రియల్ ఎస్టేట్ కేసులో మహేశ్బాబుకు లీగల్ నోటీసులు

రియల్ ఎస్టేట్ కేసులో మహేశ్బాబుకు లీగల్ నోటీసులు

రియల్  ఎస్టేట్​ కేసులో నటుడు మహేశ్​ బాబుకు లీగల్​ నోటీసులు జారీ చేసిన రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కోర్టు, తాజాగా ఆ కేసు విచారణను ఆగస్టు 7కు వాయిదా వేసింది. ఓ రియల్ ఎస్టేట్ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించిన కేసులో ఆయనను మూడో ప్రతివాదిగా కోర్టు చేర్చింది.  ఈ కేసులో మొత్తం ముగ్గురు ప్రతివాదులకు కోర్టు నోటీసులు జారీ చేసింది.

కోర్టు పంపిన నోటీసులు అందిన తర్వాత వారు వ్యక్తిగతంగా లేదా న్యాయవాదుల ద్వారా హాజరు కావొచ్చని పేర్కొంది. ఓ మహిళా డాక్టర్, మరో వ్యక్తి కలిసి కంచర్ల సతీష్ చంద్ర గుప్తా మాటలు నమ్మి బాలాపూర్‌లో ఒక్కో ప్లాటు కొనుగోలు చేయడానికి రూ.34.80 లక్షలు చెల్లించారు.  అన్ని లేఅవుట్ అనుమతులు ఉన్నాయని, మహేష్ బాబు ఫోటోతో ఉన్న బ్రోచర్‌లోని వెంచర్ ప్రత్యేకతలకు ఆకర్షితులైన వీరు, ప్లాట్ల కొనుగోలుకు డబ్బు చెల్లించారు.

తమ డబ్బు తిరిగి ఇవ్వమని కోరగా, రెండో ప్రతివాది అతికష్టం మీద కేవలం రూ.15 లక్షలు మాత్రమే వాయిదాల్లో తిరిగి ఇచ్చారు.  మిగిలిన డబ్బు తిరిగి ఇవ్వడంలో రెండో ప్రతివాది జాప్యం చేస్తూ మోహం చాటేయడంతో, బాధితులు మిగతా డబ్బును తిరిగి ఇప్పించామని వినియోగదారుల కోర్టును ఆశ్రయించారు. తాము రెండో ప్రతివాదికి పైకం చెల్లించినట్లు కోర్టుకు నివేదించారు.

కేసు విచారణ సమయంలో బాధితులు- ‘తాము మహేశ్​ బాబు యాడ్ చూసి మోసపోయినట్లు’ పేర్కొన్నారు. సూర్య డెవలపర్స్ తమను మోసం చేశారని, తమకు రావాల్సిన డబ్బులను తిరిగి ఇవ్వడం లేదని వెల్లడించారు. సాయి సూర్య డెవలపర్స్ ఆధ్వర్యంలోని ‘గ్రీన్ మెడోస్’ అనే ప్రాజెక్టుకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించినందుకు మహేష్ బాబుకు రూ.5.9 కోట్లు చెల్లించినట్లు తెలుస్తుంది.  

రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులను పంపిణీ చేయలేదని ఆరోపణలు రావడంతో  మనీలాండరింగ్ నిరోధక చట్టం, 2002 కింద కూడా దర్యాప్తు జరుగుతోంది. ముందస్తు చెల్లింపులు పొందిన తర్వాత రెండు సంస్థలు ఒకే భూమిని అనుమానించని కొనుగోలుదారులకు పదేపదే విక్రయించాయని ఆరోపణలు ఉన్నాయి. ఏప్రిల్ 16న, సికింద్రాబాద్, జూబ్లీ హిల్స్, బోవెన్‌పల్లిలోని ప్రాంగణాలతో సహా ఈ కేసుతో సంబంధం ఉన్న అనేక ప్రదేశాలలో ఈడీ విచారణ చేపట్టింది. ఆ సంస్థలు చేసిన రూ.100 కోట్ల ఆర్థిక లావాదేవీలు చట్టవిరుద్ధమైన కార్యకలాపంగా గుర్తించారు.