రష్యా నుంచి భారత్​కు మరిన్ని ఎస్-400 వ్యవస్థలు

రష్యా నుంచి భారత్​కు మరిన్ని ఎస్-400 వ్యవస్థలు
ఆపరేషన్ సిందూర్ సమయంలో ఎస్-400 వైమానిక రక్షణ క్షిపణి వ్యవస్థలు బాగా పనిచేసినందున, రష్యా నుంచి మరిన్ని ఎస్-400 వైమానిక రక్షణ వ్యవస్థలను కొనుగోలు చేసిన యోచనలో భారత్ ఉంది. లాంగ్ రేంజ్ ఉపరితలం నుంచి గగనతలానికి ప్రయోగించే క్షిపణి వ్యవస్థల మరో రెండు స్క్వాడ్రన్లను కొనుగోలు చేసే విషయాన్ని భారత్​  పరిశీలిస్తోందని రక్షణ వర్గాలు తెలిపాయి.

ఆపరేషన్ సిందూర్‌లో ఎస్-400 అద్భుతంగా పనిచేసిందని, పాకిస్థాన్​ వైమానిక దళ యుద్ధ విమానాలను, వాయుమార్గాన ముందస్తు హెచ్చరిక విమానాలను ధ్వంసం చేసిందని పేర్కొన్నాయి. 300 కిలోమీటర్లకు పైగా దూరంలో ఉన్న విమానాలను విజయవంతంగా ఢీకొట్టడం ద్వారా ఒక రకమైన రికార్డును సృష్టించగలిగింది. 2018లో జరిగిన ఒప్పందం ప్రకారం, ఐదు ఎస్-400 స్క్వాడ్రన్‌లలో మరో రెండు స్క్వాడ్రన్‌ల డెలివరీ కోసం భారత్ కూడా వేచి ఉంది.

మొదటి మూడు స్క్వాడ్రన్‌లను ఇప్పటికే స్వీకరించింది. కార్యాచరణలో మోహరించింది. నాలుగో స్క్వాడ్రన్ డెలివరీకి ముందు, రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధం ప్రారంభమైంది. దీంతో భారత్ కోసం ఉద్దేశించిన వ్యవస్థలు బహుశా యుద్ధంలో ఉపయోగించి ఉండవచ్చు. రష్యా ఇప్పుడు వచ్చే ఆర్థిక సంవత్సరంలో మిగిలిన రెండు వ్యవస్థలను డెలివరీ చేస్తామని హామీ ఇచ్చింది. మరోవైపు, పాకిస్థాన్​తోపాటు పీవోకేలోని ఉగ్రస్థావరాల లక్ష్యంగా చేపట్టిన ఆపరేషన్ సిందూర్​లో కీలక పాత్ర పోషించిన సుఖోయ్ జెట్‌లను అప్‌గ్రేడ్ చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. 

ఈ మేరకు రష్యా రక్షణ మంత్రి ఆండ్రీ బెలోసోవ్‌తో తాజాగా జరిగిన చర్చల్లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆ విషయాన్ని ప్రతిపాదించారు. సుఖోయ్-30ఎంకెఐ యుద్ధ విమానాల అప్‌గ్రేడ్, ఎయిర్-టు-ఎయిర్ క్షిపణుల ఉత్పత్తి, ఎస్-400 క్షిపణి వ్యవస్థలపై చర్చించారు. షాంఘై సహకార సంస్థ సమావేశం సందర్భంగా ఇరు దేశాల రక్షణ మంత్రులు ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. భారత వైమానిక దళం దాదాపు 260 సుఖోయ్ 30-ఎంకెఐ జెట్‌లను నడుపుతోంది. గత నెలలో జరిగిన ఆపరేషన్ సిందూర్‌లో రష్యాకు చెందిన సుఖోయ్ జెట్‌లు కీలకంగా వినియోగించింది.

“ఎస్-400 వ్యవస్థల సరఫరా, సుఖోయ్​ ఎంకెఐ అప్‌గ్రేడ్‌లు, కీలకమైన సైనిక హార్డ్‌వేర్‌ను త్వరితగతిన కొనుగోలు చేయడం ఈ సమావేశానికి చెందిన కొన్ని ముఖ్యమైన అంశాలు. రెండు దేశాల నాయకుల మధ్య ఇటీవల జరిగిన అత్యంత ముఖ్యమైన సమావేశాల్లో ఇదొకటి. ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో రక్షణ ఉత్పత్తిని పెంచాల్సిన అవసరం ఉంది” అని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.