మోదీ పర్యటనకు చైనా స్వాగతం

మోదీ పర్యటనకు చైనా స్వాగతం

భారత్ – చైనా  దేశాల మధ్య సంబంధాల విషయంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ నెలాఖరులో టియాంజిన్ నగరంలో జరగనున్న షాంఘై సహకార సంస్థ (ఎస్పీఓ) శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు రావాలని ప్రధాని నరేంద్ర మోదీకి శుక్రవారం చైనా అధికారికంగా ఆహ్వానం పలికింది. 2020లో గల్వాన్ లోయలో జరిగిన హింసాత్మక ఘర్షణల తర్వాత ప్రధాని మోదీ తొలిసారి చైనాలో పర్యటించనున్నారు.

ఈ సదస్సు ఎస్సీఓ సభ్యదేశాల మధ్య ఐక్యత, స్నేహం, ఫలవంతమైన సహకారానికి వేదికగా మారుతుందని చైనా ప్రకటించింది. ఈ మేరకు చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి గుయో జియాకున్ మీడియా సమావేశంలో తెలిపారు. ఎస్సీఓ సదస్సు ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 1వరకు జరగనుంది.  ఈ సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మోదీ, ఈ నెల 31న చైనాలోని తియాన్‌జిన్ నగరానికి చేరుకోనున్నారు. సెప్టెంబర్ 1న కూడా అక్కడే ఉండనున్నారు. 
సదస్సులో భాగంగా ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో ద్వైపాక్షిక చర్చలు జరిపే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.  గల్వాన్ ఘర్షణల అనంతరం ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దాదాపు నాలుగేళ్ల పాటు సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగాయి. అయితే ఇటీవల వాస్తవాధీన రేఖ వెంబడి గస్తీ విషయంలో ఇరుదేశాల మధ్య ఒక అంగీకారం కుదరడంతో ప్రతిష్టంభన వీడింది. ఈ సానుకూల వాతావరణంలోనే ప్రధాని మోదీ పర్యటన ఖరారైంది.

కాగా భారత్, చైనా, రష్యా, పాకిస్థాన్ సహా మొత్తం పది దేశాలు సభ్యులుగా ఉన్న షాంఘై సహకార సంస్థను 2001లో స్థాపించారు. ఈ ఏడాది టియాంజిన్‌లో జరిగే సదస్సు ఎస్సీఓ చరిత్రలోనే అతిపెద్ద సదస్సుగా నిలవనుందని చైనా వెల్లడించింది. సుమారు 20 దేశాల అధినేతలు, 10 అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొననున్నారు. 2019లో చివరిగా ప్రధాని మోదీ చైనాలో పర్యటించారు. 

గతేడాది రష్యా వేదికగా జరిగిన బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సులో ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. చైనాలో ఈ ఏడాది జూన్‌లో జరిగిన షాంఘై సహకార సంస్థ సభ్యదేశాల రక్షణ మంత్రుల సదస్సుకు కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ హాజరయ్యారు.  పాక్‌ ప్రేరేపిత సీమాంతర ఉగ్రవాదం, పహల్గాం ముష్కర దాడులను ప్రస్తావించకపోవడంపై తీవ్రంగా పరిగణించారు.

ఉమ్మడి ప్రకటనపై సంతకం చేసేందుకు కూడా నిరాకరించారు. దీంతో ఎలాంటి ఉమ్మడి ప్రకటన లేకుండానే నాటి చర్చలు ముగిశాయి. అనంతరం జులైలో జరిగిన విదేశాంగ మంత్రుల సదస్సులో భారత విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్‌ పాల్గొన్నారు.