పాక్ కోసం గూఢచర్యంలో జ్యోతి మల్హోత్రాపై ఛార్జ్ షీట్ 

పాక్ కోసం గూఢచర్యంలో జ్యోతి మల్హోత్రాపై ఛార్జ్ షీట్ 

పాక్ కోసం గూఢచర్యానికి పాల్పడ్డ భారతీయ యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసులో పోలీసులు తాజాగా 2,500 పేజీల చార్జ్ షీటును దాఖలు చేశారు. ఆమె గూఢచర్యానికి పాల్పడిందనేందుకు పక్కా ఆధారాలు లభించాయని పోలీసు వర్గాలు తెలిపాయి. దాదాపు మూడు నెలల పాటు విచారణ అనంతరం పోలీసులు ఈ చార్జ్ షీటును దాఖలు చేశారు.  జ్యోతి మల్హోత్రా అలియాస్ జ్యోతి రాణిని మే నెలలో హర్యానాలోని హిసార్‌‌లో అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

ఆమె పాక్ హైకమిషన్‌లో ఎహ్సాన్ ఉర్ రహీమ్ అలియాస్ డానిష్ అనే వ్యక్తితో టచ్‌లో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. పాక్‌కు ఆమె రెండు సార్లు వెళ్లివచ్చినట్టు కూడా తెలిపారు. పహల్గాం దాడి, ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో రహీమ్‌ను పర్సోనా నాన్ గ్రేటాగా పేర్కొంటూ దేశం విడిచి వెళ్లాలని కేంద్రం ఆదేశించింది. గూఢచర్యం, గోప్యమైన విషయాలను లీక్ చేయడం తదితర ఆరోపణలపై అతడిని దేశం వీడాలని తేల్చి చెప్పింది. చార్జ్ షీటులోని వివరాల ప్రకారం, మల్హోత్రా చాలా కాలంగా గూఢచర్యానికి పాల్పడుతోంది. 

రహీమ్‌తో పాటు ఐఎస్ఐ ఏజెంట్లు అయిన షకీర్, హసన్ అలీ, నాసిర్ థిల్లాన్‌లతో కూడా ఆమె టచ్‌లో ఉన్నట్టు పోలీసు వర్గాలు తెలిపాయి. ఏప్రిల్ 17న పాకిస్థాన్‌కు వెళ్లిన ఆమె ఆ తరువాత మే 15న తిరిగొచ్చినట్టు పోలీసులు చార్జ్ షీటులో పేర్కొన్నారు. 

ఆ తరువాత జూన్ 10న చైనా వెళ్లిన ఆమె జులై వరకు అక్కడే ఉన్నారని కూడా పేర్కొన్నారు. ఆ తర్వాత నేపాల్ సందర్శించినట్టు చార్జ్ షీటులో పేర్కొన్నారు. ఆమె కర్తార్ పూర్ కారిడార్ మీదుగా పాకిస్థాన్‌కు వెళ్లింది. అక్కడ పంజాబ్ ముఖ్యమంత్రి, పాక్ మాజీ ప్రధాని షరీఫ్ కూతురు మరియమ్ నవాజ్ షరీఫ్‌ను కలిసింది. ఆమెను ఇంటర్వ్యూ కూడా చేసిందని పోలీసు వర్గాలు తెలిపాయి. 

అంతకుముందు హర్యానా పోలీసు అధికారు ఈ ఉదంతంపై మాట్లాడారు. జ్యోతి మల్హోత్రా ఆపరేషన్ సిందూర్ సందర్భంగా పాక్ హైకమిషన్ అధికారితో టచ్‌లో ఉన్నట్టు కూడా తెలిపారు. అయితే, మిలిటరీ ఆపరేషన్స్‌కు సంబంధించిన సమాచారం మాత్రం ఆమె వద్ద లేదని పేర్కొన్నారు.