భద్రాద్రి ఈవోపై కబ్జాదారుల దాడి

భద్రాద్రి ఈవోపై కబ్జాదారుల దాడి

ఆక్రమణకు గురైన భద్రాచలంలోని శ్రీసీతారామచంద్రస్వామి భూములను పరిశీలించేందుకు వెళ్ళిన భద్రాద్రి ఆలయ ఇఒ రమాదేవిపై భూ అక్రమణదారులు దాడికి పాల్పడిన సంఘటన మంగళవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పురుషోత్తపట్నంలో చోటుచేసుకుంది. భద్రాద్రి రామాలయానికి సంబంధించిన భూములు ప్రస్తుతం అల్లూరి సీతారామారాజు జిల్లా, పురుషోత్తపట్నంలో ఉన్నాయి. అయితే ఆ భూములను స్థానికులు ఆక్రమించారు. 

ఈ విషయంలో గత కొంత కాలంగా భూ ఆక్రమణదారులకు, దేవాదాయ శాఖ ఉద్యోగుల మధ్య వివాదం కొనసాగుతోంది. రామాలయానికి చెందిన 889.50 ఎకరాల భూములను దేవస్థానానికి అప్పగించాలని ఎపి హైకోర్టు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. దాదాపు 900 ఎకరాల దేవస్థానం భూములను అన్యాక్రాంతానికి గురయ్యాయి.  ఇప్పటికైనా భద్రాచలంను అనుకొని ఉన్న నాలుగు గ్రామాలను తెలంగాణలో విలీనం చేస్తే రాములోరి భూములు అన్యాక్రాంతానికి గురికాకుండా కాపాడవచ్చని భద్రాద్రివాసులు అంటున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయంలో పోలవరం ప్రాజెక్టు పేరుతో తెలంగాణలోని 7 మండలాలను ఆంధ్రాలో విలీనం చేసిన విషయం తెలిసిందే. 

పోలవరం ముంపు లేకున్నా భద్రాచలం పట్టణానాన్ని అనుకొని ఉన్న చుట్టుపక్కల గ్రామాలను ఆంధ్రాలోకి విలీనం చేశారు. ఈ విలీనంతోనే భద్రాచలం ఆలయ భూములు ఆంధ్రప్రదేశ్ పరిధిలోకి వెళ్ళాయి.  దీంతో అప్పటినుండి స్థానికులు భూములను అక్రమించడం ప్రారంభించారు. ఈ క్రమంలో స్వామి వారి భూముల కబ్జాపై సమాచారం అందుకున్న ఇఒ మంగళవారం పురుషోత్తపట్నంకు చేరుకున్నారు. 

ఆక్రమణకు గురవుతున్న భూముల్ని భూకబ్జాదారుల నుంచి కాపాడేందుకు వెళ్లిన ఆమెపై భూ కబ్జాదారులంతా మూకుమ్మడిగా దాడి చేశారు. ఈ దాడితో ఆమె స్పృహ తప్పిపోయారు. ఈ హఠాత్పరిణామంతో అప్రమత్తమైన స్థానికులు, పోలీసులు ఆమెను అత్యవసర చికిత్స నిమిత్తం భద్రాచలం పట్టణంలోని ఒక ప్రయివేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె కోలుకుంటున్నారు.

భద్రాచలం రామాలయ ఇఒ రమాదేవిపై భూ ఆక్రమణదారులు దాడి చేసిన ఘటనపై దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తీవ్రస్థాయిలో స్పందించారు. ఆలయాల ఇఒలపై దాడులు చేస్తే ఊరుకునేది లేదని ఆమె స్పష్టం చేశారు. దేవుని భూములు కబ్జా చేస్తే పిడి యాక్ట్ నమోదు చేసి జైలుకు పంపిస్తామని ఆమె హెచ్చరించారు. భద్రాద్రి రాముని ఆలయ భూముల సమస్యను పరిష్కరించాలని ఈ సందర్భంగా ఏపి ప్రభుత్వాన్ని ఆమె కోరారు.