
తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తులు దర్శనం, వసతి కోసం దళారులను ఆశ్రయించవద్దని, టిటిడి అధికారిక వెబ్సైట్లో ఆన్లైన్ ద్వారా, టోకెన్ జారీ కౌంటర్ల ద్వారా నమోదు చేసుకుని దర్శనం పొందాలని టిటిడి విజ్ఞప్తి చేస్తోంది. ఇటీవల శ్రీవారి వీఐపీ బ్రేక్ టికెట్లు ఇప్పిస్తామని వనం నటరాజ నరేంద్ర కుమార్, కెఎస్. నటరాజ శర్మలు రూ 90,000 తీసుకుని మోసం చేసినట్లు హైదరాబాద్కు చెందిన వై. విశ్వనాథ్. ఫిర్యాదు చేశారు.
విశ్వనాథ్ ఫిర్యాదు మేరకు నరేంద్ర కుమార్, నటరాజ శర్మలు వీఐపీ బ్రేక్ దర్శన టిక్కెట్లు ఇస్తామని చెప్పి 2024 ఆగస్టు 16వ తేదీ 12 మంది కోసం రూ.90,000/- వసూలు చేసినట్లు పేర్కొన్నారు. అప్పటి నుండి పలు మార్లు ఫోన్ చేసి తన డబ్బు తిరిగి ఇవ్వాలని కోరినప్పటికీ వారు స్పందించ లేదు. విశ్వనాథ్ ఫిర్యాదు తరువాత టీటీడీ విజిలెన్స్ విభాగం విచారణలో సదరు నిందితులు హైదరాబాద్ జంట నగరాలలో పలువురిని ఇలాగే మోసం చేస్తున్నారని, వీరిపై ఇప్పటికే దాదాపు 12 పోలీస్ కేసులు నమోదయ్యాయని వెల్లడైంది.
వారిద్దరూ టిటిడి ఉద్యోగులు కాదని, వీరికి టిటిడితో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. భక్తుల నుండి తరచూ నకిలీ దర్శన టికెట్ల బుకింగ్పై టిటిడికి ఫిర్యాదులు అందుతున్నాయి. శ్రీవారి దర్శనం, వసతి కోసం అనధికార వెబ్ సైట్ లను ఆశ్రయించి వద్దని, టిటిడి వెబ్సైట్ ద్వారా బుకింగ్ చేసుకోవాలని భక్తులకు సూచించింది. టిటిడి సేవలకు సంబంధించి https://ttdevasthanams.ap.gov.in , ttdevasthanams మొబైల్ యాప్ ద్వారా మాత్రమే ఆన్ లైన్ లో తమ ఆధార్ కార్డు ఆధారంగా బుక్ చేసుకోవాలని టిటిడి సూచించింది.
టిటిడి సమాచారం కోసం టోల్ ఫ్రీ నెంబర్ 155257 ను సంప్రదించాలి. దళారుల అక్రమాలపై భక్తులకు టిటిడి పలు ప్రసార, ప్రచార మాధ్యమాల్లో అవగాహన కల్పించేందుకు టిటిడి చర్యలు చేపట్టింది. దళారులపై అనుమానం వస్తే టిటిడి విజిలెన్స్ అధికారులు 0877-2263828 సదరు ఫోన్ నెంబర్ లో నిరంతరం అందుబాటులో ఉంటారని, ఫిర్యాదు చేయాలని టిటిడి సూచించింది.
More Stories
రామ రాజ్యం నాటి సుపరిపాలన కోసం కూటమి పాలన
నేపాల్లో చిక్కుకున్న తెలుగు వారికోసం ప్రభుత్వాలు అప్రమత్తం
ఏపీలో నాలుగు దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు