ముఖ్యమంత్రిపై దాడి మర్నాడే ఢిల్లీకి కొత్త పోలీస్ బాస్‌!

ముఖ్యమంత్రిపై దాడి మర్నాడే ఢిల్లీకి కొత్త పోలీస్ బాస్‌!

ప్రస్తుత ఢిల్లీ పోలీస్ కమిషనర్‌ ఎస్బీకే సింగ్‌ను తప్పించి ఆయన స్థానంలో  స‌తీష్ గోల్చాను నియ‌మించారు. . ముఖ్యమంత్రి రేఖా గుప్తాపై దాడి జరిగిన మర్నాడే ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. 1998 ఏజీఎంయూటీ (అరుణాచల్ ప్రదేశ్, గోవా, మిజోరామ్, యూనియన్ టెరిటోరియల్స్) కేడర్ ఐపీఎస్ అధికారి అయిన ఎస్బీకే సింగ్‌  హోమ్ గార్డ్స్ డీజీగా కొనసాగుతూనే ఢిల్లీ పోలీస్ కమిషనర్‌గా ఆగస్టు 1న అదనపు బాధ్యతలు చేపట్టారు. 

 
గోల్చా సైతం ఏజీఎంయూటీ కేడర్ అధికారి కావడం గమనార్హం. డీసీపీ, జేసీపీగా, ఎస్పీపీ (లా అండ్ ఆర్డర్, నిఘ) సహా ఢిల్లీ పోలీస్ విభాగంలో పలు బాధ్యతలు నిర్వర్తించారు. ఈశాన్య ఢిల్లీలో 2020 నాటి మత ఘర్షణల సమయంలో గోల్చా ప్రత్యేక కమిషనర్‌గా ఉన్నారు. గతేడాది ఏప్రిల్‌లో ఆయన జైళ్ల శాఖ డీజీగా నియమితులయ్యారు.
 
జన్ సున్వాయ్‌లో ముఖ్యమంత్రిపై అధికారిక నివాసంలో దాడి జరగడం అతిపెద్ద భద్రతా వైఫల్యమే. సీఎంను చెంపదెబ్బ కొట్టిన నిందితుడు  ఆమె జుట్టుపట్టుకుని లాగే ప్రయత్నం చేశాడు. ఇది యాదృశ్చికంగా జరిగింది కాదని, పథకం ప్రకారమే దాడిచేసినట్టు గుర్తించారు. షాలీమార్ బాగ్‌లోని సీఎం వ్యక్తిగత నివాసం వద్ద రెక్కీ నిర్వహించినట్టు సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డయ్యింది. 
 
నిందితుడు గుజరాత్‌లోని రాజ్‌కోట్‌కు చెందిన రాజేశ్ భాయ్ సకారియాగా గుర్తించారు. జైళ్లో ఉన్న తన బంధువును విడిపించడం కోసమే సీఎంపై దాడిచేసినట్టు భావిస్తున్నారు. అయితే, ఢిల్లీలో వీధి కుక్కల సంరక్షణ గురించి పట్టించుకోకపోవడంతోనే తాను ఇలా చేశానని చెబుతున్నాాడు. అతడి తల్లి కూడా తన కుమారుడు జంతు ప్రేమికుడని, ఇటీవల శునకాల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ఆవేధనగా ఉన్నాడని చెప్పారు.

ఇక, తనపై జరిగిన దాడి గురించి ఢిల్లీ సీఎం రేఖా గుప్తా స్పందిస్తూ తాను క్షేమంగా ఉన్నాని, ఇలాంటి పిరికిపంద చర్యలు ప్రజా సేవ చేయాలనే తన సంకల్పాన్ని అడ్డుకోలేవని స్పష్టం చేశారు. ప్రస్తుతం కోలుకుంటున్నానని, త్వరలోనే తాను విధుల్లోకి తిరిగి వస్తానని రేఖా గుప్తా చెప్పారు. అంతేకాదు, మరింత రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తానని ఆమె తెలిపారు.

మరోవంక, ఆమె భద్రతను పెంచారు. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ తో జెడ్-కేటగిరీ భద్రతను కల్పిస్తున్నారు. దీంతో సీఆర్‌పీఎఫ్‌ సిబ్బంది సీఎం నివాసానికి చేరుకుంది. సీఎంకు 24 గంటలూ రక్షణ కల్పించేందుకు ముఖ్యమంత్రి నివాసంతోపాటూ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున మోహరించారు. సీఆర్‌పీఎఫ్‌తోపాటూ ఢిల్లీ పోలీసులు, నేషనల్‌ సెక్యూరిటీ గార్డ్స్‌ సీఎంకు నిరంతరం రక్షణ కల్పించనున్నారు.