విమాన ప్రమాదంపై అప్పుడే ఓ నిర్ణయానికి రావొద్దు

విమాన ప్రమాదంపై అప్పుడే ఓ నిర్ణయానికి రావొద్దు
అహ్మదాబాద్‌లో ఎయిర్‌ ఇండియా విమాన ప్రమాదంపై ఎయిర్‌క్రాఫ్ట్‌ యాక్సిడెంట్‌ ఇన్వెస్టిగేషన్‌ బ్యూరో (ఏఏఐబి) ప్రాథమిక నివేదిక విడుదల చేసిన విషయం తెలిసిందే. మొత్తం 15 పేజీలతో ప్రాథమిక నివేదికలో కీలక విషయాలు వెల్లడించింది. విమానం టేకాఫ్‌ అయ్యాక ఇంధన కంట్రోలర్‌ స్విచ్‌లు సెకన్‌ పాటు ఆగిపోయినట్లు వెల్లడించింది. 
 
ఈ నివేదికపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి  రామ్మోహన్‌ నాయుడు స్పందిస్తూ అప్పుడే ఒక నిర్ణయానికి రావొద్దని, తుది నివేదిక వచ్చే వరకూ వేచి ఉండాలని సూచించారు.  “దీనిపై అప్పుడే మనం ఎటువంటి నిర్ధరణకు రాకూడదు. ప్రపంచంలోనే అత్యంత అద్భుతమైన, ప్రతిభ గల పైలట్లు, సిబ్బంది మన దగ్గర ఉన్నారు. పౌర విమానయానానికి వారు వెన్నెముక వంటివారు” అని తెలిపారు. 
 
“ఈ రంగానికి వారే ప్రధాన వనరులు. వారి సేవలను నేను అభినందిస్తున్నాను. వారి సంక్షేమం, శ్రేయస్సు కోసం మా ప్రభుత్వం పనిచేస్తుంది. ఇలాంటి సమయంలో ఎలాంటి నిర్ధరణకు రాకుండా తుది నివేదిక కోసం వేచిచూద్దాం” అని ఆయన పేర్కొన్నారు. “అనేక సాంకేతిక అంశాలు ఇందులో ఉన్నాయి. ప్రస్తుతానికి ప్రాథమిక నివేదికి మాత్రమే వచ్చింది. ఈ నివేదికపై అప్పుడే ఓ నిర్ణయానికి రావడం తొందరపాటే అవుతుంది. తుది నివేదిక కోసం వేచి ఉండాలి” అని కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు సూచించారు.