ఛత్ పండుగ తర్వాతే బిహార్ ఎన్నికలు

ఛత్ పండుగ తర్వాతే బిహార్ ఎన్నికలు

బిహార్ శాసనసభ ఎన్నికలు ఛత్ పండుగ తర్వాత నిర్వహించాలని అక్కడి రాజకీయ పార్టీలు ఎలక్షన్ కమిషన్ (ఈసీ)ను కోరాయి. బిహార్ శాసనసభ ఎన్నికల సన్నద్ధతను పరిశీలించేందుకు రెండు రోజుల పర్యటన కోసం పాట్నా వెళ్లిన కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ సారథ్యంలోని ఈసీ బృందాన్ని 6 జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీల నేతలు కలిసి ఈ మేరకు విజ్ఞప్తి చేశారు.

ఈసీని కలిసిన రాజకీయ పార్టీల నేతలు ఈసారి తక్కువ విడతల్లో పోలింగ్ నిర్వహించాలని కోరారు. వీలైతే ఒకటి లేదా రెండు విడతల్లో పోలింగ్ నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. అయితే మహారాష్ట్ర మాదిరిగా బిహార్‌లోనూ ఒకే విడతలో పోలింగ్ జరపాలని జేడీయూ నేతలు విజ్ఞప్తి చేశారు.  ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లిన బిహారీలు దీపావళి, ఛత్ పండుగలకు స్వస్థలాలకు తిరిగి వస్తారని, అప్పుడు పోలింగ్ నిర్వహించటం వల్ల ఓటింగ్ శాతం పెరుగుతుందని వారు తెలిపారు. బిహార్లో నిర్వహించే ముఖ్యమైన పండుగల్లో ఛత్ ఒకటి. ఈ పండుగను దీపావళి తర్వాత 6 రోజులకు జరుపుకొంటారు.

ఆర్జేడీ కూడా ఛత్, దీపావళి తర్వాత ఎన్నికలు నిర్వహించాలని కోరింది. లేకుంటే ప్రజలు అసౌకర్యానికి గురువుతారని ఈసీకి తెలిపింది. ఆర్జేడీ ఎంపీ అభయ్ కుశ్వాహా మాట్లాడుతూ, బిహార్లో ఎస్ఐఆర్ చేపట్టి ఓటర్ జాబితా నుంచి ఏకంగా 3,66,000 ఓటర్లను తొలగించారని, దీనిపై తమకు అభ్యంతరాలు ఉన్నాయని పేర్కొన్నారు. తొలగించిన ఓటర్ల జాబితాను అందుబాటులో ఉంచాలని ఈసీని ఆయన కోరారు.

ఇక బుర్ఖాలు ధరించి వచ్చే మహిళలను, వారి ఓటరు కార్డులను సరిగ్గా తనిఖీ చేయాలని బీజేపీ నేతలు ఈసీ బృందాన్ని కోరారు. అంతేకాదు ఓటింగ్ పూర్తైన తర్వాత పోలింగ్ ఏజెంట్లు ఫారమ్ 17సీ సేకరించేలా చూడాలని, దీని వల్ల ఓటింగ్ ప్రక్రియ సజావుగా సాగిందో లేదో తెలుస్తుందని, ఈవీఎంలపై ఉన్న సందేహాలు కూడా తొలగిపోతాయని చెప్పారు. అయితే బిహార్ అసెంబ్లీ ఎన్నికలను రెండు దశల్లో నిర్వహించాలని, బహుళ దశల్లో జరిపితే ఓటర్లకు అసౌకర్యం, అభ్యర్థులకు ఖర్చులు పెరుగుతాయని బీజేపీ నేతలు ఎలక్షన్ కమిషన్కు తెలిపారు.

లోక్ జనశక్తి పార్టీకి చెందిన నేతలు పోలింగ్ కేంద్రాల్లో ఓటర్ల సంఖ్యను 1200 నుంచి 800కు తగ్గించాలని ఈసీని కోరారు. సీనియర్ సిటిజన్లను పోలింగ్ బూత్లకు తీసుకురావడానికి ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేయాలని విజ్ఞప్తి చేశారు.  కాగా, ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగేందుకు అన్ని రాజకీయ పార్టీలు సంపూర్ణ సహకారం అందించాలని అఖిలపక్ష సమావేశంలో ఎన్నికల కమిషన్ కోరింది. 

మతసామరస్యం, పరస్పర గౌరవం చాటుకుంటూ ఎన్నికల పండుగలో పాల్గొనాలని, ప్రతి బూత్‌లోనూ పోలింగ్ ఏజెంట్లను నియమించుకోవాలని సూచించింది. ఓటర్ల జాబితా సవరణకు కమిషన్ తీసుకున్న చర్యలపై రాజకీయ పార్టీల ప్రతినిధులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఒక్కో పోలింగ్ స్టేషన్‌కు గరిష్ట ఓటర్ల సంఖ్య 1,200గా కమిషన్ నిర్ణయించడాన్ని స్వాగతించారు.

ప్రస్తుత బిహార్ శాసనసభ గడువు నవంబర్ 22న ముగియనుంది. కనుక అంతకు ముందే కొత్త శాసనసభ ఏర్పాటు చేయాలి. దీపావళి అక్టోబర్ 20న వస్తుంది. నాలుగు రోజుల ఛత్ పండుగ అక్టోబర్ 28న ముగుస్తుంది. కనుక నవంబర్ మొదటి వారంలో బహుశా ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తోంది. 2020లో మూడు దశల్లో బిహార్ ఎన్నికలు నిర్వహించారు. కానీ ఈ ఏడాది ఒకటి లేదా రెండు దశ్లలో ఎన్నికలు జరగవచ్చని భావిస్తున్నారు.