పదేళ్లలో మూడింతలకు పైగా పెరిగిన రాష్ట్రాల అప్పులు

పదేళ్లలో మూడింతలకు పైగా పెరిగిన రాష్ట్రాల అప్పులు
 
* కాగ్ నివేదికలో అప్పుల డేంజర్ బెల్స్  * 2.9 రేట్లు పెరిగిన  రాష్ట్రాల వ్యయాలు 

దేశంలోని రాష్ట్రాలు తీవ్ర అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాయని, గత దశాబ్ద కాలంలో వాటి రుణభారం ఏకంగా మూడింతలు పెరిగిందని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు తొలిసారి విడుదల చేసిన దశాబ్ద విశ్లేషణ నివేదికలో కీలక విషయాలను వెల్లడించింది. 
రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిపై కాగ్ చేసిన ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. కాగ్ అధిపతి కె. సంజయ్ మూర్తి రాష్ట్రాల ఆర్థిక కార్యదర్శుల సమావేశంలో ఈ నివేదికను విడుదల చేశారు.
దీని ప్రకారం, 2013-14 ఆర్థిక సంవత్సరంలో 28 రాష్ట్రాల మొత్తం అప్పులు రూ.17.57 లక్షల కోట్లుగా ఉండగా, 2022-23 నాటికి అది రూ.59.60 లక్షల కోట్లకు చేరింది. అంటే పదేళ్లలోనే రాష్ట్రాల అప్పులు 3.3 రెట్లకు పైగా పెరిగాయని నివేదిక స్పష్టం చేసింది. దీంతో రాష్ట్రాల బడ్జెట్‌లో సింహభాగం వడ్డీలు, రుణాల చెల్లింపులకే సరిపోతోందని పేర్కొంది. తీసుకున్న అప్పులను ఆస్తుల కల్పనకు, పెట్టుబడులకు కాకుండా రోజువారీ రెవెన్యూ ఖర్చులకు, లోటును పూడ్చుకోవడానికి వాడుతున్నాయని కాగ్ తప్పుబట్టింది. 
 
ఆర్థిక నిర్వహణలో పాటించాల్సిన ‘గోల్డెన్ రూల్’ను ప్రభుత్వాలు ఉల్లంఘిస్తున్నాయని తెలిపింది. ఆంధ్రప్రదేశ్, పంజాబ్, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు సహా 11 రాష్ట్రాలు ఈ విధంగా రుణాలను పక్కదారి పట్టిస్తున్నాయని పేర్కొంది. ఏపీలో నికర రుణాల్లో కేవలం 26 శాతమే మూలధన వ్యయానికి వెచ్చిస్తున్నట్లు నివేదికలో వెల్లడైంది. రాష్ట్రాల స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)తో పోలిస్తే అప్పుల నిష్పత్తి కూడా ఆందోళనకరంగా పెరుగుతోందని కాగ్ తెలిపింది.
2023 ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి పంజాబ్ అత్యధికంగా 40.35 శాతం రుణ నిష్పత్తితో అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో నాగాలాండ్ (37.15%), పశ్చిమ బెంగాల్ (33.70%) ఉన్నాయి.  మరోవైపు ఒడిశా (8.45%), మహారాష్ట్ర (14.64%), గుజరాత్ (16.37%) రాష్ట్రాలు మెరుగైన ఆర్థిక క్రమశిక్షణతో తక్కువ రుణ నిష్పత్తిని నమోదు చేశాయి.
ఇలా ఉండగా,  2022-23 ఆర్థిక సంవత్సరంలో అన్ని రాష్ట్రాలు జీతాలు, పెన్షన్లు, వడ్డీ చెల్లింపులపై చేసిన నిబద్ధ వ్యయం 2.9 రెట్లు పెరిగి రూ.15,63,649 కోట్లకు చేరుకుంది. 2013-14లో ఈ వ్యయం రూ.6,26,849 కోట్లుగా ఉంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై కాగ్‌ నివేదిక ఆదివారం ప్రకటించింది. 2013-14 నుండి 2022-23 వరకు పది సంవత్సరాల కాలంలో, రాష్ట్రాల ఆదాయ వ్యయం మొత్తం వ్యయంలో 80-87శాతం ఉందని, ఇది మొత్తం జిఎస్‌డిపి వ్యయంలో సుమారు 13-15 శాతం.
2022-23 ఆర్థిక సంవత్సరంలో ఆదాయ వ్యయం మొత్తం జిఎస్‌డిపిలో 13.85శాతం అని కాగ్ ద్వారా 2022-23లో రాష్ట్ర ఆర్థిక ప్రచురణలో ఈ విషయం వెల్లడైంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో, మొత్తం ఆదాయ వ్యయం రూ.35,95,736 కోట్లలో నిబద్ధ వ్యయం రూ.15,63,649 కోట్లు, సబ్సిడీలపై రూ.3,09,625కోట్లు మరియు గ్రాంట్స్‌ ఇన్‌ ఎయిడ్‌పై రూ.11,26,486 కోట్లుగా నివేదిక పేర్కొంది.
ఈ మూడు మొత్తం ఆదాయ వ్యయంలో 83శాతం కంటే ఎక్కువ అని తెలిపింది. 2013-14లో అన్ని రాష్ట్రాలకు రూ.96,479 కోట్లుగా ఉన్న సబ్సిడీపై ఖర్చు 2022-23లో రాష్ట్రాలకు రూ.3,09,625కోట్లకు పెరిగింది. 2013-14 నుండి 2022-23 వరకు, రెవెన్యూ వ్యయం 2.66 రెట్లు, నిబద్ద వ్యయం 2.49 రెట్లు, సబ్సిడీ 3.21 రెట్లు పెరిగింది అని నివేదిక పేర్కొంది. 2022-23 వ్యయాల్లో జీతాలు అతిపెద్ద భాగంగా ఉన్నాయి, తరువాత పెన్షన్‌, వడ్డీ చెల్లింపులు ఉన్నాయి.