తాజా పరిణామాలపై పుతిన్‌కు ప్రధాని మోదీ ఫోన్

తాజా పరిణామాలపై పుతిన్‌కు ప్రధాని మోదీ ఫోన్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ భారత్‌పై భారీగా సుంకాలు మోపిన వేళ రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో, ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్‌లో మాట్లాడారు. తాజా పరిణామాలపై ఇరువురు నాయకులు చర్చించారు. ఉక్రెయిన్‌తో యుద్ధంపై తాజా పరిణామాలను పుతిన్ వివరించగా, శాంతియుతంగా పరిష్కరించుకోవాలని ప్రధాని సూచించారు.  భారత్‌ శాంతివైపు ఉందన్న వైఖరిని మోదీ పునరుద్ఘాటించారు.  ఇదే సమయంలో రష్యాతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

రష్యా అధ్యకుడు పుతిన్‌తో ఫలప్రదమైన సంభాషణ జరిగిందని ప్రధాని మోదీ ఎక్స్‌లో పోస్టు చేశారు. ద్వైపాక్షిక సంబంధాల్లో పురోగతిపై సమీక్ష జరిపామని తెలిపారు.   రష్యాతో వ్యూహాత్మక భాగస్వామ్యం విషయంలో భారత్‌ కట్టుబడి ఉందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. ఈ ఏడాదిలో స్వదేశంలో భారత్, రష్యా 23వ వార్షిక సమావేశం నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పిన మోదీ  ఉక్రెయిన్ యుద్ధం పురోగతి విషయమై రష్యా అధ్యక్షుడికి ధన్యవాదాలు తెలిపారు.

 “స్నేహితుడు పుతిన్‌తో సంభాషణ సమగ్రంగా, ఉపయుక్తంగా సాగింది. ఉక్రెయిన్ యుద్ధం తాజా అప్‌డేట్స్ విషయంలో ఆయనకు ఫోన్‌లోనే ధన్యవాదాలు తెలియజేశాను. భారత్, రష్యాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల పురోగతిపై కూడా ఇద్దరం చర్చించాం” అని ప్రధాని మోదీ తెలిపారు.

“అంతేకాదు రష్యాతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకునే విషయంలో కట్టుబడి ఉన్నామని పుతిన్‌తో చెప్పాను. ఈ ఏడాది చివర్లో పుతిన్‌ను భారత్‌కు ఆహ్వానించనున్నాను” అని మోదీ ఎక్స్ లో పేర్కొన్నారు. రష్యా, ఉక్రెయిన్ యుద్దంపై మరోసారి భారత్ తటస్థ వైఖరిని ప్రధాని స్పష్టం చేశారు. ఇరు దేశాధినేతలు చర్చించుకొని, శాంతియుతంగా సమస్యను పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు.

ఈ ఏడాది చివర్లో పుతిన్‌కు ఆతిథ్యం ఇచ్చేందుకు ఎదురు చూస్తున్నానని ప్రధాని రాసుకొచ్చారు. ఇప్పటికే బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డా సిల్వా, ప్రధాని మోదీ ఫోన్‌లో మాట్లాడుకున్నారు. ఇరుదేశాలపై అమెరికా 50 శాతం సుంకాలు విధించటంతో ఇరు దేశాధినేతలు ఏం మాట్లాడుకున్నారన్న దానిపై ఆసక్తి నెలకొంది.