిశీలిస్తున్నారు. ఇదే క్రమంలో ఏర్పేడు మండలం వికృతమాలలో అతను నిర్వహిస్తున్న స్క్రాప్ గోడౌన్‌లో కూడా సోదాలు నిర్వహించారు. అంతే కాకుండా రేణిగుంటలోని అతడి ఇంటి వద్దకు బ్యాంకు అధికారులను పిలిపించి విచారణ జరిపినట్లు సమాచారం.

ఇదిలా ఉండగా, 2021లో రేణిగుంట పోలీస్‌స్టేషన్‌లో వీసా ఉల్లంఘన, ఫోర్జరీ, అనధికారిక నివాసం వంటి అభియోగాలతో డ్యూయాంగన్‌పై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ కేసు విచారణలో ఉంది. ఆ సమయంలో పోలీసులు అతని పాస్‌పోర్టును సీజ్ చేసి తిరుపతి కోర్టుకు అప్పగించారు. అప్పటి నుంచి డ్యూయాంగన్ రేణిగుంటలోనే ఉండి కోట్ల రూపాయల వ్యాపారం సాగిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈడీ అధికారులు సోదాలు జరిపారు.