* కాశీ, మధుర కోసం జరిగే ఆందోళనల్లో స్వయంసేవకులు పాల్గొనవచ్చు
ప్రతి భారతీయ కుటుంభం కనీసం ముగ్గురు పిల్లలను కలిగి ఉండాలని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సర్ సంఘచాలక్ డా. మోహన్ భగవత్ పిలుపునిచ్చారు, భారతదేశ జనాభా స్థిరత్వం 2.1 లేదా అంతకంటే ఎక్కువ సంతానోత్పత్తి రేటును నిర్వహించడంపై ఆధారపడి ఉంటుందని అయన స్పష్టం చేశారు. ఆర్ఎస్ఎస్ శతాబ్ది సందర్భంగా ఢిల్లీలో మూడు రోజులపాటు జరిపిన ఉపన్యాస శ్రేణి ‘100 సంవత్సరాల సంఘ్ ప్రయాణం – కొత్త అవధులు’ ముగింపు సమావేశంలో భగవత్ ఈ కార్యక్రమానికి హాజరైన వారు పంపిన 218 ప్రశ్నలను గురువారం సమాధానాలిచ్చారు.
“సరైన వయస్సులో వివాహం చేసుకుని, ముగ్గురు పిల్లలను కనడం వల్ల తల్లిదండ్రులు, పిల్లలు ఇద్దరూ ఆరోగ్యంగా ఉంటారని వైద్యులు నాకు చెప్పారు. ముగ్గురు తోబుట్టువులు ఉన్న ఇళ్లలోని పిల్లలు కూడా అహంకారాన్ని అదుపు చేసుకోవడాన్ని నేర్చుకుంటారు. భవిష్యత్తులో వారి కుటుంబ జీవితంలో ఎటువంటి ఆటంకం ఉండదు. వైద్యులు చెప్పింది ఇదే. మన దేశ జనాభా 2.1 జనన రేటును సిఫార్సు చేస్తోంది, ఇది సగటున బాగానే ఉంది. కానీ మీరు ఎప్పటికీ 0.1 బిడ్డను కలిగి ఉండలేరు. గణితంలో, 2.1 2 అవుతుంది, కానీ రెండు జననాల విషయానికి వస్తే, అది మూడు అయి ఉండాలి” అని భగవత్ వివరించారు.
“జనాభా ఒక వరం కావచ్చు, కానీ అది భారం కూడా కావచ్చనే ఆందోళన కూడా ఉంది. అందరికీ ఆహారం పెట్టాలి. అందుకే జనాభా విధానం ఉంది. కాబట్టి, జనాభా నియంత్రణలో ఉండేలా చూసుకోవడానికి, అదే సమయంలో తగినంతగా ఉండేలా చూసుకోవడానికి, ప్రతి కుటుంబం ముగ్గురు పిల్లలను కలిగి ఉండాలి. కానీ అంతకంటే ఎక్కువ మంది ఉండకూడదు. వారి పెంపకం సరిగ్గా ఉండేలా చూసుకోవడానికి ఇది అందరూ అంగీకరించాల్సిన విషయం” అని ఆయన స్పష్టం చేశారు.
అన్ని వర్గాలకు జనన రేటు తగ్గుతోందని, అయితే ఎల్లప్పుడూ తక్కువగా ఉన్నందున హిందువులకు ఎక్కువగా కనిపిస్తుందని భగవత్ చెప్పారు. ఇతర సమాజాలలో, ఇది ఎక్కువగా ఉండేది కానీ ఇప్పుడు తగ్గుతోంది. “ఇది ప్రకృతి మార్గం, వనరులు తగ్గినప్పుడు, జనాభా పెరిగినప్పుడు, అది జరుగుతుంది. కానీ ప్రతి ఒక్కరూ కొత్త తరాన్ని ముగ్గురు పిల్లలను కనడానికి సిద్ధం చేయాలి” అని ఆయన తెలిపారు.
జనాభా క్షీణత తీవ్రమైన ఆందోళన కలిగించే అంశమని పేర్కొంటూ 2.1 కంటే తక్కువ సంతానోత్పత్తి రేటు ఉన్న సమాజాలు నెమ్మదిగా తమంతట తాముగా నశించిపోతాయని, దీనివల్ల భాషలు, సంస్కృతులు, సమాజాలు అదృశ్యమవుతాయని ఆయన హెచ్చరించారు. 1990ల చివరలో, 2000ల ప్రారంభంలో భారతదేశ జనాభా విధానాన్ని భగవత్ ప్రస్తావించారు.
ఏ సమాజం కూడా తన వృద్ధి రేటు కుటుంబానికి 2.1 మంది పిల్లల కంటే తక్కువగా పడిపోవడాన్ని చూడకూడదని ఆయన స్పష్టం చేశారు. ఇది సామాజిక మనుగడ, సమతుల్యతకు అవసరమైన పరిమితి అని తెలిపారు. భారతదేశ భవిష్యత్తు జనాభా ప్రయోజనం, జాతీయ బలానికి ఈ బాధ్యతను కీలకమైనదిగా చూడాలని ఆయన పౌరులను కోరారు.
జనాభా మార్పు ఆందోళన కలిగించే విషయం అని పేర్కొంటూ జనాభా అసమతుల్యతకు ప్రధాన కారణం మతమార్పిడి అని భగవత్ స్పష్టం చేశారు. “జనాభా గురించి మేము ఆందోళన చెందుతున్నాము. అది కొన్ని పరిణామాలకు దారితీస్తుంది కాబట్టి. దేశ విభజన – అది ఒక పరిణామం. నేను భారతదేశం గురించి మాత్రమే మాట్లాడటం లేదు. ప్రతి దేశంలో జనాభా అసమతుల్యత ఆందోళన కలిగిస్తుంది. ఎందుకంటే జనాభా కంటే అనుమానాన్ని రేకెత్తించేది ఉద్దేశం. జనాభా అసమతుల్యతకు ముఖ్య కారణాలలో ఒకటి మతమార్పిడి.ఇది భారతీయ సంప్రదాయాలలో భాగం కాదు. క్రైస్తవులు, ముస్లింలు కూడా మతమార్పిడి మంచి విషయం కాదని, కాబట్టి అది జరగకూడదని చెబుతారు” అని వివరించారు.
గురుకుల విద్య ఏకీకరణ
గురుకుల విద్యను ప్రధాన స్రవంతి పాఠశాల వ్యవస్థతో అనుసంధానించాలని భగవత్ సూచించారు. గురుకులం సంప్రదాయాలు, సంస్కృతి, చరిత్రను నేర్చుకోవడం గురించి మాత్రమే కాదని ఆశ్రమ జీవనం గురించి మాత్రమే అని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కొత్త జాతీయ విద్యా విధానంను ఆయన ప్రశంసించారు. ఫిన్లాండ్ విద్యా నమూనాతో సమాంతరాలను చూపించారు.
అక్కడ మాతృభాష బోధన, ప్రత్యేక ఉపాధ్యాయ శిక్షణ కీలక లక్షణాలు అని చెబుతూ గురుకుల విలువలను ఆధునిక విద్యతో అనుసంధానించాలని కోరారు. దేశాన్ని అణచివేయడానికి రూపొందించిన వలస పాలన భారతదేశ విద్యా వ్యవస్థను దెబ్బతీసిందని భగవత్ గుర్తు చేశారు. స్వాతంత్ర్యంతో, భారతదేశం తన వారసత్వంపై గర్వాన్ని పునర్నిర్మించుకోవాలని చెప్పారు.
భారతదేశం తన అద్భుతమైన గతం గురించి పిల్లలకు బోధించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. తద్వారా దేశం ఆత్మగౌరవం, ఐక్యతతో పురోగమించగలదని తెలిపారు. మనస్తత్వ మార్పు కోసం పిలుపునిస్తూ, భారతదేశం గొప్ప విజయాలు సాధించగలదనే అవగాహనను వ్యాప్తి చేయాలని భగవత్ ప్రోత్సహించారు. ఇటీవలి పురోగతిని ఆయన ప్రశంసించారు. తరువాతి తరానికి సాధికారత కల్పించడానికి సమకాలీన విద్యతో పాటు స్వదేశీ జ్ఞానం, విలువలను పునరుద్ధరించడానికి మరిన్ని ప్రయత్నాలను చేయాలని ఆయన కోరారు.
వారణాసిలోని జ్ఞాన్వాపి మసీదు, మధురలోని ఈద్గా స్థలాలను హిందువులకు ఇవ్వాలనే డిమాండ్కు సంఘ్ మద్దతు ఇస్తుందని మోహన్ భగవత్ స్పష్టం చేశారు. ఈ స్థలాల కోసం ఏదైనా ఉద్యమంతో తమను తాము అనుబంధించుకోవడానికి సంఘ స్వయంసేవకులు స్వేచ్ఛగా ఉన్నారని తెలిపారు.
“సంఘ్ ఉద్యమాలతో పాల్గొనదు. అది రామాలయ ఉద్యమంతో మాత్రమే ముడిపడి ఉంది. దానిని చివరి వరకు తీసుకువెళ్లింది. ఇప్పుడు సంఘ్ ఇతర ఉద్యమాలతో అనుబంధం కలిగి ఉండదు. కానీ హిందూవుల హృదయంలో, కాశీ, మధుర, అయోధ్య, అన్నీ ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. రెండు జన్మస్థలాలు, ఒకటి దేవుని నివాసం. హిందూ సమాజం వాటిని అడుగుతుంది. సంఘ్ ఈ ఉద్యమంతో పాల్గొనకపోయినా సంఘ స్వయంసేవకులు చేయగలరు. కానీ ఈ మూడింటిని మినహాయించి, నేను చెప్పినట్లుగా, ప్రతిచోటా ఆలయం లేదా శివలింగం కోసం వెతకకండి” అని ఆయన స్పష్టం చేశారు.

More Stories
బిహార్ ఎన్నికల్లో వికాసానికి, వినాశనానికి మధ్య పోరు
తెలంగాణలో నడుస్తున్నది రేవంతుద్దీన్ సర్కారు
ఆర్ఎస్ఎస్- వామపక్షాలు: ఒకటి అభివృద్ధి? మరొకటి నశించింది?