
* ఆపరేషన్ విజయ్ 26వ వార్షికోత్సవం
సైనిక పరంగానే కాకుండా దౌత్య పరంగా సహితం భారత్ కు ఘన విజయం లభించడంతో పాటు సైనికంగా పెను సంస్కరణలకు, ఆధునీకరణకు భారీ కసరత్తు ప్రారంభించేందుకు దారితీసింది సరిగ్గా 25 ఏళ్ళ క్రితం కార్గిల్ కొండలలో భారత సేనలు సాధించిన అపూర్వమైన విజయం. స్వతంత్ర భారత దేశంలో 1971లో బంగ్లాదేశ్ ఏర్పాటుకు దారితీసిన యుద్ధం భారత్ ఇప్పటి వరకు సాధించిన ఏకైక నిర్ణయాత్మక విజయం కాగా, మొదటిసారిగా అంతర్జాతీయంగా పాకిస్థాన్ ను ఏకాకి కావించి, దిక్కుతోచక వెనకడుగు వేయక తప్పని పరిస్థితులు కల్పించింది కార్గిల్ యుద్ధం. మొదటిసారిగా పాకిస్థాన్ ను ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తున్న దేశంగా ప్రపంచం గుర్తించింది.
ఈ యుద్ధంలో మన నిఘా వర్గాల మధ్య సయోధ్య లేకపోవడం బహిర్గతం కావడమే కాకుండా సైనికంగా మన బలహీనతలు అన్ని స్పష్టం అయ్యాయి. దానితో వాజపేయి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సుబ్రహ్మణ్యం కమిషన్ మన రక్షణ వ్యూహాలపై మొదటిసారిగా బహిరంగ విచారణ జరిపి సంపాదించిన నివేదిక ఇప్పటికి కూడా సైనికంగా, రక్షణ పరంగా చేపట్టాల్సిన సంస్కరణలకు ఓ మార్గదర్శిగా మిగిలింది. ఈ కమిషన్ నివేదిక ప్రకారమే త్రివిధ సైనిక దళాలకు చీఫ్ అఫ్ డిఫెన్సె సర్వీసెస్ (సిసిఎస్) నియామకం జరిగింది. అయితే ఇంకా అనేక కీలక సిఫార్సులు అమలు జరగాల్సి ఉంది.
ముఖ్యంగా సైనిక సంబంధ పాలనా విషయాలలో ఐఏఎస్ అధికారుల పాత్ర తగ్గించి, సైనిక అధికారుల అభిప్రాయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. కార్గిల్ యుద్ధం జరిగి పాతికేళ్లు పూర్తయినా ఇప్పటికీ ఆ యుద్ధంలో భారత సైనికులు చూపించిన తెగువ, పోరాటపటిమ, వారి వీరత్వం గురించి కథలు కథలుగా చెప్పుకుంటూనే ఉన్నాం. అత్యంత ప్రతికూల పరిస్థితులలో, పరిమితమైన ఆయుధాలు అందుబాటులో ఉన్న సమయంలో కార్గిల్ యుద్ధంలో భారత్ విజయానికి గుర్తుగా ఏటా జూలై 25వ తేదీన కార్గిల్ విజయ్ దివస్గా జరుపుకుంటున్నాం.
1971 తర్వాత భారత్-పాక్ మధ్య జరిగిన భారీ సైనిక పోరాటం ఇదే.పాక్ పన్నాగాలను పసిగట్టడంలో భారత ఇంటెలిజెన్స్ సంస్థలు మొదట్లో విఫలం అయినా యుద్ధ క్షేత్రంలో మాత్రం సైనికులు భారత్ సత్తా ఏంటో పాకిస్తాన్కు రుచి చూపించారు. సైనికుల పరాక్రమంతో పాటు నాటి ప్రధాని వాజపేయి, రక్షణమంత్రి జార్జ్ ఫెర్నాండెస్, విదేశాంగ మంత్రి జశ్వంత్ సింగ్ అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించడంతో నాడు పాకిస్థాన్ కు మిత్రదేశాలుగా ఉన్న అమెరికా, చైనా వంటి దేశాలు సహితం నిస్సహాయంగా మిగిలిపోవాల్సిన పరిస్థితులు కల్పించారు.
1999లో భారత్ సరిహద్దుల్లో కీలకంగా, వ్యూహాత్మకంగా ఉన్న సియాచిన్ గ్లేసియర్ ప్రాంతాన్ని ఆక్రమించుకునేందుకు పాక్ భారీ కుట్రకు తెరలేపింది. లఢఖ్లోని కార్గిల్ సెక్టార్లో పాకిస్తాన్ సైనికులు ముజాహిదీన్ వేషంలో అత్యంత ఎత్తైన కొండ ప్రాంతాల్లోకి చొరబడ్డారు. అక్కడ క్యాంపులు ఏర్పాటు చేసుకున్నారు. స్థానికంగా ఉండే గొర్రెల కాపరులు పాకిస్తాన్ క్యాంపులను గుర్తించిన సమాచారాన్ని భారత సైన్యానికి అందించారు.
వెంటనే అక్కడికి చేరుకున్న కొంతమంది భారతీయ సైనికులు మొదట వారిని ఉగ్రవాదులు అని భావించారు. కానీ ఆ తర్వాత వారు ఉగ్రవాదుల వేషంలో ఉన్న పాకిస్తాన్ సైనికులు అని గుర్తించారు. 1999 మేలో ప్రారంభమైన కార్గిల్ యుద్ధం జూలై 25వ తేదీతో ముగిసింది. పాక్ సైన్యాన్ని గుర్తించేందుకు వెళ్లిన ఐదుగురు సైనికులను మొదట బలితీసుకున్నారు. ఆ తర్వాత ముఖ్యంగా ద్రాస్, కక్సర్, బటాలిక్, ముష్కో సెక్టార్లలోని వ్యూహాత్మక శిఖరాలను పాకిస్తాన్ ఆర్మీ ఆక్రమించింది.
సరిహద్దుల్లో పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకున్న భారత్ పాక్ సైన్యాన్ని తరిమికొట్టేందుకు ఆపరేషన్ విజయ్ మొదలుపెట్టింది. భారీగా సైనికులు, ఆయుధాలు, మందుగుండు సామగ్రిని యుద్ధ ప్రాంతానికి తరలించింది. అయితే మొదట్లో భారత్కు భారీగా ఎదురుదెబ్బలు తగిలాయి. ఎందుకంటే పాకిస్తాన్ సైన్యం ఎత్తైన కొండలపైన ఉండగా, భారత సైనికులు మాత్రం కింది నుంచి దాడి చేయడం వల్ల పట్టు సాధించలేకపోయారు.
వీటికితోడు సియాచిన్ ప్రాంతంలో మంచు, చలి వంటి వాతావరణ పరిస్థితులను తట్టుకుని యుద్ధం చేయడం కష్టంగా మారింది. ఎత్తైన ప్రాంతం నుంచి పాక్ చేస్తున్న దాడులను నిలువరించేందుకు భారత సైన్యం బోఫోర్స్ హోవిట్జర్లు (బోఫోర్స్ ఫిరంగులు) రంగంలోకి దింపింది. ఇవి ఎత్తైన ప్రాంతాల్లో ఉన్న శత్రువుల బంకర్లపై అత్యంత కచ్చితత్వంతో దాడి చేసి భారీ నష్టాన్ని కలిగించాయి.
పరిస్థితి మరింత దారుణంగా తయారవుతుండటంతో భారత వాయుసేన రంగంలోకి దిగింది. ఆపరేషన్ సఫేద్ సాగర్ పేరుతో శత్రు స్థావరాలపై వైమానిక దాడులకు దిగింది. కార్గిల్ అంటే ఎత్తైన భూభాగం, ఇరుకైన లోయలు, పాకిస్తాన్ యాంటీ ఎయిర్క్రాఫ్ట్ దాడులు ఇండియన్ ఎయిర్ఫోర్స్కు పెను సవాళ్లను విసిరాయి. దీంతో మొదట్లోనే ఇంజిన్ వైఫల్యం కారణంగా ఐఏఎఫ్ ఒక మిగ్-27 ఫైటర్ జెట్ను కోల్పోయింది. దాని పైలట్ నచికేతను పాకిస్తాన్ యుద్ధ ఖైదీగా బంధించింది. ఇక మరో మిగ్-21 యుద్ధ విమానాన్ని పాక్ దళాలు కూల్చివేయడంతో దాని పైలట్ అజయ్ అహూజా అమరుడయ్యాడు.
మొదట్లోనే ఎదురుదెబ్బలు తగలడంతో ఇండియన్ ఎయిర్ఫోర్స్ వ్యూహాలను మార్చేసి యుద్ధాన్ని కొనసాగించింది. శత్రుదేశం క్షిపణులకు చిక్కకుండా ఉండేందుకు 32 వేల అడుగుల ఎత్తు నుంచి దాడులు చేయడం ప్రారంభించింది. మిరాజ్ 2000 వంటి అధునాతన ఫైటర్ జెట్లు లేజర్ గైడెడ్ బాంబులను ఉపయోగించి పాకిస్తాన్ సైనిక స్థావరాలను ధ్వంసం చేశాయి. దీంతో అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయీ కార్గిల్లో యుద్ధం లాంటి పరిస్థితిని ప్రకటించారు.
పాకిస్తాన్ సైన్యం ఆక్రమించిన టోలోలింగ్ శిఖరాన్ని తిరిగి స్వాధీనం చేసుకుని కార్గిల్ యుద్ధంలో ఇండియన్ ఆర్మీ తొలి విజయాన్ని దక్కించుకుంది. టోలోలింగ్ విజయం భారత సైన్యానికి మాత్రమే కాకుండా యుద్ధంలో విజయం సాధించగలమని దేశ ప్రజలకు ధైర్యాన్నిచ్చింది. శ్రీనగర్-కార్గిల్-లేహ్లను అనుసంధానించే హైవేకు కీలకమైన పాయింట్గా టోలోలింగ్ శిఖరం ఉంటుంది.
టోలోలింగ్ విజయం తర్వాత రెట్టించిన ఉత్సాహంతో భారత సైన్యం టైగర్ హిల్, పాయింట్ 4875 (బాత్రా టాప్), పాయింట్ 5140 వంటి వ్యూహాత్మకంగా కీలకంగా ఉన్న శిఖరాలను తిరిగి స్వాధీనం చేసుకుంది. అందుకు భారత సైనికులు భీకర పోరాటం చేశారు. ఈ పోరాటంలోనే విక్రమ్ బాత్రా, మనోజ్ పాండే వంటి చాలామంది భారత సైనికులు ప్రాణాలు త్యాగం చేశారు.
స్థానికంగా నివసించే ప్రజల నుంచి సమాచారాన్ని సేకరించడంతోపాటు యుద్ధంలో పట్టుబడిన పాక్ చొరబాటుదారులను విచారణ చేసి భారత సైన్యం కీలక వివరాలను సేకరించింది. అదే యుద్ధంలో భారత సైన్యంకు బాగా ఉపయోగపడింది. అంతేకాకుండా పాకిస్తాన్ సైనికుల రేడియో కమ్యూనికేషన్లను ట్యాప్ చేసి వాటిని విశ్లేషించడం ద్వారా శత్రువుల కదలికలు, వారికి ఆయుధాలు ఇతర వస్తువులు సరఫరా అయ్యే మార్గాలను గుర్తించడం యుద్ధంలో భారత్ పైచేయి సాధించేందుకు దోహదపడ్డాయి.
అదే సమయంలో పాక్ బలహీనతల గురించి కీలక సమాచారం అందింది. భారత్, పాక్ సరిహద్దుల్లో ఇంతటి భారీ కుట్రకు తెరలేపినా దాన్ని ముందే పసిగట్టడంలో రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ ఘోరంగా విఫలం అయింది. పాక్ సైన్యం భారీ చొరబాటును ముందే గుర్తిస్తే.. ఇంతటి యుద్ధం జరిగేది కాదనే విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ఈ సమస్యను భారత్ అధిగమించి యుద్ధంలో పోరాటం చేసింది.
పాక్ సైన్యం చొరబాటు గురించి సమాచారం అందిన వెంటనే నిఘాను ఏర్పాటు చేసి ప్రతిస్పందించింది. ఒకవైపు సరిహద్దుల్లోకి చొరబడిన పాక్ సైన్యాన్ని తరిమి కొడుతున్న భారత్, మరోవైపు అంతర్జాతీయంగా ఆ దేశంపై ఒత్తిడి తీసుకురావడంలో సఫలం అయింది. కార్గిల్ యుద్ధం సమయంలో దౌత్యపరంగా కీలక చర్యలు తీసుకుంది. భారత్ దౌత్యంతో పాకిస్తాన్ చొరబాట్లను అంతర్జాతీయ సమాజం తీవ్రంగా ఖండించింది.
సరిహద్దుల్లో సైన్యాన్ని బేషరతుగా వెనక్కి రప్పించాలని అప్పటి పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ను అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ తీవ్రంగా ఒత్తిడి చేశారు. ఒకవైపు అంతర్జాతీయంగా వస్తున్న ఒత్తిడితోపాటు భారత సైన్యం చేస్తున్న దాడులను తట్టుకోలేకపోయిన పాక్ సైన్యం వెనక్కి తిరిగి పారిపోయింది. భారత్ దెబ్బకు పాకిస్తాన్ సైన్యం పారిపోవడంతో 1999 జూలై 14వ తేదీన ఆపరేషన్ విజయ్ విజయవంతమైనట్లు భారత సైన్యం అధికారికంగా ప్రకటించింది.
ఇక చిట్టచివరి పాక్ సైనికుడిని భారత గడ్డపై నుంచి తరిమి కొట్టిన తర్వాత జూలై 26వ తేదీన కార్గిల్ యుద్ధం ముగిసినట్లు అధికారికంగా ప్రకటించారు. దీంతో అప్పటి నుంచి ఏటా జూలై 26వ తేదీన కార్గిల్ విజయ్ దివస్గా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా కార్గిల్ యుద్ధంలో అమరులైన భారత జవాన్ల ధైర్యసాహసాలను కొనియాడుతున్నారు. కార్గిల్ యుద్ధం భారత సైన్యం అద్భుతమైన ధైర్యసాహసాలు, పరాక్రమం, త్యాగం, వ్యూహాత్మక పట్టుదల, దౌత్య విజయానికి ప్రతీకగా నిలిచింది.
కార్గిల్ యుద్ధంలో భారత్ ఘన విజయాన్ని సాధించినప్పటికీ భారీగా సైనికులు ప్రాణాలు విడిచారు. చాలా మంది గాయాలపాలయ్యారు. కార్గిల్ యుద్ధంలో అమరులైన వారి గురించి భారత ప్రభుత్వం విడుదల చేసిన అధికారిక గణాంకాల ప్రకారం 527 మంది సైనికులు అమరులయ్యారు. 1,363 మంది జవాన్లు గాయపడ్డారు. పైలట్ నచికేతను యుద్ధఖైదీగా పట్టుకున్న పాకిస్తాన్ ఆ తర్వాత విడుదల చేసింది.
More Stories
ఆసియాకప్లో హద్దుమీరిన పాక్ ఆటగాళ్లు
ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవంకు ముఖ్యఅతిధిగా మాజీ రాష్ట్రపతి
ఇద్దరు మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు మృతి