తిరుమలలో క్యూలైన్ల నిర్వహణకు కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌

తిరుమలలో క్యూలైన్ల నిర్వహణకు కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌

తిరుమల శ్రీవారి దర్శనార్ధం వచ్చే యాత్రికులకు వసతి సముదాయం ‘వెంకటాద్రి (పిఎసి-5)’ను, యాత్రికుల రద్దీ, క్యూలైన్‌ నిర్వహణ, తక్షణ సమస్యల నివారణా చర్యల పర్యవేక్షణకు సమీకృత కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను ఉప రాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్‌తో కలిసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గురువారం ప్రారంభించారు.

ఎలాంటి ముందస్తు బుకింగ్‌ లేకుండా వచ్చిన యాత్రికులకు వసతి కల్పించేందుకు రూ.102 కోట్ల వ్యయంతో పిఎసి-5 వసతి సముదాయాన్ని టిటిడి అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ భవనం ద్వారా ఒకేసారి నాలుగు వేల మంది యాత్రికులకు ఉచిత వసతి సౌకర్యం కల్పించేలా నిర్మించారు. 16 డార్మిటరీలు, 2400 లాకర్లు, 24 గంటలూ వేడినీటి సదుపాయం అందుబాటులో ఉంటుంది.

ఒకేసారి 80 మంది యాత్రికులు తలనీలాలు సమర్పించేలా కల్యాణకట్టనూ ఈ ప్రాంగణంలోనే ఏర్పాటు చేశారు. తొలి వసతి బుకింగ్‌ టోకెన్‌ను ఓ యాత్రికురాలికి సిఎం చంద్రబాబు అందించారు. తిరుమల పోటులో ప్రసాదం తయారీ కోసం వినియోగించే సార్టింగ్‌ యంత్రాలను ప్రారంభించారు. వేస్ట్‌ కలెక్షన్‌ యంత్రాన్ని రాధాకృష్ణ, చంద్రబాబు పరిశీలించారు. 

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ తిరుమల కొండపైకి నిషేధిత వస్తువులు తీసుకురాకుండా అలిపిరి వద్దే నిలువరించేలా ఈ కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రం నుంచే టెక్నాలజీ సాయంతో పర్యవేక్షించాలని ఆదేశించారు. కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రానికి అనుసంధానించిన సిసి కెమెరాల సాయంతో అలిపిరి నుంచే రద్దీ హీట్‌ మ్యాప్‌లను గుర్తించి అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.

శ్రీవారి ఏడుకొండలు ఏడు రంగుల్లో గ్రీనరీ ఉండేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. టిటిడి నిర్వహణలోని అన్ని దేవాలయాలనూ ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌తో అనుసంధానించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ఐటి మంత్రి నారా లోకేష్‌, రెవెన్యూ శాఖ మంత్రి సత్యప్రసాద్‌, టిటిడి చైర్మన్‌ బిఆర్‌ నాయుడు, ఇఒ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ పాల్గొన్నారు.