కీలక ప్రాజెక్టులకు అదనంగా రూ.5,000 కోట్లు కోరిన చంద్రబాబు

కీలక ప్రాజెక్టులకు అదనంగా రూ.5,000 కోట్లు కోరిన చంద్రబాబు
రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న కీలక ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు అదనంగా రూ.5,000 కోట్ల ఆర్థిక సహాయం అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను కోరారు. శుక్రవారం ఢిల్లీలో ఆమెను కలిసి సమర్పించిన ఓ వినతిపత్రంలో రాష్ట్రాల మూలధన పెట్టుబడుల కోసం కేంద్రం అందిస్తున్న ప్రత్యేక సహాయ పథకం (సస్కి) కింద ఈ నిధులను కేటాయించాలని పేర్కొన్నారు. 
 
గతంలో ఇదే పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్‌కు రూ.2,010 కోట్లు మంజూరైన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో నిలిచిపోయిన ప్రాజెక్టులను తిరిగి ప్రారంభించి, అభివృద్ధి పనులను వేగవంతం చేయడానికి ఈ అదనపు నిధులు అత్యవసరమని ఆయన వివరించినట్లు తెలిసింది.  2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సింగిల్‌ నోడల్‌ ఏజెన్సీ ప్రోత్సాహక పథకంలో భాగంగా రాష్ట్రానికి 250 కోట్ల రూపాయలు రావాల్సిఉందని చెప్పారు.
ఆ పథకం మార్గదర్శకాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం నిధుల విడుదల కోరుతూ ఇప్పటికే ప్రతిపాదనలు పంపిందని ఆయన ఆర్థికశాఖ మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.  ఆ ప్రతిపాదనలపైన ఉత్తర్వులను సాధ్యమైనంత త్వరగా విడుదల చేయాలని కోరారు. తూర్పు ప్రాంత రాష్ట్రాల సమగ్రాభివృద్ధి కోసం కేంద్రం ప్రకటించిన పూర్వోదయ పథకాన్ని స్వాగతిస్తున్నట్లు చెప్పారు. 
ఈ పథకం కింద ఆంధ్రప్రదేశ్‌ ప్రయోజనం పొందుతుందని అన్నారు. ఈ పథకం విధివిధానాలను సాధ్యమైనంత త్వరగా రూపొందించి అమలులోకి తీసుకురావాలని కోరారు.  ఈ ప్రత్యేక నిధులతో పాటు, రాష్ట్రంలో చేపట్టబోయే పలు ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు కూడా కేంద్ర ప్రభుత్వం ఆర్ధికంగా అండగా నిలవాలని ముఖ్యమంత్రి అభ్యర్ధించారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి కేంద్ర సహకారం ఎంతో కీలకమని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి విజ్ఞప్తిపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.
 
అనంతరం 16వ ఆర్థిక సంఘం చైర్మన్‌ అరవింద్‌ పనగారియాతో భేటీ అయిన చంద్రబాబు, రాష్ట్రానికి సంబంధించిన విజ్ఞప్తులను అందజేశారు. 16వ ఆర్థిక సంఘం సిఫార్సుల్లో తమ రాష్ట్రానికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.  ఈ సమావేశంలో చంద్రబాబుతో పాటు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, కేంద్ర సహాయమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎంపీలు మాగుంట శ్రీనివాసులురెడ్డి, లావు శ్రీకృష్ణదేవరాయలు కూడా పాల్గొన్నారు.