అసిం మునీర్‌ అణు హెచ్చరికలపై మండిపడ్డ భారత్

అసిం మునీర్‌ అణు హెచ్చరికలపై మండిపడ్డ భారత్
* అమెరికా అండతో పాక్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు
ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న పాకిస్థాన్‌ ఆర్మీ ఫీల్డ్‌ మార్షల్‌ సయ్యద్‌ అసిం మునీర్‌ తమది అణ్వాయుధ దేశమని, అవసరమైతే అణు యుద్ధానికి దిగుతామని బహిరంగంగా భారత్ పై బెదిరింపులకు దిగడం పట్ల భారత్ మండిపడింది.  తాము నాశనమైతే తమతోపాటు సగం ప్రపంచాన్ని తీసుకెళ్తామంటూ మునీర్‌ అణు బెదిరింపులను భారత్ తీవ్రంగా ఖండించింది. అమెరికా నుంచి పాక్‌ ఆర్మీ చీఫ్‌ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని పేర్కొంది.

ఇలాంటి అణు బెదిరింపులకు భారత్‌ భయపడదని తెలిపింది. దేశ భద్రత కోసం ఎలాంటి కఠిన చర్యలకైనా వెనుకాడబోమని స్పష్టం చేసింది. ఈ మేరకు పాక్‌పై విరుచుకుపడుతూ భారత విదేశాంగ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. అమెరికా మద్దతిచ్చినప్పుడల్లా భారత్‌పై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం పాక్‌కు అలవాటేనని దుయ్యబట్టింది. అణ్వాయుధాల వినియోగంపై బెదిరింపులు పాక్‌కు అలవాటేనని పేర్కొంది. 

ఇలాంటి వ్యాఖ్యలతో ఆ దేశం ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తోందో అంతర్జాతీయ సమాజం అర్థం చేసుకోవాలని వ్యాఖ్యానించింది. పాక్‌ అణ్వాయుధాలపై ఎవరి నియంత్రణ ఉందో దీన్నిబట్టే స్పష్టమవుతోందని పేర్కొంది. పాక్‌ సైన్యం తీవ్రవాద గ్రూపులతో చేతులు కలిపిందని విదేశాంగ శాఖ తన ప్రకనటలో ధ్వజమెత్తింది.  అమెరికా పర్యటనలో ఉన్న పాక్‌ ఆర్మీ చీఫ్‌ మునీర్‌ ఫ్లోరిడాలోని టాంపాలో జరిగిన ఓ కార్యక్రమంలో పాక్‌ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ సింధునది వివాదాన్ని ప్రస్తావిస్తూ భారత్‌పై నోరుపారేసుకున్నారు.

సింధు నది భారతీయుల ఆస్తిఏమీ కాదంటూ వ్యాఖ్యానించారు.  ఆ నదిపై భారత్ డ్యామ్‌లు నిర్మించే వరకు ఎదురు చూస్తామని చెప్పారు. తమ వద్ద క్షిపణులకు ఎలాంటి కొదవ లేదని, ఆ డ్యామ్‌లను పది క్షిపణులతో పేల్చేస్తామని హెచ్చరించారు. భారత్ నుంచి తమ అస్థిత్వానికి ముప్పు ఏర్పడితే, తాము నాశనం అవుతూనే సగం ప్రపంచాన్ని నాశనం చేస్తామంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు.

అమెరికా నేల నుంచి భారత్​ను బెదిరిస్తూ, పాక్​ చమురు, ఖనిజ సంపద గురించి గొప్పలు చెప్పుకున్నారు. ‘భారత్​ హైవేపై మెరుస్తూ వస్తున్న మెర్సిడెజ్​ కారులాంటిది. కానీ మేం కంకరతో నిండిన డంప్​ ట్రక్కు. ట్రక్కు కారును ఢీకొంటే నష్టపోయేది ఎవరు?’ అంటూ వ్యాఖ్యానించారు.